865
Subscribers
-124 hours
-17 days
-330 days
Posts Archive
865
07-23-గీతా మకరందము.
విజ్ఞానయోగము
-పూజ్యశ్రీశ్రీశ్రీ విద్యాప్రకాశానందగిరి స్వాములవారు,
శ్రీశుకబ్రహ్మాశ్రమము, శ్రీకాళహస్తి
॥అ|| ఇతరదేవతల నారాధించుటవలన లభించునవి నశ్వరఫలితములే యనియు, తన్నారాధించుటచే శాశ్వతమోక్షము లభించుననియు భగవానుడు వచించున్నారు-
అన్తవత్తు ఫలం తేషాం తద్భవత్యల్పమేధసామ్ |
దేవాన్ దేవయజో యాన్తి
మద్భక్తా యాన్తి మామపి ||
టీక:- అల్పమేధసామ్ = అల్పబుద్ధికలిగిన, తేషామ్ = వారియొక్క, తత్ ఫలమ్ తు = ఆ ఫలమన్ననో, అన్తవత్ = అంతముగలదిగా (అశాశ్వతముగా), భవతి = అగుచున్నది, దేవయజః = దేవతలను పూజించువారు, దేవాన్ = దేవతలను, యాన్తి= పొందుచున్నారు, మద్భక్తాః= నా భక్తులు, మామ్ అపి యాన్తి = నన్నే పొందుచున్నారు.
తా:- అల్పబుద్ధి కలిగిన వారియొక్క ఆ ఫలము నాశవంతమైయున్నది. (ఏలననగా) దేవతలను పూజించువారు దేవతలచే పొందుచున్నారు. నా భక్తులు (నన్ను పూజించువారు) నన్నే పొందుచున్నారు.
వ్యాఖ్య :- పరమాత్మను వదలి ఇతరదేవతల నారాధించువారెట్టివారో వారెట్టి ఫలితమును బొందగలరో, భగవద్భక్తులెట్టి ఫలితములను బొందగలరో ఈ శ్లోకమున వివరింపబడినది. సాక్షాత్ దేవదేవుడగు పరమాత్మను వదలి ఇతర దేవతల నాశ్రయించువారు, భజించువారు అల్పఫలములనే పొందుదురు. కావున అట్టి నశ్వరఫలితములకై అఱ్ఱులు చాచువారు అల్పబుద్ధి (Small Brain) కలవారని ఇట పేర్కొనబడినది. ఏలయనిన, పూర్ణబుద్ధి కలవారైనచో శాశ్వతఫలమొసంగునట్టి, జన్మరాహిత్యమును కలుగజేయునట్టి పరమాత్మనే ఆశ్రయించెడివారుగదా! అల్పాధికారములు, అల్పజీవితములు గలిగిన దేవతలను నమ్ముకొని శాశ్వతపరమాత్మను విస్మరించువారు అల్పబుద్ధులే కదా! వారు పొందెడు ఫలమున్ను అల్పముగనేయుండును (అన్తవత్). గంగానదిని వదలి ప్రక్కనేఉన్న చిన్నబావిని ఆశ్రయించువాడెట్టివాడో, కల్పవృక్షమును వదలి ప్రక్కనే గల చిన్నచెట్టును జేరువాడెట్టివాడో, పరమాత్మనువదలి అల్పఫలప్రదాతలగు దేవతల నాశ్రయించువారు అట్టివారేయగుదురు. కనుకనే వారిచ్చు స్వల్పఫలములను, భోగ్యపదార్థములను బడసి ఆనందించుచున్నారు.
ప్రపంచమున ఏ వస్తువుకాని, ఏ వ్యక్తిగాని, ఆతడింద్రుడైనను సరియే, చంద్రుడైనను సరియే దృశ్యవర్గములోనే చేరియుండును. గావున కాలక్రమమున నశించిపోవును. దృగ్వస్తువగు ఆత్మయొకటియే ఈ ప్రపంచమున ఏకైక అవినాశివస్తువు. కనుక విజ్ఞులద్దానికొఱకే అన్వేషించుదురు. అద్దానినే ఆశ్రయించుదురు. అల్పబుద్ధికలవారే ప్రాపంచికసుఖముల నొసంగు నశ్వర దేవతాసమూహమును ఆశ్రయించుదురు. ‘దేవతల నారాధించువారు దేవతలను, నన్నారాధించువారు నన్ను పొందుదురు’ అని భగవాను డిచట తెలియజేసిరి. కాబట్టి నిరతిశయ సుఖప్రదాతయగు పరమాత్మయొక్క భక్తుడగుట ఉత్తమమో, అల్పసుఖమొసంగగల ఆ యా దేవతలయొక్క భక్తులగుట ఉత్తమమో వివేకముకలవారు యోచించవలెను. అట్లు యోచించి తమ యావచ్ఛక్తిని, అమూల్యమగు మానవజీవితమును పునరావృత్తిరహిత శాశ్వత మోక్షసుఖము నొసంగు పరమాత్మయొక్క సాక్షాత్కారమందే వినియోగించి ధన్యులు కావలెను. ఎవరు దేనిని ఆరాధించిన, వారు దానినే పొందుదురు. రాక్షసులను ఆరాధించిన రాక్షసులనే పొందుదురు. దేవతల నారాధించిన దేవతలనే పొందుదురు. పరమాత్మ నారాధించిన పరమాత్మనే పొందుదురు. బంధముగాని, స్వర్గముగాని మోక్షముగాని వారివారి చేతులలోనున్నది. కావున, కొంత తెలివి నుపయోగించి, దూరముగ ఆలోచించి తాను యత్నించునది ఎట్టి ఫలితమైయున్నది? అది సంసారబంధమును రహితమొనర్పగలదా? లేక దానిని ఇంకను దృఢపఱచునా? అని బాగుగ యోచించియే సాధకుడు కార్యమునకు దిగవలెను. కావున మహాత్ములగు సద్గురువుల వలనను, ఇట్టి గీతాది సద్గ్రంథములవలనను ప్రపంచములోని సర్వోత్తమ లక్ష్యమేదియో చక్కగా నెఱిగి అట్టి సర్వేశ్వరునియొక్క (పరమాత్మయొక్క) పాదారవిందములనే అనన్యముగ ఆశ్రయించి తరించవలెను.
ప్ర:- దేవతల నారాధించువారు పొందు ఫలమెట్టిది?
ఉ:- నాశవంతమైనది (అంతము కలది).
ప్ర:- అట్టి నాశవంతమగు ఫలమునకై ప్రయత్నించు వారెట్టివారు?
ఉ:- అల్పబుద్ధికలవారు (అల్పమేధసామ్).
ప్ర:- దేవతారాధకులు దేనిని పొందుదురు? పరమాత్మను అర్చించువారు దేనిని పొందుదురు?
ఉ:- దేవతారాధకులు ఆయాదేవతలను, భగవదారాధకులు భగవంతుని (ఆత్మసాక్షాత్కారరూప మోక్షమును) పొందుదురు.
ప్ర:- కాబట్టి విజ్ఞుడగువాడేమి చేయవలెను?
ఉ:- శాశ్వతమోక్షపదవి నొసంగు పరమాత్మనే ఆశ్రయించవలెను.
865
07-22-గీతా మకరందము.
విజ్ఞానయోగము
-పూజ్యశ్రీశ్రీశ్రీ విద్యాప్రకాశానందగిరి స్వాములవారు,
శ్రీశుకబ్రహ్మాశ్రమము, శ్రీకాళహస్తి
అ|| ఆ యితర దేవతల ద్వారా భగవానుడే వారికి తగిన ఫలితములు నొసంగుదురని తెలుపబడుచున్నది.
స తయా శ్రద్ధయా యుక్తః
తస్యారాధన మీహతే |
లభతే చ తతః కామాన్
మయైవ విహితాన్ హి తాన్ ||
టీక:- సః = అతడు (పైన తెలుపబడిన కామ్యభక్తుడు) తయా శ్రద్ధయా = అట్టి శ్రద్ధతో, యుక్తః = కూడుకొనినవాడై, తస్య = ఆ దేవతయొక్క, ఆరాధనమ్ = పూజను, ఈహతే = చేయుచున్నాడు, మయా ఏవ = = నా చేతనే, విహితాన్ = విధింపబడిన, తాన్ కామాన్ హి = ఆయాకోరికలనే (కోరినవస్తువులనే), తతః = ఆ దేవతలవలన, లభతే = పొందుచున్నాడు.
తా:- అతడు (పైన తెలుపబడిన కామ్యభక్తుడు) అట్టి శ్రద్ధతో గూడుకొనినవాడై ఆ యా దేవతలయొక్క ఆరాధనను గావించుచున్నాడు. మఱియు నాచే విధింపబడిన ఆ యా యిష్టఫలములను ఆ యా దేవతలద్వారా పొందుచున్నాడు.
