🕉వేదాంత సంగ్రహం🕉
1 490Subscribers
-224 hours
-37 days
+330 days
- Subscribers
- Post coverage
- ER - engagement ratio
Data loading in progress...
Subscriber growth rate
Data loading in progress...
యత్ర యోగేశ్వరః కృష్ణో యత్ర పార్థో ధనుర్ధరః ।
తత్ర శ్రీర్విజయో భూతిః ధ్రువా నీతిర్మతిర్మమ ।। 78 ।।
ఎక్కడెక్కడైతే యోగేశ్వరుడైన శ్రీ కృష్ణుడు మరియు అత్యున్నత విలుకాడైన అర్జునుడు ఉంటారో, అక్కడ సకల ఐశ్వర్యము, సర్వ విజయము, సకల-సమృద్ధి, మరియు ధర్మమూ ఉంటాయి. ఇది నా నిశ్చిత అభిప్రాయము.
ఈ శ్లోకంతో, ఒక గంభీరమైన ప్రకటన ఇస్తూ భగవద్గీత ముగుస్తున్నది. ధృతరాష్ట్రుడు యుద్ధం యొక్క పరిణామం/ఫలితం పట్ల ఆందోళనతో ఉండినాడు. రెండు సైన్యముల పరస్పర భౌతిక పరమైన సామర్థ్యముల లెక్కలు వ్యర్థమని సంజయుడు అతనికి చెప్తున్నాడు. ఈ యుద్ధంలో ఒక్కటే తీర్పు ఉంటుంది - విజయం ఎల్లప్పుడూ భగవంతుడు మరియు అతని శుద్ధ భక్తుడు ఉన్న పక్షమే ఉంటుంది; అదే పక్షాన మంచితనమూ, ఆధిపత్యము, మరియు సమృద్ధి కూడా ఉంటాయి.
భగవంతుడు సర్వ స్వతంత్రుడు, స్వయం సమృద్ధిగల జగదీశ్వరుడు, మరియు అర్చన-ఆరాధనలకు అత్యంత యోగ్యుడు. న తత్సమశ్చాభ్యధికశ్చ దృశ్యతే (శేతాశ్వాతర ఉపనిషత్తు 6.8) ‘ఆయనకు సరితూగేవారు ఎవరూ లేరు; ఆయనకంటే గొప్పవారు ఎవరూ లేరు;’ తన అసమానమైన మహిమను ప్రకటించటానికి తగిన వాహకం ఆయనకు కావాలి. ఆయనకు శరణాగతి చేసిన జీవాత్మ, భగవంతుని యశస్సుని ప్రకాశింపచేయటానికి అటువంటి ఒక చక్కటి వాహకంగా ఉపయోగపడుతుంది. ఈ విధంగా, ఎక్కడైతే సర్వోత్కృష్ట పరమేశ్వరుడు మరియు ఆయన యొక్క పరిపూర్ణ భక్తుడు ఉంటారో, పరమ సత్యము యొక్క తేజస్సు ఎల్లపుడూ అసత్యపు చీకటిని జయిస్తుంది. ఇంకే ఇతర ఫలితమూ ఉండజాలదు.
Bhagavad Gita: Chapter 18, Verse 78
తచ్చ సంస్మృత్య సంస్మృత్య రూపమత్యద్భుతం హరేః ।
విస్మయో మే మహాన్ రాజన్ హృష్యామి చ పునఃపునః ।। 77 ।।
మరియు ఆ శ్రీ కృష్ణుడి అత్యద్భుతమైన మరియు ఆశ్చర్యకరమైన విశ్వ రూపమును గుర్తుచేసుకుంటూ, ఆశ్చర్యచకితుడనై, పదేపదే మహదానందముతో పదేపదే పులకించి పోతున్నాను.
