డీఎస్సీ–2025 నియామకాల్లో అక్రమాల వ్యవహారం రోజురోజుకూ మరింత బట్టబయలవుతోంది. రాష్ట్రంలోని వివిధ ప్రాంతాల నుంచి మరిన్ని కొత్త ఆధారాలు, వాస్తవాలు వెలుగులోకి వస్తున్నాయి. అవన్నీ డీఎస్సీలో తీవ్ర అక్రమాలను బయటపెడుతూ, చంద్రబాబు వెన్నుపోటు పార్టీ సమాధానం చెప్పాల్సిన అనేక ప్రశ్నలను లేవనెత్తుతున్నాయి.
ఆ ప్రశ్నలకు సమాధానం చెప్పి, నిజాలను నిగ్గు తేల్చేందుకు సీబీఐ విచారణకు అంగీకరించాల్సిన ప్రభుత్వం.. స్వతంత్ర దర్యాప్తును తిరస్కరిస్తోంది. మరోవైపు ప్రశ్నిస్తున్న గొంతులను అణచివేసే మార్గాన్ని వెన్నుపోటు పార్టీ ఎంచుకుంది. డీఎస్సీ నియామకాల అక్రమాలపై గొంతెత్తుతున్న ప్రతిపక్షంతో పాటు, కొన్ని మీడియా సంస్థలు, సామాజిక కార్యకర్తలు, వ్యక్తులకు సంబంధించిన సామాజిక పోస్టులు, ఖాతాలను మెటా సామాజిక మాధ్యమాలైన ఫేస్బుక్, ఇన్స్టాగ్రామ్ లో నియంత్రిస్తున్నారు. ‘చట్టపరమైన ఆదేశాలు’ అంటూ వాటిని తొలగించడం లేదా జియోబ్లాక్ చేయడం జరుగుతోంది. ఆ ఆంక్షల బారిన పడిన ఖాతాలు, పేజీలు, ఫేస్బుక్లో సాక్షి టీవీ, ఇన్స్టాగ్రామ్లో సాక్షి డిజిటల్, బిగ్ టీవీ, జగనన్న కనెక్ట్స్తో పాటు, డీఎస్సీ స్కామ్పై ప్రశ్నిస్తున్న ఇతర వ్యక్తిగత హ్యాండిల్స్ కూడా ఉన్నాయి.
వెన్నుపోటు పార్టీ ప్రభుత్వం అనుసరిస్తున్న ఈ వ్యవహారం కేవలం డీఎస్సీ స్కామ్తోనే ఆగిపోవడం లేదు. వెన్నుపోటు పార్టీ ప్రభుత్వ అవినీతి, వైఫల్యాలు, అమలు కాని సూపర్ సిక్స్, సూపర్ సెవెన్ ఎన్నికల హామీలు, నిరంకుశత్వం, అధికార దుర్వినియోగంపై ప్రశ్నిస్తున్న ప్రతి ఒక్కరినీ లక్ష్యంగా చేసుకుంటున్నారు. ప్రశ్నలకు సమాధానం చెప్పలేక, ప్రశ్నించిన వారి గొంతు నొక్కేస్తున్నారు. ఇది పరిపాలన కాదు. నియంతృత్వ సెన్సార్షిప్!
వాక్ స్వాతంత్య్రం, భావ ప్రకటన స్వేచ్ఛ భారత రాజ్యాంగం కల్పించిన ప్రాథమిక హక్కులు. ప్రశ్నలు రాజకీయంగా ఇబ్బందికరంగా ఉన్నాయనే కారణంతో ప్రతిపక్షం, మీడియా, సామాజిక కార్యకర్తలు, పౌరుల గొంతు నొక్కే అధికారం ఏ ప్రభుత్వానికీ లేదు.