వ్యాఖ్య:- ఆ ప్రకారముగ భగవంతునిచే స్థిరపఱచబడినట్టి శ్రద్ధతో గూడుకొనిన వాడై ఆ భక్తుడు ఆ యా దేవతల నారాధించుచు తత్ఫలితముగ వారినుండి తన యిష్టఫలములను బొందుచున్నాడు. అట్లా దేవతలనుండి యాతడు తన యభీష్టఫలములను బడసినప్పటికిని, అయ్యవి భగవంతునిచే నిర్దేశింపబడినవే యగును. కాబట్టి వాస్తవముగ భగవంతునినుండియే యాతనికి లభించినవగును. ఈ చరాచర ప్రపంచమంతయు ఒక ప్రభుత్వ యంత్రాగము (Universal Government). పరమాత్మ దాని యధిపతి. ఇంద్రాది దేవతలందఱు భిన్నభిన్నశాఖలను నిర్వహించు ఉద్యోగులు. జగత్పరిపాలనానియమములన్నింటిని, శాసనములన్నింటిని జగత్ప్రభువగు పరాత్పరుడే తొలుదొల్త నిర్ణయించివైచెను. వానిననుసరించియే ఆ యా క్రింది శాఖాధిపతులు కార్యముల నమలుజరుపవలసి యుండును. కాబట్టి భక్తులు వారివారి వాంఛితములను ఆ యా దేవతలద్వారా పొందినను దేవదేవుడగు సర్వేశ్వరుడే దాని నిచ్చినట్లగును (ప్రభుత్వమున క్రింది ఉద్యోగిద్వారా జరుపబడినది వాస్తవముగ ప్రభుత్వాధినేతయొక్క శాసనమే కావున అతడే జరిపినట్లు).
భగవంతుడు కల్పవృక్షము వంటివారు. వారి నాశ్రయించి శ్రద్ధతో ఎవరేది కోరిన దానిని వారి కొసంగుదురు. కాబట్టి అల్పములగు ప్రాపంచిక దృశ్యపదార్థములను వారిని కోరుటకంటె శాశ్వతమగు మోక్షమునే కోరుట శ్రేయస్కరము.
ఈ శ్లోకము చివరగల ‘హి, తాన్’ అను రెండు పదములను కలిపి కొందఱు ‘హితాన్’ అని అన్వయించి ‘హితాన్,కామన్’ - ఇష్టములైన భోగ్యవస్తువులు అని అర్థము చెప్పిరి. కాని అయిష్టములైన భోగ్యవస్తువులను ఎవరును కోరరు గనుక ఆ విశేషణము దానికి తగిలించుట అనవసరమని తోచుచున్నది.
ప్ర:- ఆ యా దేవతలపై శ్రద్ధ ఇనుమడించినపుడు భక్తుడేమిచేయును?
ఉ:- వారిని ఇతోధికశ్రద్ధతో నారాధించును.
ప్ర:- తత్ఫలితముగ నాతడేమిపొందును?
ఉ:- తన యభీష్టఫలములను వారివలన పొందును.
ప్ర:- ఆ ఫలములను ఎవరు నిర్ణయించిరి?
ఉ:- దేవదేవుడగు పరమాత్మయే. కావున ఆతడే ఆ యా దేవతలద్వారా వారివారి వాంఛితముల నొసంగినట్లగును.
865
07-21-గీతా మకరందము.
విజ్ఞానయోగము
-పూజ్యశ్రీశ్రీశ్రీ విద్యాప్రకాశానందగిరి స్వాములవారు,
శ్రీశుకబ్రహ్మాశ్రమము, శ్రీకాళహస్తి
అ|| ఆయా దేవతారాధకులకు కలుగు ఫలితమును రెండుశ్లోకములద్వారా చెప్పుచున్నారు -
యో యో యాం యాం తనుం భక్తః శ్రద్ధయార్చితుమిచ్ఛతి |
తస్య తస్యాచలాం శ్రద్ధాం
తామేవ విదధామ్యహమ్ ||
టీక:- యః యః భక్తః = ఏ యే భక్తుడు, యాం యామ్ తనుమ్ = ఏ యే (దేవతా) రూపమును, శ్రద్ధయా = శ్రద్ధతో, అర్చితుమ్ = పూజించుటకు, ఇచ్ఛతి = కోరుచున్నాడో, తస్య తస్య = వానివానికి, శ్రద్ధాం = దానికి తగిన శ్రద్ధనే, అచలామ్ = స్థిరమైన దానినిగ , విదధామి = చేయుచున్నాను.
తా:- ఏ యే భక్తుడు ఏ యే (దేవతా) రూపమును శ్రద్ధతో పూజింపదలంచుచున్నాడో, దానిదానికి తగిన శ్రద్ధనే వానివానికి నేను స్థిరముగ గలుగజేయుచున్నాను.
వ్యాఖ్య:- మనుజుడు పరమాత్మనుగాక ఇతరదేవతలను ఆరాధించుచున్నంత మాత్రమున వారిపై భగవానుడు కినుక వహింపరు. పైపెచ్చు ఆ యా దేవతలందరియెడల ఆతని భక్తిని, శ్రద్ధను దృఢపఱచుదురు
(అచలాం శ్రద్ధాం విదధామి). ఆహా!పరమేశ్వరునియొక్క దయాళుత్వమెట్టిది. అయితే భక్తిశ్రద్ధలతో గూడియుండి భజించువారికి మాత్రమే సహాయము చేయుదురు. అవి లేనివారికిగాదు. కనుకనే ‘శ్రద్ధయా’ అను పదము చేర్చబడినది. అట్టి శ్రద్ధగలిగియున్నవారికి ఆ శ్రద్ధ నింకను తాను బలపరచెదనని శ్రీకృష్ణపరమాత్మ ఆనతిచ్చిరి.
హిందూమతములోగల విశిష్టతయే ఇది. ప్రతివాడున్ను వానివాని సంస్కారము ననుసరించి తగిన మార్గమును వెతకుకొనుటకు, తగిన దేవతను ఉపాసించుటకు సంపూర్ణమగు స్వేచ్ఛ దీనియందుగలదు. ఏమార్గముగుండా పోయినను, ఎవరిని ఆశ్రయించుకొని ముందుకేగినను తుట్టతుదకు అందఱున్ను గమ్యమగు ఆత్మనే చేరవలసియుండును. అట్టి పరమాత్మరూపలక్ష్యమును చేరుటకు వారివారికి తగిన మార్గమును, తగిన ఇష్టదేవతను వారు ఎన్నుకొనవచ్చును. అయితే భక్తిశ్రద్ధలతో పురోగమనము సాగించుచుండవలెను. గమ్యమునుగూర్చి మెల్లగా నడచినను, త్వరగా నడచినను నడక మాత్రము ఆపకూడదు. మఱియు లక్ష్యము వైపునకే నడవలెనుగాని వెనుకకు నడవగూడదు. ఈ రెండు నియమములచే మనుజుడు ఎప్పటికైనను పరమలక్ష్యమగు ఆత్మదేవుని చేరుకొనగలడు. ఇతర దేవతల నుపాసించువారి భక్తిశ్రద్ధలను భగవాను డేల స్థిరపఱచుచున్నారనగా, వారట్టి దృఢతరశ్రద్ధచే ఎప్పటికైనను దేవదేవుడగు పరమాత్మను బొందగలరు కనుకనే. కాబట్టి వారికి తమతమ మార్గమును అనుసరించుటకు స్వేచ్ఛయు, భక్త్యాదుల దృఢత్వమును భగవాను డొసంగుచున్నారు. దీనినిబట్టి ఎవడు ఆధ్యాత్మికోన్నతికై ఎంతటి ప్రయత్నము సలుపునో వాడంతటి ఫలమునే పొందగలడని స్పష్టమగుచున్నది. ప్రయత్నమే చేయనివానికి ఏ ఫలితమున్ను లభించదు. జీవుడు తాను యత్నించనిదే భగవంతుడు మాత్రమేమి చేయగలరు? కాబట్టి ముముక్షువులెల్లరు తీవ్రతరయత్న మాచరించి గమ్యమును శీఘ్రముగ చేరవలయును.
ప్ర:- భగవంతునిగాని, ఇతరదేవతలనుగాని ఉపాసించునపుడు ముఖ్యముగ ఉండవలసిన గుణములేవి?
ఉ:- భక్తి, శ్రద్ధ .
ప్ర:- అట్లు భకిశ్రద్ధలతో ఆ యా దేవతల నుపాసించువారికి భగవాను డెట్టి సహాయము చేయును?
ఉ:- వారికి ఆ యా దేవతలయందుగల శ్రద్ధాభక్తులను స్థిరపఱచును.
865
07-20-గీతా మకరందము.
విజ్ఞానయోగము
-పూజ్యశ్రీశ్రీశ్రీ విద్యాప్రకాశానందగిరి స్వాములవారు,
శ్రీశుకబ్రహ్మాశ్రమము, శ్రీకాళహస్తి
కోరికలతో గూడి ఇతరదేవతల నారాధించువారినిగురించి చెప్పుచున్నారు-
కామైస్తైస్తైర్హృతజ్ఞానాః ప్రపద్యన్తేఽన్యదేవతాః |
తం తం నియమమాస్థాయ
ప్రకృత్యా నియతాస్స్వయా ||
టీకః- స్వయా = తమ యొక్క, ప్రకృత్యా = ప్రకృతి (జన్మాంతర సంస్కారము) చేత, నియతాః = ప్రేరేపింపబడిన జనులు, తైః తైః కామైః = ఆయా (విషయములందలి) కోరికలచేత, హృతజ్ఞానాః = అపహరింపబడిన వివేకముగలవారై, తం తం నియమమ్ = ఆయా (దేవతారాధన సంబంధమగు) నియమమును, ఆస్థాయ = అవలంబించి, అన్యదేవతాః = ఇతర దేవతలను, ప్రపద్యన్తే = భజించుచున్నారు.