మహోన్నత యోగులకు కూడా అరుదుగా కనిపించే భగవంతుని విశ్వ రూప దర్శన భాగ్యము, అర్జునుడికి కలిగింది. అర్జునుడు ఆయన యొక్క భక్తుడు మరియు స్నేహితుడు, అందుకే చాలా ప్రియమైన వాడు కావున, ఆయనకు తన విశ్వరూపమును చూపిస్తున్నానని శ్రీ కృష్ణుడు చెప్పాడు. సంజయుడు కూడా ఆ విశ్వ రూపమును చూసాడు, ఎందుకంటే భగవంతుని దివ్యలీలలలో పాలు పంచుకునే భాగ్యము ఆయనకు కథకుడిగా లభించింది. ఊహించని అనుగ్రహము మన దారిలో ఒక్కోసారి వస్తుంటుంది. దానిని సరిగ్గా ఉపయోగించుకుంటే, మనం సాధనలో అత్యంత వేగంతో ముందుకెళ్లవచ్చు. సంజయుడు పదేపదే తాను చూసిన దానిని గుర్తుచేసుకుంటున్నాడు మరియు భక్తి ప్రవాహంలో ఓలలాడి పోతున్నాడు.
Bhagavad Gita: Chapter 18, Verse 77
Show all...
Log in or sign up to view
See posts, photos and more on Facebook.
రాజన్ సంస్మృత్య సంస్మృత్య సంవాదమిమమద్భుతమ్ ।
కేశవార్జునయోః పుణ్యం హృష్యామి చ ముహుర్ముహుః ।। 76 ।।
సర్వోత్కృష్ట శ్రీ కృష్ణ భగవానునకు మరియు అర్జునుడికి మధ్య జరిగిన ఈ మహాద్భుతమైన సంవాదమును పదేపదే గుర్తుచేసుకుంటూ, ఓ రాజా, నేను మళ్ళీ మళ్ళీ ఆనందిస్తున్నాను.
ఆధ్యాత్మిక అనుభవము అనేది సమస్త భౌతిక ఆనందాలని ఒక్కచోట కూర్చినదానికన్నా ఎక్కువ హర్షమును, తృప్తిని కలిగించే ఆనందముని ఇస్తుంది. సంజయుడు అటువంటి ఆనందమును అనుభవిస్తూ, తన అనుభవాన్ని అంధుడైన ధృతరాష్ట్రునితో పంచుకుంటున్నాడు. ఈ అద్భుతమైన సంవాదముని గుర్తుచేసుకుంటూ, ఆయన దివ్య ఆనందమును అనుభవిస్తున్నాడు. ఈ గీతా శాస్త్రములో ఉన్న జ్ఞానము యొక్క మహనీయతను మరియు సంజయుడు చూసిన లీలల యొక్క దైవత్వమును, ఇది సూచిస్తున్నది.
Bhagavad Gita: Chapter 18, Verse 76
వ్యాసప్రసాదాఛ్చ్రుతవాన్ ఏతద్గుహ్యమహం పరమ్ ।
యోగం యోగేశ్వరాత్ కృష్ణాత్ సాక్షాత్ కథయతః స్వయమ్ ।। 75 ।।
వేదవ్యాసుని అనుగ్రహం చేత, నేను ఈ యొక్క సర్వోత్కృష్ట పరమ రహస్యమైన యోగమును, స్వయంగా యోగేశ్వరుడైన శ్రీ కృష్ణుడి నుండి తెలుసుకున్నాను.
శ్రీ కృష్ణ ద్వైపాయన వ్యాసదేవుడు, ఆయననే మహర్షి వేద వ్యాసుడు అని కూడా అంటారు; ఆయన సంజయుని యొక్క ఆధ్యాత్మిక గురువు. తన గురువు గారి అనుగ్రహం చేత, సంజయుడు హస్తినాపుర రాజమందిరము లోనే కూర్చుని, కురుక్షేత్ర యుద్ధ భూమిలో జరిగేదంతా తెలుసుకోవటానికి, అతనికి దివ్యదృష్టి ప్రసాదించబడింది. తన గురువు గారి కృప వలననే, తనకు సర్వోన్నత యోగ శాస్త్రమును స్వయంగా యోగేశ్వరుడైన శ్రీ కృష్ణుడి ద్వారా వినే అవకాశం లభించింది అని ఇక్కడ సంజయుడు ఒప్పుకుంటున్నాడు.