చంద్రబాబు గారూ.. మీరు భయపడుతున్నది ప్రశ్నలకా? లేక వాటి సమాధానాలకా? డీఎస్సీ నియామకాల్లో ప్రతిరోజూ కొత్తగా వెలుగు చూస్తున్న ఆధారాలు ఒకవేళ అవాస్తవమైతే.. ప్రజల ముందుకు వచ్చి వాస్తవాలతో వాటిని ఖండించండి. ఆ పని చేయడం లేదు. ఇంకా సీబీఐ విచారణను కూడా ఎందుకు తిరస్కరిస్తున్నారు? అక్రమాలను బయట పెడుతున్న వారి గొంతు ఎందుకు అణచివేస్తున్నారు? వారి పోస్టులు, ఖాతాలను ఎందుకు నియంత్రిస్తున్నారు? ఒక్క విషయం గుర్తుంచుకోండి. ఒక పోస్టును తొలగించినంత మాత్రాన ఆధారాలు చెరిగిపోవు. ఒక ఖాతాను బ్లాక్ చేసినంత మాత్రాన నిజాన్ని పాతిపెట్టలేరు. ప్రతిపక్షాన్ని రాజకీయంగా ఎదుర్కోండి. ప్రజలకు ప్రజాస్వామ్యబద్ధంగా సమాధానం చెప్పండి. రాజ్యాంగబద్ధంగా పాలించండి.
డీఎస్సీ పరీక్ష రాయకుండానే, ఉపాధ్యాయ అర్హత పరీక్ష–‘టెట్’లో ఉత్తీర్ణులు కాకుండానే కొందరికి ఉపాధ్యాయ ఉద్యోగాలు ఇచ్చి.. మిమ్మల్ని మీరు ఎలా సమర్థించుకుంటారు? డీఎస్సీలో స్పోర్ట్స్ కోటా భర్తీ కోసం కొత్తగా జీఓలు జారీ చేశారు. ఆ నియామకాలు పూర్తి చేయగానే, ఆ జీఓలు రద్దు చేశారు. అయినప్పటికీ ఆ జీఓల ద్వారా నియమితులైన అభ్యర్థులు ఉద్యోగాల్లో కొనసాగుతున్నారు. అంటే అక్రమ నియామకాలకు ముందు గేట్లు తెరిచి.. ఆ నియామకాలు పూర్తయ్యాక వాటిని మూసివేశారు. ఇదంతా అవినీతిని సూచించడం లేదా?
అందుకే నియంతృత్వ సెన్సార్షిప్లో భాగంగా నియంత్రించిన ప్రతి సామాజిక మాధ్య ఖాతాను, పోస్టును, కంటెంట్ను తక్షణమే పునరుద్ధరించాలని డిమాండ్ చేస్తున్నాను. అలాగే అందరూ లేవనెత్తుతున్న ప్రశ్నలన్నింటికీ స్పష్టమైన సమాధానాలు చెప్పాలి.
చంద్రబాబు గారికి, ఆయన ప్రభుత్వానికి నేను ఒక సవాల్ చేస్తున్నాను. డీఎస్సీ-2025 నియామకాలు నిజాయతీగా, పారదర్శకంగా జరిగాయని మీరు అనుకుంటే వెంటనే సీబీఐ విచారణకు ఆదేశించండి. స్వతంత్ర దర్యాప్తు ద్వారా నిజానిజాలు తేల్చండి. అలాగే డీఎస్సీ నియామకాల్లో అక్రమాలు జరిగినట్లు ఆధారాలతో సహా బయటపడుతున్నందున, వాటికి నైతిక బాధ్యత వహిస్తూ విద్యా శాఖ మంత్రి నారా లోకేష్ తన పదవికి రాజీనామా చేయాలి.
ఇంకా..
వెంటనే సామాజిక మాధ్యమాల ఖాతాలు పునరుద్ధరించండి.
వాటి సెన్సార్షిప్ను ఆపండి.
అన్ని ప్రశ్నలకు సమాధానం చెప్పండి.
సీబీఐ విచారణకు ఆదేశించండి.
అంతా పారదర్శకంగా జరిగినప్పుడు, దాచుకోవడానికి ఏమీ లేనప్పుడు మీకెందుకింక భయం?