తా:- (కొందఱు) తమయొక్క ప్రకృతి (జన్మాంతర సంస్కారము)చే ప్రేరేపింపబడినవారై విషయాదులందలి కోరికలచే వివేకమును గోల్పోయి, దేవతారాధన సంబంధమైన ఆ యా నియమములు నవలంబించి ఇతర దేవతలను భజించుచున్నారు.
వ్యాఖ్య:- కొందఱు పరమాత్మనుగూర్చి ధ్యానింపక విషయసంబంధమైన కోరికలు నెరవేరుటకై ఇతరదేవతల నారాధించుచున్నారు. దానికి కారణము వారు తమ వివేకము గోల్పోవుటయేయని యిట తెలుపబడినది. అది యెట్లుపోయినది? కోరికలను దొంగలు వారి హృదయమున ప్రవేశించి వారిజ్ఞానమును (వివేకమును) హరించి వేసిరి (కామైః హృతజ్ఞానాః). తత్ఫలితముగ వారు ఆత్మయొక్క గాంభీర్యము నెఱుగజాలక, పరమాత్మను సేవించుట విడిచిపెట్టి ఇతరదేవతల నారాధించుచున్నారు. తత్సంబంధములైన నియమములను, వ్రతములను ఆచరించుచు వారిని భజించుచున్నారు. వారి ఆరాధనలక్ష్యము కోరికలు నెరవేరుటయే కాని మోక్షముకాదు. కావున మోక్షము నభిలషించు తీవ్రవైరాగ్యయుతులగు సాధకు లవలంబించదగిన పద్ధతి యిదికాదు. కోరికలను అంతముచేసికొని, ఇంద్రియములను నిరోధించి హృదయస్థపరమాత్మను నిరంతరము ధ్యానించుటయే ముక్తికి మార్గము.
‘కామైః హృతజ్ఞానాః’ - అని చెప్పుటవలన విషయవాంఛలు విజ్ఞానమును హరించి వేయునని, నాశనమొనర్చునని స్పష్టమగుచున్నది. కావున భగవన్మార్గమున మహాప్రమాదజనకములగు వానిని విజ్ఞులు చేబట్టరాదు.
ఈ అధ్యాయమున 15వ శ్లోకమున చెప్పబడిన ‘మాయయాఽపహృతజ్ఞానాః’ - కోరికలచే అపహరింపబడిన జ్ఞానముగల మూఢులకును, ఈ శ్లోకమున చెప్పబడిన ‘కామైః హృతజ్ఞానాః’ - కోరికలచే అపహరింపబడిన జ్ఞానముగలవారికిని చాల తారతమ్యముగలదు. మొదటివారు తమోగుణప్రేరితులు. వీరు సత్త్వగుణ రజోగుణ మిశ్రితమగు గుణము కలవారు. వీరికి దైవమందు విశ్వాసముకలదు. వారికిలేదు.
ప్ర:- జీవునియొక్క జ్ఞానమును హరించివేయునది ఏది?
ఉ:- కోరికలు, విషయాశలు.
ప్ర:- అవి యెట్లు కలుగుచున్నవి?
ఉ:- జన్మాంతర విషయసంస్కారములచే.
ప్ర:- తత్ఫలితముగ మనుజుడేమిచేయుచున్నాడు?
ఉ:- జ్ఞానమును పోగొట్టుకొని పరమాత్మను విడిచిపెట్టి ఇతరదేవతల నారాధించుచున్నాడు.
865
07-19-గీతా మకరందము.
విజ్ఞానయోగము
-పూజ్యశ్రీశ్రీశ్రీ విద్యాప్రకాశానందగిరి స్వాములవారు,
శ్రీశుకబ్రహ్మాశ్రమము, శ్రీకాళహస్తి
అ|| అట్టి జ్ఞానులు లోకములో చాల అరుదని చెప్పుచున్నారు-
బహూనాం జన్మనామన్తే
జ్ఞానవాన్మాం ప్రపద్యతే |
వాసుదేవస్సర్వమితి
స మహాత్మా సుదుర్లభః ||
టీక:- బహూనామ్ = అనేకములైన, జన్మనామ్ = జన్మములయొక్క, అన్తే = చివఱ, జ్ఞానవాన్ (సన్) = జ్ఞానవంతుడు (అయి), సర్వమ్ = సమస్తమున్ను, వాసుదేవః ఇతి = వాసుదేవుడే (భగవంతుడే) అని (తెలిసికొని), మామ్ = నన్ను, ప్రపద్యతే = పొందుచున్నాడు, సః మహాత్మా = అట్టి మహాత్ముడు, సుదుర్లభః = (లోకములో) మిక్కిలి అరుదు.
తా:- అనేకజన్మలయొక్క అంతమున మనుజుడు జ్ఞానవంతుడై సమస్తము వాసుదేవుడే (భగవంతుడే) యను సద్బుద్ధిగల్గి నన్ను పొందుచున్నాడు. అట్టి మహాత్ముడు లోకములో చాల అరుదు.
వ్యాఖ్య:- జీవుడు అనాదికాలమునుండి ఈ సంసారచక్రమున పరిభ్రమించుచున్నాడు. కృమికీటకాద్యనేకజన్మలెత్తి యెత్తి సుకృతవశమున మానవుడై జన్మించుచున్నాడు. అట్లు జన్మించిన ప్రతిమానవుడును ముక్తి కొఱకై ప్రయతించుటలేదు. ఏ కొలదిమంది పుణ్యాత్ములో ప్రయతించుచున్నారు. అట్లు ప్రయత్నించువారిలోను ఏ ఒకానొకధీరుడో ఆత్మజ్ఞానమొంది తరించిపోవుచున్నాడు*. ఒక్కొక్క జన్మయందు జీవుడు కొంతకొంత అధికపుణ్యమును సంపాదించుకొనుచురాగా ఎట్టకేలకు ఏ ఒకానొక జన్మయందో తీవ్రతర ఆధ్యాత్మిక సాధనలచేతను, పరమేశ్వరుని అనుగ్రహముచేతను ఆతనికి జ్ఞానముదయించును. అపుడు సమస్తమును భగవన్మయముగ, ఆత్మమయముగ, ‘వాసుదేవమయముగ’ గాంచును. అట్లు సర్వాత్మదృష్టిగలవాడై జ్ఞాని భగవత్సాక్షాత్కారము నొందుచున్నాడు. ఎన్నియోజన్మల పుణ్యాధిక్యతచేతను, పురుషప్రయత్నబలముచేతను, సాధనాతిశయము చేతను జీవునకట్టి మహత్తరపదవి చేకూరును, జ్ఞానవంతుడగుభాగ్యము చేకూరును. కనుకనే జ్ఞానవంతులగు మహాత్ములు లోకములో చాల అరుదు (సుదుర్లభులు) అని భగవానుడు పేర్కొనిరి. ‘దుర్లభః’ అని చెప్పక ‘సుదుర్లభః’ అని చెప్పుటవలన అట్టివారు నూటికి కోటికి ఏ ఒకానొకడో ఉండునని భావము.
అయితే, ఇంకను అనేక జన్మలైనపిదపనే జ్ఞానవంతుడనగుదునని తలంచి సోమరితనము వహింపరాదు. ఇంతవరకు గడచిన జన్మలన్నియు ఆ అనంతకోటిజన్మలని భావించి ఈ జన్మయందే కడతేరుటకై, జ్ఞానమును బొందుటకై తీవ్ర యత్న మాచరింపవలెను. అట్టి జ్ఞానమును బొందినది లేనిది తెలిసికొనుటకై భగవాను డీశ్లోకమున చక్కని పరీక్ష (Test) నొకదానిని ఏర్పఱచియున్నారు. ‘అంతయు వాసుదేవమయమగ (భగవన్మయముగ- ఆత్మమయముగ) తనకు కానవచ్చుచున్నదా? అని సాధకుడు తనలో పరీక్షించుకొనుచుండవలెను. ఆ విధముగ కానుపించనిచో నామరూపములే కానుపించుచుండినచో సాధన ఇంకను పరిపక్వము కాలేదని తలంచి ధ్యానవిచారణాద్యభ్యాసములను తీవ్రతరము గావించవలెను. జ్ఞానప్రాప్తికి గుఱుతు ఈ ‘సర్వం ఖల్విదం బ్రహ్మ’ (అంతయు బ్రహ్మమే) అను సిద్ధాంతముయొక్క అనుభూతిని బడయుటయే యగును. ప్రారంభస్థితిలో మనుజుడు దేవుని ఏ గుడియందో,ఏ విగ్రహములోనో, ఏ తీర్థమందో చూచును. ఆరూఢస్థితియందు ఆ దేవునే సర్వత్ర వీక్షింపగల్గును. ‘జగమంతా రామమయమ్’ అనుస్థితి చేకూరును .