బ్రహ్మ సూత్రములు, పద్దెనిమిది పురాణములు, మహాభారతము, ఇంకా ఇతర గ్రంథాలను వ్రాసిన వేద వ్యాసుడు, ఒక భగవత్ అవతారము, మరియు ఆయనకి దివ్యదృష్టి వంటి శక్తులు ఉన్నాయి. ఈ విధంగా ఆయన కేవలం శ్రీ కృష్ణుడికి, అర్జునుడికి మధ్య సంభాషణనే కాక, సంజయుడికీ మరియు ధృతరాష్ట్రుడికి మధ్య జరిగిన సంభాషణను కూడా విన్నాడు. అందువలన, ఆయన భగవద్గీత లో ఈ రెండు సంభాషణలను పేర్కొన్నాడు.
Bhagavad Gita: Chapter 18, Verse 75
సంజయ ఉవాచ ।
ఇత్యహం వాసుదేవస్య పార్థస్య చ మహాత్మనః ।
సంవాదమిమమశ్రౌషమ్ అద్భుతం రోమహర్షణమ్ ।। 74 ।।
సంజయుడు పలికెను: ఈ విధంగా నేను, వసుదేవుని పుత్రుడైన శ్రీ కృష్ణుడికి మరియు మహాత్ముడు, ప్రిథ పుత్రుడూ అయిన అర్జునుడికి మధ్య జరిగిన సంవాదమును విన్నాను. ఇది ఎంత అద్భుతమైనదంటే నా రోమములు నిక్కబొడుచుకుంటున్నాయి.
ఈ విధంగా సంజయుడు, భగవద్గీత అనే దివ్య ఉపదేశమును విన్నవించుటను ముగిస్తున్నాడు. అర్జునుడిని మహాత్ముడు అని అంటున్నాడు, ఎందుకంటే అతను శ్రీ కృష్ణుడి యొక్క ఉపదేశాన్ని మరియు సలహాని పాటించాడు, దానిచే మిక్కిలి వివేకవంతుడు అయినాడు. సంజయుడు ఇక ఇప్పుడు, ఆ దివ్య సంవాదమును వింటూ, తాను ఎంత ఆశ్చర్యానికి మరియు సంభ్రమానికి గురయ్యాడో చెప్తున్నాడు. రోమాలు నిక్కబొడుచు కోవటం అనేది గాఢమైన భక్తికి ఉన్న ఒక లక్షణం. భక్తి రసామృత సింధు ఇలా పేర్కొంటున్నది:
స్థంభ స్వేద ఽథ రోమాంచః స్వర భేదోఽథ వేపథుః
వైవర్ణ్యమశ్రుః ప్రలయ ఇత్యష్టౌ సాత్త్వికాః స్మృతాః
‘భక్తి తన్మయత్వంలో వచ్చే ఎనిమిది లక్షణాలు ఏమిటంటే: కదలిక లేకుండా స్థంభించిపోవటం, చెమట పట్టడం, రోమములు నిక్కబొడుచు కోవటం, స్వరం గద్గదమై పోవటం, వణకటం, మొఖం రంగు పీలగా అయిపోవటం, కన్నీరు కారటం, మరియు మూర్ఛ పోవటం.’ సంజయుడు ఇటువంటి గాఢమైన భక్తి యుక్త భావములను అనుభూతి చెందుతున్నాడు, అందుకే ఆయన రోమములు దివ్యఆనందంచే నిక్కబొడుచుకున్నాయి.
ఎక్కడో దూరంగా జరిగే యుద్ధంలో జరుగుతున్న సంభాషణను సంజయుడు ఎలా వినగలిగాడు అన్న సందేహం ఎవరికైనా రావచ్చు. అది ఎలాగో తదుపరి శ్లోకంలో తెలియచేస్తున్నాడు.
Bhagavad Gita: Chapter 18, Verse 74
అర్జున ఉవాచ ।
నష్టో మోహః స్మృతిర్లబ్ధా త్వత్ప్రసాదాన్మయాచ్యుత ।
స్థితోఽస్మి గతసందేహః కరిష్యే వచనం తవ ।। 73 ।।
అర్జునుడు పలికెను: ఓ అచ్యుతా (దోషరహితుడా), నీ కృపచే నా యొక్క మోహభ్రాంతి నిర్మూలించబడినది, మరియు నేను జ్ఞానములో స్థితుడనై ఉన్నాను. నాకు ఇప్పుడు సందేహాలు ఏవీ లేవు, మరియు నీ ఉపదేశాల ప్రకారం చేస్తాను.