ఈ శ్లోకమున ‘బహూనాం జన్మనామన్తే జ్ఞానవాన్’ అని చెప్పినచోట జ్ఞాని అనేక జన్మలైనపిదప మోక్షమునొందునని అర్థముకాదు. అనేక జన్మలకు మనుజుడు జ్ఞానవంతుడై మోక్షమునొందుననియే అర్థము. ఏ క్షణమున జ్ఞానమును పొందునో ఆ క్షణముననే మోక్షము లభించగలదు.
అంతయు భగవన్మయముగ గాంచు జ్ఞానవంతునకు గీతాచార్యుడు ‘మహాత్మా’ అను బిరుదు నొసంగెను. అట్టి బిరుదును సంపాదించుటకై సర్వులును యత్నించవలెను. పరిచ్ఛిన్నదృష్టిగలిగి ‘సామాన్యాత్ముడు’గ నుండరాదు. విశాలదృష్టి నవలంబించి ‘మహాత్ముడు’గ మారిపోవలెను. అపుడే జన్మము సార్థకముకాగలదు.
ప్ర:- జీవుడు మోక్షము నెపుడు పొందగలడు?
ఉ:- జ్ఞానవంతుడైనపుడు.
ప్ర:- జ్ఞానమెపుడు పొందును?
ఉ:- అనేక జన్మ లందలి శుభప్రయత్నముచే కట్టకడకు ఒకానొక జన్మయందు పొందును.
ప్ర:- జ్ఞాని యెట్టిభావము గల్గియుండును?
ఉ:- అంతయు వాసుదేవమయము (భగవన్మయము, ఆత్మమయము) అను భావము గల్గియుండును.
ప్ర:- లోకములో ‘మహాత్ము’ డనదగినవాడెవడు?
ఉ:- జ్ఞానియే.
ప్ర:- అట్టి జ్ఞానులు లోకములో విరివిగా నుందురా?
ఉ:- ఉండరు. ఏ ఒకానొకడో అట్లుండును. వారు మహాదుర్లభులు.
ప్ర:- ఒకడు జ్ఞాని అగునా కాదా యని పరీక్షించుటకు ఉపాయమేమి?
ఉ:- అతని దృష్టిలో అంతయు వాసుదేవమయముగ నున్నదా, లేదా యని తెలిసికొనిన చాలును.
-------------------------------
* (1) యతతా మపి సిద్ధానాం కశ్చిన్మాం వేత్తి తత్త్వతః (7-3)
(2) అనేకజన్మ సంసిద్ధస్తతో యాతి పరాంగతిమ్ (6-45)
865
07-18-గీతా మకరందము.
విజ్ఞానయోగము
-పూజ్యశ్రీశ్రీశ్రీ విద్యాప్రకాశానందగిరి స్వాములవారు,
శ్రీశుకబ్రహ్మాశ్రమము, శ్రీకాళహస్తి
అ అయితే తక్కిన భక్తులమాటేమిటియనిన, వచించుచున్నారు-
ఉదారాః సర్వ ఏవైతే
జ్ఞానీత్వాత్మైవ మే మతమ్ |
ఆస్థితః స హి యుక్తాత్మా మామేవానుత్తమాం గతిమ్ ||
టీకః- ఏతే సర్వే = వీరందరున్ను (పైన దెలిపిన నలుగురు భక్తులు), ఉదారాః ఏవ = మంచివారే, జ్ఞానీ తు = జ్ఞానియన్ననో, ఆత్మ ఏవ = నేనే (ఇతి = అని) మే = నాయొక్క, మతమ్ = అభిప్రాయము, హి = ఏలయనగా, సః = అతడు, యుక్తాత్మా (సన్) = నాయందే మనస్సును స్థిరముగ నిలిపినవాడై, మాం ఏవ = నన్నే, అనుత్తమామ్ = సర్వోత్తమమైన, గతిమ్ = ప్రాప్యస్థానముగ, ఆస్థితః = (నిశ్చయించి) ఆశ్రయించుకొనియున్నాడు.
తా:- వీరందఱున్ను (పైనదెలిపిన నలుగురు భక్తులు) మంచివారే. కాని అందు జ్ఞానియో సాక్షాత్ నేనేయని నాఅభిప్రాయము. ఏలయనగా అతడు నాయందే చిత్తమును స్థిరముగ నెలకొల్పి నన్నే సర్వోత్తమమైన ప్రాప్యస్థానముగ నిశ్చయించి ఆశ్రయించు కొనియున్నాడు.
వ్యాఖ్య :- పైనదెలిపిన నలుగురు భక్తులలోను జ్ఞాని శ్రేష్ఠుడని చెప్పినంత మాత్రముచే తక్కినవారు తీసివేయదగినవారని అర్థముకాదు. వారున్ను మంచివారే. భక్తిలేని సామాన్యులకంటె వారెంతయో ఉత్తములు. ఎందుకనగా వారు శ్రద్ధతో ఏదియో విధముగ దైవమును ఆరాధించుచునేయున్నారు. కాబట్టి వారందఱిని ‘ఉదారులు’ (మంచివారే) అని భగవాను డిచట పేర్కొనియున్నారు. అయితే వారందఱిలోను జ్ఞానియొక్క అంతస్తు పెద్దది. అందులకు కారణము నిరంతర భగవచ్చింతనచే అతడు సాక్షాత్ భగవత్స్వరూపుడే యగుచున్నాడు. ‘బ్రహ్మవిద్ర్బహ్మైవ భవతి’ - ‘బ్రహ్మవేత్త సాక్షాత్ బ్రహ్మమేయగుచున్నాడు’ అని శ్రుతియు వక్కాణించుచున్నది. సముద్రమునపడిన వడగండ్లు సముద్రరూపమే యగునట్లు, జ్ఞానియొక్క చిత్తము బ్రహ్మమునందు లయమై బ్రహ్మాకారముగనే పరిణమించుచున్నది. కనుకనే జ్ఞానికిని భగవంతునకును భేదములేదని యిట వచింపబడినది. ‘మే మతమ్’ - (ఇది నానిశ్చయము) - అని భగవానుడు చెప్పుటవలన ఈ వాక్యములయొక్క పరమసత్యత్త్వము వెల్లడియగుచున్నది.
తక్కిన ముగ్గురు భక్తులు ద్వైతప్రపంచమున తిరుగాడుచుందురు. జ్ఞాని అద్వైత వీధులలో విహరించుచుండును. భగవంతుడు తనకంటె వేఱుగనున్నాడని తలంచి ధ్యానించుట ప్రారంభస్థితిలో జరుగుచుండును. ఆరూఢస్థితిలో భగవానుడు తనకంటె వేఱుగనుండడు. ధ్యాత ధ్యేయమై యొప్పును. జీవుడు శివుడగును. ఇట్టిస్థితి నిరంతర ఆత్మచింతనచేతను, అహంభావనిర్మూలనచేతను, వాసనాక్షయము వలనను గలుగగలదు. కనుకనే ‘యుక్తాత్మా’ అని చెప్పబడినది. జ్ఞాని ఆత్మయందే తన చిత్తమును నిరంతరము సంలగ్న మొనర్చుచుండునని భావము.
ఆత్మపదవిని, దైవపదవిని, ‘అనుత్తమాం గతిమ్’ - సర్వోత్తమమగు గతిగా, పదవిగా వర్ణించుటవలన ప్రపంచములోని సమస్త ఇతర పదవులు దానిముందు అల్పములనియే తేలుచున్నది. కావున సర్వులును ప్రయత్నపూర్వకముగ అట్టి సర్వోత్తమబ్రహ్మపదవి కొఱకే యత్నించి జీవితములను ధన్యము గావించుకొనవలయును.
గీతయం దీశ్లోకమున పూర్ణ అద్వైతస్థితి వర్ణింపబడినది. భక్తుడు సాక్షాత్ భగవంతుడుగా మారిపోవుట ఇచట తెలుపబడినది. జీవితపరమావధి అదియే. ద్వైతమునందు భగవంతుడు ఒకింతదూరములోనుండును. విశిష్టాద్వైతములో ఇంకను దగ్గఱకు వచ్చును. అద్వైతములో ఇంకను దగ్గఱకువచ్చి తానే భగవంతుడుగా మారిపోవును. కనుకనే జీవన్ముక్తులగు మహనీయులను సాక్షాత్ దైవముగ జనులారాధించుచుందురు. ‘ద్విబాహురపరోహరిః’ - రెండుచేతులతో విరాజిల్లు విష్ణువు - అను వాక్యము వారికే చెల్లును. వారికి భగవంతునకు ఏ మాత్రము ఎడము యుండదు. అట్టి అద్వయజ్ఞానస్థితి కలుగువఱకు ముముక్షువు నిరంతరము అధ్యాత్మసాధన సలుపుచునే యుండవలెను. ప్రతివారును అట్టి జ్ఞాన పరాకాష్ఠస్థితిని ఎప్పటికైనను పొందవలసియే యుందురు. కర్మ, భక్తి, ధ్యానాదులన్నియు తుట్టతుదకు ఈ జ్ఞానస్థితినే కలుగజేసి ముక్తికి హేతువులై పరగును. కనుకనే భగవానుడు జ్ఞానమునకు, జ్ఞానికి ఇట్టి ఆధిక్యత నొసంగుటకు కారణము.
ప్ర:- పైన దెల్పిన నలుగురు భక్తులు ఎట్టివారు?
ఉ:- అందరును చాల మంచివారే.
ప్ర:- అయితే అందు జ్ఞానికి ఎందుల కాధిక్యత నొసంగబడెను?
ఉ:- జ్ఞానికి భగవంతునకును భేదము యుండదు. జ్ఞాని సాక్షాత్ భగవంతుడే యగుచున్నాడు. అందువలన (జ్ఞానీత్వాత్మైవ మేమతమ్).
ప్ర:- ఏ కారణముచే జ్ఞాని అట్టి భగవత్స్వరూపమును బడయును?
ఉ:- అతడు తన మనస్సును చక్కగ నిగ్రహించి ఆత్మయందు స్థాపించి (యుక్తాత్మా)ఆత్మనే పరమగతిగ నెంచి అందే స్థితుడై యుండును గావున.
865
ప్ర:- పైనదెల్పిన నలుగురు భక్తులలో ఎవడు శ్రేష్ఠుడు?
ఉ:- జ్ఞాని.
ప్ర:- ఎందువలన?
ఉ:- అతనికి (జ్ఞానికి) (1) నిత్యయుక్తత్వము (నిరంతరదైవసంబంధము) (2) ఏకభక్తి - అను రెండు విశిష్ట గుణములు కలవు. అవి తక్కినవారికి లేవు.
ప్ర:- జ్ఞానికి ఈ ప్రపంచమున అందఱికంటెను మిక్కిలి ప్రియుడెవడు?
ఉ:- భగవంతుడు.
ప్ర:- భగవంతునకు అందఱికంటె మిక్కిలి ప్రియుడెవడు?
ఉ:- జ్ఞాని.
ప్ర:- కావున, జనుల యొక్క కర్తవ్యమేమి?
ఉ:- ‘ఏకభక్తి’ రూపమగు జ్ఞానమును సముపార్జించుటద్వారా భగవంతునకు అతిప్రియుడగుటకై యత్నింపవలెను.
865
07-17-గీతా మకరందము.
విజ్ఞానయోగము
-పూజ్యశ్రీశ్రీశ్రీ విద్యాప్రకాశానందగిరి స్వాములవారు,
శ్రీశుకబ్రహ్మాశ్రమము, శ్రీకాళహస్తి
॥అ|| ఈ నలుగురిలో జ్ఞాని శ్రేష్ఠుడని వచించుచున్నారు-
తేషాం జ్ఞానీ నిత్యయుక్త ఏకభక్తిర్విశిష్యతే |
ప్రియో హి జ్ఞానినోఽత్యర్థం
అహం స చ మమ ప్రియః ||
టీక:- తేషామ్ = వారి (ఆ నలుగురిలో) , నిత్యయుక్తః = ఎల్లప్పుడును పరమాత్మతో గూడియుండువాడును, ఏకభక్తిః = ఒక్క పరమాత్మయందే భక్తిగలవాడును (అగు), జ్ఞానీ = (ఆత్మ) జ్ఞాని, విశిష్యతే = శ్రేష్ఠుడగుచున్నాడు, జ్ఞానినః = (ఆత్మ) జ్ఞానికి, అహమ్ = నేను, అత్యర్థమ్ = మిక్కిలి, ప్రియః హి = ఇష్టుడనుగదా!, సః చ = అతడును, మమ = నాకు, ప్రియః = ఇష్టుడే.
తా:- వారి (ఆ నలుగురి)లో నిత్యము పరమాత్మతో గూడియుండువాడును, ఒక్క పరమాత్మ యందే భక్తిగలవాడునగు జ్ఞాని శ్రేష్ఠుడగుచున్నాడు. అట్టి జ్ఞానికి నేను మిక్కిలి ఇష్టమైనవాడను; అతడున్ను నాకు మిగుల ఇష్టుడే.
వ్యాఖ్య:- క్రిందటి శ్లోకములో చెప్పబడిన నలుగురు భక్తులలో ఎవరు శ్రేష్ఠుడో ఇచట వివరించుచున్నారు. వారందరిలో జ్ఞానియే ఉత్తముడని చెప్పబడినది. ఏలయనిన, అతనిలో తక్కిన ముగ్గురికిలేని రెండు విశిష్టగుణములు కలవు - అవియే (1) నిత్యయుక్తత్వము (2) ఏకభక్తి .
(1)నిత్యయుక్తత్వమనగా నిరంతరము పరమాత్మతో (దైవముతో) సంబంధము గల్గియుండుట, అనగా జ్ఞాని నిరంతరము ఆత్మధ్యానపరుడై ఆత్మయందు స్థితిగలిగి యుండునని భావము. తక్కినవారగు ఆర్తుడు, జిజ్ఞాసువు, అర్థార్థి అపుడపుడు దైవమును స్మరించుదురు. వారు అనిత్యయుక్తులు (Part-timed devotees). వారు కొంతకాలము దైవచింతనజేసి తదుపరి ప్రపంచకార్యములందు ప్రవేశించి దైవమును మఱచుదురు. జ్ఞానియే సర్వకాలసర్వావస్థలయందును భగవంతునితో (ఆత్మతో) గూడి యుండును. అదియే నిత్యయుక్తత్వము. నిరంతరము వెలుగు (జ్ఞానము) నందుండుటచే అట్టివారి దరికి చీకటి (అజ్ఞానము) రానేరదు. కాబట్టియే వారు మాయామోహమును జయించి సర్వోత్కృష్టులై చెన్నొందుచున్నారు. తక్కినవారు ‘నిత్యయుక్తులు’ కానందుచే కొంతకాలము భగవంతుని విస్మరించుటవలన వారియందు అవిద్యచేరుటకు అవకాశమున్నది. సాధకులగువారు ప్రారంభమున కొంతకాలము భగవద్ధ్యానముచేసికొని తదుపరి కొంతకాలము ఇతరపనులకు వినియోగించినప్పటికిని, క్రమక్రమముగ ఆ ధ్యానకాలమును, దైవానిష్ఠాసమయమును పెంచుకొనుచుపోయి తుదకు నిరంతర దైవానిష్ఠత్వరూపలక్ష్యమును చేరుకొనవలెను. అపుడే యాతడు దైవభక్తులందఱిలోను అగ్రగణ్యుడై యలరారును. అట్టివాడే ‘నిత్యయుక్తుడ’గు జ్ఞాని. అట్టి జ్ఞానికే తక్కిన భక్తులందఱిలోను భగవానుడు ప్రథమస్థానము (First Mark) నొసంగెను.
ఇక జ్ఞానియొక్క రెండవలక్షణము ‘ఏకభక్తి’ అనగా జ్ఞానికి రెండుమూడుభక్తులు ఉండవనియు ఒకేభక్తియనియు అర్థము. అతనిది పంచభక్తి, నవభక్తి, శతభక్తి, కాదు. ఏకభక్తి. అనగా ఒక్క పరమాత్మయందు తప్ప మఱిదేనియందును భక్తిలేనివాడు. ప్రపంచములోని జనులలో కొందఱికి ధనమందు భక్తి, కొందఱికి కీర్తియందు భక్తి, కొందఱికి భార్యయందు భక్తి, కొందఱికి అధికారమందు భక్తి, మఱికొందఱికి విషయభోగములందు భక్తి యుండును. కాని జ్ఞానికో ఒక్క భగవంతునియందు (ఆత్మయందు) తప్ప తక్కిన దేనియందును భక్తియుండనేరదు. తక్కినవారికి అనేక విషయములందు ప్రీతియుండుటవలన, ఏకభక్తి లేనందువలన మనస్సు చంచలముగానున్నదై ఒకే వస్తువునందు ఏకాగ్రత, నిష్ఠ లేనిదైయుండును. ధ్యాననిష్ఠయందు ఈ చంచలత పనికిరాదు. ఒకే దైవవస్తువునందు, ఆత్మయందు దృష్టి ఏకాగ్రముగ నిలువవలెను. భగవద్వ్యతిరిక్తములగు వస్తువులపై దృష్టి చెదిరిపోరాదు. ఇదియే ఏకభక్తి. ఇట్టిది జ్ఞానికి కలదు. కనుకనే యాతడు భక్తులందఱిలోను భగవంతునిదృష్టి యందు సర్వోపరిస్థానము నలంకరించుటకు కారణము.