ప్రారంభంలో, అర్జునుడు ఒక విస్మయ పరిస్థితిని ఎదుర్కొన్నాడు, మరియు ఆ పరిస్థితిలో తన కర్తవ్యము పట్ల అయోమయానికి గురయ్యాడు. దుఃఖము/శోకముచే నిండిపోయి, ఆయుధాలు విడిచి తన రథంలో కూలబడిపోయాడు. తన శరీర ఇంద్రియములపై దాడి చేసిన శోకానికి, ఎటువంటి ప్రత్యుపాయం దొరకడంలేదు అని ఒప్పుకున్నాడు. కానీ, ఇప్పుడు తనకు తానే పూర్తిగా మారిపోయినట్లుగా తెలుసుకున్నాడు, మరియు తనకు జ్ఞానోదయమయినది అని, ఇక ఏమాత్రమూ గందరగోళమైన చిత్తం లేదు అని ప్రకటిస్తున్నాడు. భగవత్ సంకల్పానికి తనను తాను అర్పించుకొని, ఇక శ్రీ కృష్ణుడు చెప్పిన విధముగా చేస్తానని ప్రకటిస్తున్నాడు. ఇదే అతనిపై భగవత్ గీత ఉపదేశం చూపిన ప్రభావము. కానీ, త్వత్ ప్రసాదాన్ మయాచ్యుత, అంటున్నాడు; అంటే, ‘ఓ శ్రీ కృష్ణా, కేవలం నీ ఉపదేశం కాదు, నిజానికి నీ కృపయే నా అజ్ఞానమును తొలగించింది.’ అని.
భౌతిక జ్ఞాన సముపార్జనకు కృప అవసరం లేదు. మనం ఆ విద్యాలయానికి కానీ, ఉపాధ్యాయునికి కానీ, డబ్బు కట్టి, ఆ జ్ఞానమును తెలుసుకోవచ్చు. కానీ, ఆధ్యాత్మిక జ్ఞానమును కొనలేము లేదా అమ్మలేము. అది కృప ద్వారా ఇవ్వబడుతుంది మరియు విశ్వాసము, వినమ్రత ద్వారా అందుకోబడుతుంది. కాబట్టి, మనం భగవద్గీతని అహంకార దృక్పథంతో చేరితే, ‘నేను చాలా తెలివికలవాడిని, ఈ ఉపదేశం యొక్క విలువ ఏమిటో వెలకడతాను’ అని అనుకుంటే, భగవద్గీతను ఎన్నటికీ అర్థం చేసుకోలేము. అలాంటి దృక్పథంలో ఉంటే, మన బుద్ధి ఆ శాస్త్రములో ఏదో తప్పు అనిపించే దాన్ని పట్టుకొని దాని మీదే అలోచించి, దాని వల్ల ఆ మొత్తం శాస్త్రాన్నే తప్పని తిరస్కరిస్తుంది. భగవద్ గీతపై ఎన్నెన్నో వ్యాఖ్యానాలు వ్రాయబడ్డాయి, మరియు గత ఐదు వేల సంవత్సరాలలో ఈ దివ్య ఉపదేశం యొక్క అసంఖ్యాకమైన పాఠకులు కూడా ఉన్నారు, కానీ వీరిలో ఎంతమందికి అర్జునుడిలా జ్ఞానోదయమయింది? ఒకవేళ మనం నిజంగా ఈ జ్ఞానాన్ని అందుకోదలిస్తే, మనం కేవలం చదవటమే కాదు, విశ్వాసము మరియు ప్రేమయుక్త శరణాగతి ద్వారా, శ్రీ కృష్ణుడి కృపను ఆకర్షించాలి. ఆ తరువాత మనకు భగవత్ గీత యొక్క సారాంశం, ఆయన కృపచే, అర్థమవుతుంది.
Bhagavad Gita: Chapter 18, Verse 73