‘అత్యర్థమ్’ (మిక్కిలి) అని చెప్పినందువలన అట్టి జ్ఞానికి భగవంతునియందు అమితప్రీతియుండునని తెలియుచున్నది. జ్ఞానిదృష్టియందు దృశ్యవస్తువులన్నియు నశించి పోవునవే గావున వానియందాతడు ప్రీతిగొనడు; శాశ్వత పరమాత్మయందే మిక్కిలి ప్రీతినుంచును. ఈ ప్రకారముగ భక్తుడెపుడు భగవంతుని ప్రేమించునో, భగవంతుడును భక్తుని ప్రేమించుచున్నాడు. ‘స చ మమ ప్రియః’ (ఆతడు నాకు మిక్కిలి ప్రియుడు) అను వాక్య మీయర్థమునే సూచించుచున్నది. ప్రాపంచికజనులయొక్క ప్రియమును సంపాదించుట మంచిదైనను దైవముయొక్క ప్రియమును సంపాదించుట ఇంకను మంచిది. అది జీవునియొక్క అహోభాగ్యమే అయియున్నది. అట్టి స్థితియే చేకూరినచో నికజన్మ సార్థకమగును. ఇతరులు మెచ్చినచో ఏ కొద్దియో లభించును. భగవంతుడు మెచ్చిన సాక్షాత్ మోక్షము లభించును.
ఈ శ్లోకమున జ్ఞానికి ‘ఏకభక్తి’ యుండునని చెప్పుటవలన వాస్తవముగ భక్తికిని జ్ఞానమునకును భేదములేదని తేటతెల్లమగుచున్నది. జ్ఞానికి భక్తియుండును, భక్తునకు జ్ఞానముండును. ఒకటి యెక్కువ, ఒకటి తక్కువ అను భావమే లేదు. అనుభవములో చూచుకొనినచో ఈ సత్యము లన్నియు చక్కగా తెలియగలవు. పరాకాష్ఠయందు భక్తి, జ్ఞానము, ధ్యానము అన్నియు ఒకటిగనే యుండును.
865
07-16-గీతా మకరందము.
విజ్ఞానయోగము
-పూజ్యశ్రీశ్రీశ్రీ విద్యాప్రకాశానందగిరి స్వాములవారు,
శ్రీశుకబ్రహ్మాశ్రమము, శ్రీకాళహస్తి
॥అ|| ఇక ఎట్టివారు భగవంతుని భజించెదరో తెలుపుచున్నారు -
చతుర్విధా భజన్తే మాం జనాస్సుకృతినోఽర్జున |
ఆర్తో జిజ్ఞాసురర్థార్థీ
జ్ఞానీ చ భరతర్షభ ||
టీక:- భరతర్షభ = భరతవంశశ్రేష్ఠుడవగు, అర్జున = ఓ అర్జునా!, ఆర్తః = ఆపత్తునందున్నవాడు, జిజ్ఞాసుః = (భగవంతుని) తెలిసికొనగోరువాడు, అర్థార్థీ = ధనము (సంపత్తు) నభిలషించువాడు, జ్ఞానీ చ = (ఆత్మ) జ్ఞానముకలవాడును (అగు ఈ), చతుర్విధాః = నాలుగు విధములైన, సుకృతినః = పుణ్యాత్ములగు, జనాః = జనులు, మామ్ = నన్ను, భజంతే = సేవించుచున్నారు (భజించుచున్నారు).
తా:- భరతవంశశ్రేష్ఠుడవగు ఓ అర్జునా ! ఆపత్తునందున్నవాడు, (భగవంతుని) తెలిసికొనగోరువాడు, ధనము (సంపత్తు) నభిలషించువాడు, (ఆత్మ)జ్ఞానముకలవాడు, అను నీ నాలుగువిధములైన పుణ్యాత్ములగు జనులు నన్ను సేవించుచున్నారు.
వ్యాఖ్య:- భగవంతుని సేవింపనివారి విషయమై ఇదివఱకు చెప్పబడినది. ఇక సేవించువారినిగూర్చి ఇచట చెప్పబడుచున్నది. (1) ఆర్తుడు (2) జిజ్ఞాసువు (3) ధనార్థి (4) జ్ఞాని - అను నాలుగు రకములవారు పరమాత్మ నాశ్రయించుదురని యిట పేర్కొనబడినది. వీరందఱును ఏదియో విధముగ భగవంతుని స్మరించుచున్నారు. కావున అందఱును పుణ్యాత్ములేయని చెప్పబడినది. అయితే ఏ హేతువుచే ప్రేరితులై వారు పరమాత్మను సేవించుచున్నారో దానియొక్క తారతమ్యముచేతనే వారిలో భేదమేర్పడినది.
అందు మొదటివాడగు ఆర్తుడు ఏదైనా ఆపత్తు తటస్థించినపుడు భగవంతుని స్మరించును, ప్రార్థించును. ఏదైన రోగబాధ గలిగినపుడుగాని, చోర వ్యాఘ్రాదుల వలన కీడు సంభవించినపుడుగాని, ఏదైన యితర కష్టము సంభవించినపుడుగాని సర్వేశ్వరుని చింతనజేయును. అట్టి ఆపత్సమయమున ‘ఏడుకొండలవాడు’ గాని మఱియొక దేవుడుగాని అతని స్మృతిపథమునకు వచ్చును. ఈ తరగతికి జెందినవారు జనులలో చాలమంది కలరు. కష్టములలో దేవునకు మ్రొక్కుకొనువారు, ముడుపులు కట్టుకొనువారు మున్నగువారందఱు ఈ తరగతికిజెందినవారే. ఎట్లున్నను ఏదియో నెపమున భగవంతుని స్మరించుట బట్టి వారు పుణ్యాత్ములలోనే జమకట్టబడిరి.
ఇక రెండవవాడు జిజ్ఞాసువు. భగవత్తత్త్వ మెట్టిదో తెలిసికొనదలంచువాడు. ప్రపంచములో జనులు కోట్లకొలది యున్నప్పటికిని ఇట్టి దైవజిజ్ఞాసకలవారు చాల అరుదుగ నుందురు. కంటికి కనుపించు దృశ్యపదార్థములనుగూర్చిన జిజ్ఞాసయే యెక్కువమంది కలిగియుందురు. మఱియు వానిగూర్చిన అన్వేషణ (Research), విచారణ, సంపాదనలందే కాలము గడుపుచుందురు. దేవునిగూర్చి వారు పట్టించుకొనరు. అసలు దేవుడొకడు ఉన్నాడనియే వారిలో కొందఱు నమ్మరు. కావున దైవజిజ్ఞాస కలవారు గొప్పవారే, పుణ్యాత్ములే యగుదురు. వారు అధ్యాత్మక్షేత్రమున అడుగుపెట్టిరి. ఇక క్రమక్రమముగ వారు సాధనచే పైకి పోవుదురు. ‘జిజ్ఞాసురపి యోగస్య శబ్దబ్రహ్మాతివర్తతే’ - అని గీతాచార్యులు దైవజిజ్ఞాసకలవాడు శబ్దబ్రహ్మమును అనగా శాస్త్రోక్త కర్మానుష్ఠానఫలమును అతిక్రమించిపోవుచున్నాడని యిదివఱలోనే చెప్పియుండిరి. అట్టి జిజ్ఞాస బహుజన్మసుకృతము వలననే జీవునియందు ఉదయించుచున్నది.
మూడవవాడు ‘అర్థార్థీ’ అనగా ధనము కొఱకు, సంపదలకొఱకు, ఐశ్వర్యము కొఱకు మాత్రము భగవంతుని భజించువాడు. అతని ఉద్దేశ్యము దేవునియనుగ్రహముచే తనకు ప్రాపంచికసంపదలు అభివృద్ధినొందవలెననియే. ఈతడున్ను ఏదియో కారణముచే భగవానుని స్మరించుచున్నాడు కనుక పుణ్యాత్ముడేయని చెప్పబడినది.
ఇక నాల్గవవాడు జ్ఞాని. భగవతత్త్వము లెస్సగ తెలిసినవాడు , అనుభూతమొనర్చుకొనినవాడు, ఆత్మానాత్మవివేకము గలవాడు, స్వస్వరూపానుభవమునొందిన మహనీయుడు. అతడు నిరంతరము సత్యవస్తువగు ఆత్మయందే స్థితిగలిగి, ఆత్మనే స్మరించుచు, ధ్యానించుచుండును. ఆర్తునివలె, అర్థార్థివలె ఒకానొక కోరికతో నతడు భగవంతుని స్మరించువాడుకాడు. అతడు ఏవిధమైన కామ్యబుద్ధియులేక యుండును. కనుకనే తక్కిన వారందఱికంటెను ఈతడే ఉత్తముడని రాబోవు శ్లోకములో భగవానుడు తెలియజేయుదురు. ఈ ప్రకారముగ నలుగురును పరమాత్మను ఏదియో విధముగ భజించుటబట్టి అందఱును పుణ్యాత్ములేయని యిట తెలుపబడినది. ఆర్తభక్తులలో గజేంద్రుడు మున్నగువారిని, జిజ్ఞాసుభక్తులలో పరీక్షిత్తు, ఉద్ధవుడు మున్నగువారిని, అర్థార్థభక్తులలో సుగ్రీవ ధ్రువాదులను, జ్ఞాని భక్తులలో శుక, సనక, నారద, భీష్మ ప్రహ్లాదాదులను పేర్కొనవచ్చును.
ప్ర:- భగవంతుని సేవించువారు ఎన్నిరకములు?వారెవరు?
ఉ:- నాలుగు రకములు. వారు క్రమముగ (1) ఆర్తుడు (2) జిజ్ఞాసువు (3) అర్థార్థీ (4) జ్ఞాని.
865
07-15-గీతా మకరందము.
విజ్ఞానయోగము
-పూజ్యశ్రీశ్రీశ్రీ విద్యాప్రకాశానందగిరి స్వాములవారు,
శ్రీశుకబ్రహ్మాశ్రమము, శ్రీకాళహస్తి
॥అ|| అయినను కొందఱు భగవానుని ఏల శరణుబొందుటలేదో కారణము వచించుచున్నారు-
న మాం దుష్కృతినో మూఢాః ప్రపద్యన్తే నరాధమాః |
మాయయాఽపహృతజ్ఞానా
ఆసురం భావమాశ్రితాః ||
టీక:- దుష్కృతినః = పాపముచేయువారును, మూఢాః = బుద్ధిహీనులును, మాయయా = మాయచేత, అపహృతజ్ఞానాః = అపహరింపబడిన జ్ఞానముగలవారును, ఆసురమ్ = రాక్షససంబంధమైన, భావమ్ = స్వభావమును, ఆశ్రితాః = ఆశ్రయించినవారును, (అగు), నరాధమాః = మనుజాధములు (నీచజనులు), మామ్ = నన్ను, న ప్రపద్యన్తే = పొందుటలేదు (ఆశ్రయించుట లేదు).
తా:- పాపముచేయువారును, మూఢులును, మాయచే అపహరింపబడిన జ్ఞానము గలవారును, రాక్షస స్వభావమును (అసురగుణములను) ఆశ్రయించువారు నగు మనుజాధములు నన్ను బొందుటలేదు (ఆశ్రయించుటలేదు).
వ్యాఖ్య:- భగవంతుని శరణుబొందువారు మాయను దాటగలరని క్రిందటి శ్లోకమున చెప్పబడినది. అయితే అందఱును శరణుబొందుదురా యనిన, కాదు. పాపులు, మూఢులు, మాయచే నపహరింపబడిన వివేకము గలవారు, అసురస్వభావము నాశ్రయించువారు నగు అధములుతప్ప తక్కినవారు మాత్రమే ఆశ్రయించుదురని యిట తెలుపబడినది. పైనదెల్పిన పాపాదిదోషములుకలవారు మాయను దాటజాలక సంసారసముద్రమునందే కొట్టుకొనుచుందురు. అట్టివారు భగవంతుని పొందజాలరు. ‘మాయ’ లేక అజ్ఞానము అనునది ఒక గజదొంగ. దానిని హృదయములో ప్రవేశించుటకు అవకాశమివ్వకూడదు. ఇచ్చితిమా, అది మన సర్వస్వమును, జ్ఞానమును, ప్రజ్ఞను, వివేకమును హరించివేయును. కనుకనే ‘మాయయాఽపహృతజ్ఞానాః’ అని చెప్పబడినది. అది లోన ప్రవేశించినచో నరుని ‘నరాధముని’ గ మార్చివేయును , దేవతను దానవునిగ రూపొందించును , విజ్ఞుని ‘మూఢు’నిగ జేసివైచును. ‘మాయ’అనగానేమి?అనేక పాపవాసనలు, కామక్రోధాదులు, రాగద్వేషాదులు, విషయసంస్కారములు మున్నగునవి యన్నియుజేరి ‘మాయ’ యగును. కావున వివేకవైరాగ్యాదులచేతను, భగవద్భక్తి, భగవదాశ్రయములచేతను ఆ మాయ యను దొంగను హృదయకుహరమునుండి తొలగించివేయవలెను. అట్లు చేయనిచో ఈ శ్లోకమున దెలుపబడినట్లు మాయాప్రభావముచే మనుజుడు మూఢుడుగ, పాపిగ నరాధముడుగ, అజ్ఞానిగ, రాక్షసుడుగ పరిణమించు పరిస్థితి యేర్పడగలదు.
ప్ర:- భగవంతుని ఎవరు ఆశ్రయింపరు?
ఉ:- (1) పాపులు (2) మూఢులు (3) నరాధములు (4) మాయచే నపహరింపబడిన వివేకముగలవారు (5) అసురస్వభావము నాశ్రయించువారు (తత్ఫలితముగ వారు సంసారదుఃఖ సముద్రమున మునుగుచుందురు).
ప్ర:- మనుజుని జ్ఞానమును (వివేకమును) అపహరించువేయు దొంగ ఎవరు?
ఉ:- మాయ.
865
0213 *భాగవత రత్నాకరము*
చతుర్థ స్కంధము
--పూజ్యశ్రీశ్రీశ్రీ విద్యాప్రకాశానందగిరి స్వాములవారు,
శ్రీశుకబ్రహ్మాశ్రమము,
శ్రీకాళహస్తి.
4-128
ఏవం స వీర ప్రవరః సంయోజ్యాత్మానమాత్మని। బ్రహ్మభూతో దృఢం కాలే తత్యాజ స్వం కలేవరమ్ ||
తుదకు అంత్యకాలమున వీరవర్యుడగు పృథువు తన చిత్తమున దృఢముగ పరమాత్మయందు స్థిరపఱచి బ్రహ్మభావమున స్థితుడై తన శరీరమును విడిచెను.
అత్తఱి దేవతలు దుందుభులు మ్రోగించిరి. మందరపర్వత శిఖరమున దేవతాస్త్రీలు పుష్పవర్షమును కురిపించుచు పరస్పరము ఇట్లు చెప్పుకొనదొడగిరి.
దేవ్య ఊచుః -
4-129
తేషాం దురాపం కిం త్వన్యన్మర్త్యానాం భగవత్పదమ్।
భువి లోలాయుషో యే వై నైష్కర్మ్యం సాధయున్త్యుత॥
ఈ ప్రపంచమున కొద్దిరోజులు జీవితము అయినప్పటికి భగవంతుని మహోన్నత పదమును పొందింపజేయు ఆత్మజ్ఞానమును ఎవరు పొందుదురో, అట్టివారి కిక ఈ ప్రపంచమున దుర్లభమైన పదార్థమేది కలదు?!
4-130
స వఞ్చితో బతాత్మధ్రుక్ కృచ్ఛ్రేణ మహతా భువి।
లబ్ధ్వాపవర్గ్యం మానుష్యం విషయేషు విషజ్జతే॥
కావున ఎంతయో ప్రయాసతో ఈ భూలోకమున మోక్షము యొక్క సాధనరూపమగు ఈ మానవ శరీరమును పొందియు ఎవడు విషయములందు ఆసక్తుడై యుండునో అతడు నిక్కముగ ఆత్మహంతకుడే యగును. ఆహా! అతడు వంచింపబడినవాడేయగును.
865
విశ్వేశుని పాదాంబుజములు అను దీర్ఘనౌకచే అపారసంసారసముద్రమును దాటివేయవచ్చునని
శ్రీశంకరాచార్యులున్ను తెలిపియున్నారు.* అదిలేనిచో దానిని దాటుట అసాధ్యమేయగును. ఏ ఇతర ఉపాయమున్ను అట పనికిరాదు. భగవచ్ఛరణాగతియే ఏకైక మార్గము.
మాయను జయించవలెననిన, లేక దాటవలెననిన, దానిని స్వాధీనపఱచుకొనినవారి పాదముల నాశ్రయించవలెను. దానిని వశమొనర్చుకొనినవాడు సాక్షాత్ పరమాత్మయే. కాబట్టి వారినే శరణుబొందవలెను. కొన్ని భవనముల ముందు కావలికుక్కయుండును. అది యెవరిని లోనికిరానీయదు. కాని యజమానిని మంచి చేసికొనినచో అది లొంగిపోవును. అట్లే ఆ మాయయు భగవంతుని ఆశ్రయించినవారికి దారియొసంగును. జీవన్ముక్తులగు మహనీయులున్ను భగవదాశ్రయముచే మాయను దాటియుందురు గనుక అట్టివారి సేవ కూడ ముముక్షువుల కెంతయో ఉపకరించును.
‘తరన్తి తే’
(నన్నాశ్రయించినవారు మాయను తప్పక దాటగలరు) - అని భగవానుడు విస్పష్టముగ తెలియజేయుటవలన ఇక ఈ విషయమై సంకోచము పనికిరాదు. ప్రాపంచికవస్తువులను, ప్రాపంచికమనుజులను శరణుబొందుటవలన పరమార్థలక్ష్య మేనాటికిని చేకూరదు. దైవమును, దైవభక్తులనే ఆశ్రయించవలెను. ‘మామేవ’ (నన్నే) అని ‘ఏవ’ పదమును ప్రయోగించుటచే ఇతరమును దేనిని ఆశ్రయింపక ఒక్క పరమాత్మనే ఆశ్రయింపవలెనని సూచితమగుచున్నది. కావున ఎవరి తరణము వారిచేతులలోనే యున్నది. దైవము నాశ్రయించినచో తరింతురు. విషయముల నాశ్రయించినచో పతనమొందుదురు. కాబట్టి నశ్వరప్రాపంచికవస్తువులపైనుండి దృష్టిని మరల్చి జనులు భగవచ్ఛరణాగతిపైననే దృష్టిని సంలగ్న మొనర్చవలెను. అట్టివారి జన్మమే సార్థకము కాగలదు.
(భగవంతుని శరణుబొందుటయనగా వారిపై అనన్యభక్తిగలిగియుండుట, భగవత్కార్యములనుజేయుట, ఆత్మచింతన, ఆత్మధ్యానము గావించుట, దైవికగుణములు గలిగియుండుట మొదలైనవియగును.)
ప్ర:- మాయ యెట్టిది ?
ఉ:- (1) దైవికమైనది (అలౌకికసామర్థ్యముకలది)
(2) త్రిగుణాత్మకమైనది
(3) భగవంతునకు స్వాధీనపడియున్నది
(4) దాటుటకు కష్టసాధ్యమైనది.
ప్ర:- అయితే అట్టి భయంకరమగు మాయను దాటుట ఎట్లు?
ఉ:- భగవంతుని శరణుబొందువారు, ఆశ్రయించువారు ఆ మాయాసముద్రమును అవలీలగ దాటివేయగలరు. తక్కినవారు దాటలేరు.
----------------------
* అపార సంసార సముద్రమధ్యే సమ్మజ్జతో మే శరణం కిమస్తి |
గురు కృపాళో కృపయావదైతత్
విశ్వేశ పాదామ్బుజదీర్ఘనౌకా ||
-(శ్రీ శంకరాచార్యులు)
శిష్యుడు: దయామయా ! అపారమగు ఈ సంసార సముద్రమున మునుంగుచున్న నాకు శరణ్యమేదియో తెలుపుడు?
గురువు: భగవానుని పాదపద్మములు అను విశాలమైన నౌకను ఆశ్రయింపుము. తరింతువు.
------
865
07-14-గీతా మకరందము.
విజ్ఞానయోగము
-పూజ్యశ్రీశ్రీశ్రీ విద్యాప్రకాశానందగిరి స్వాములవారు,
శ్రీశుకబ్రహ్మాశ్రమము, శ్రీకాళహస్తి
అ|| త్రిగుణాత్మకమగు ఆ మాయాబంధముయొక్క స్వభావమును తెలియజేసి దానిని తొలగించుట కుపాయమును చెప్పుచున్నాడు -
టీకః- హి = ఏలయనగా, దైవీ = దైవసంబంధమైనదియు (అలౌకికసామర్థ్యము కలదియు), గుణమయీ = త్రిగుణాత్మకమైనదియునగు, ఏషా = ఈ (చెప్పబడిన), మమ = నాయొక్క, మాయా = మాయ (ప్రకృతి), దురత్యయా = దాటుటకు కష్టసాధ్యమైనది, మాం ఏవ = నన్నే, యే = ఎవరు, ప్రపద్యన్తే = శరణుబొందుచున్నారో, తే = వారు, ఏతాం మాయామ్ = ఈ మాయను, తరన్తి = దాటుచున్నారు.
దైవీ హ్యేషా గుణమయీ
మమ మాయా దురత్యయా |
మామేవ యే ప్రపద్యన్తే మాయామేతాం తరన్తి తే ||
తా:- ఏలయనగా, దైవసంబంధమైనదియు (అలౌకిక సామర్థ్యముకలదియు), త్రిగుణాత్మకమైనదియునగు ఈ నాయొక్క మాయ(ప్రకృతి) దాటుటకు కష్టసాధ్యమైనది. (అయినను) ఎవరు నన్నే శరణుబొందుచున్నారో వారీమాయను దాటివేయగలరు.
వ్యాఖ్య:- జనులు భగవంతుని ఏల తెలిసికొనలేకయున్నారో క్రిందటిశ్లోకమున చెప్పబడినది. ఈ శ్లోకమున భగవంతుని పొందుటకు, మాయను దాటుటకు ఉపాయము చెప్పబడుచున్నది. కాబట్టి ముముక్షువుల కీ శ్లోకము అతి ముఖ్యమై యున్నది. దీనిని కంఠస్థముచేసి నిరంతరము మననము చేయవలసియున్నది.
దేవుని దర్శించుటకు ఒక పెద్ద అడ్డుగోడయున్నది. అది అడ్డముగానున్నందున ఎవరును ఆ పరమాత్మను దర్శింపజాలకున్నారు. దానినే ‘ మాయ’ అందురు. ‘పెన్నదాటితే పెరుమాళ్ల సేవ’ అనునట్లు ఆ మాయను దాటితేనే పరమాత్మదర్శనమగును. అయితే దానిని దాటుట ఎట్లు? ఆ పద్ధతి ఈ శ్లోకమున చక్కగ చెప్పబడినది. మాయను అభివర్ణించుచు భగవానుడు నాలుగు విశేషణములను పేర్కొనియున్నారు. అవియేవి యనిన - అది (1) దైవసంబంధమైనది అనగా అలౌకికమైనది. గొప్పసామర్థ్యము కలది. (2) త్రిగుణాత్మకమైనది. (3) భగవంతునకు లోబడినది. (4) దాటుటకు కష్టసాధ్యమైనది. ఈ మాయాలక్షణములను గుఱించి ఒకింత విచారించెదము.
(1) మాయను ‘దైవీ’ (దైవసంబంధమైనది) అని వర్ణించుటచే అది సామాన్యమైనదికాదనియు, భగవత్సంబంధమైనదనియు, మహత్తర శక్తిసామర్థ్యములు గలిగి అలౌకికమైనదనియు స్పష్టమగుచున్నది. దీనినే ‘వైష్ణవీమాయ’ అనికూడ అందురు. అది మహాశక్తివంతమై యుండుటవలన అనేకులను మేధాసంపన్నులను, బలవంతులను, రాజాధిరాజులను, ఇంద్రులను, చంద్రులనుగూడ పడగొట్టి అజ్ఞానమందు, జననమరణప్రవాహమందు పడద్రోయుచున్నది. జనులయొక్క లౌకికములైన తెలివితేటలు దాని దగ్గఱ ఉపయోగించవు. అది దైవసంబంధమైనది కనుక దైవిక ఉపాయముల వలననే లోబడగలదు.
(2) ‘గుణమయీ’ అని చెప్పుటచే ఈ మాయ త్రిగుణాత్మకమైనదని, అనగా సత్త్వరజస్తమోగుణములే స్వరూపముగ గలదని తెలియుచున్నది. మాయకు (ప్రకృతికి) వేఱు ఆకారము లేదు. త్రిగుణములే దాని ఆకారము. కనుకనే ‘గుణమయ’మని చెప్పబడినది. ఆ త్రిగుణములలో ఒక్కొక్క గుణమును లాగిపారవైచినచో ఇక మాయ మిగులదు. ఈ గుణములచే మోహితులయియే (భ్రమింపబడి) జనులు తన్నెఱుగజాలకున్నారని క్రిందటి శ్లోకముననే భగవానుడు తెలిపియుండుట గమనింపదగినది.
(3) ‘మమ’ (నాయొక్క) ‘మాయా’ అని చెప్పుటవలన ఈ మాయ భగవంతునకు స్వాధీనమై యున్నదని స్పష్టమగుచున్నది. ఇండ్లలోని పెంపుడుమృగములు యజమానికి లోబడియుండునట్లు మాయ పరమేశ్వరునికి లోబడియున్నది. (‘మాయినంతు మహేశ్వరమ్’). ఈ మాయ సామాన్యజనులను ముప్పతిప్పలు పెట్టునదియైనను దేవుని దగ్గర అణగియుండును (యజమానిచెంత భృత్యునిపగిది). మాయకు లోబడినవారికి దానిని జూచిన భయము. మాయను స్వాధీనపఱచుకొనిన పరమాత్మకుగాని, దానిని జయించిన జ్ఞానులకుగాని అది అల్పముగ తోచును. ‘యా మా సా మాయా’ (ఏదిలేదో అదియే మాయ) అనునట్లు దాని రహస్యమెఱిగినవారికి అది లేనిదేయగును. మహాసముద్రము భయంకరముగ తోచినను గరుత్మంతునకు గోష్పదజలమువలె తోచును. అవలీలగా దానిని దాటివేయును. ఒక దోమకు గోష్పదజలము మహాసాగరముగ తోచును. ఆప్రకారమే మహాశక్తివంతమగు ఈ మాయ, ఈ ప్రకృతి జనులకు అనుల్లంఘనీయముగా స్ఫురించినను పరమాత్మకు స్వాధీనపడి ఆతని కొక ఉపకరణముగ వర్తించుచున్నది. కనుకనే ‘మమ మాయా’ - నాయొక్క మాయ, నాకు లోబడిన మాయ అని భగవానుడు చెప్పుటకు కారణమైనది.
(4) ‘దురత్యయా’ - (దాటుటకు కష్టసాధ్యమైనది). మాయనుదాటుట కష్టసాధ్యమేకాని అసాధ్యముకాదు. మనస్సును జయింపనివారు, ఇంద్రియములకు దాసులు, విషయవాంఛాపరులు అగు మనుజులు మాయను దాటలేరు. ఆత్మజ్ఞానపరాయణులు, దైవ తత్పరులు, భక్తివైరాగ్యాదిసాధనోపేతులు దాటగలరు. ఈ విషయమును రెండవ పాదమునందు భగవానులు చెప్పబోవుచున్నారు.
ఈ ప్రకారముగ మాయయొక్క భయంకరస్వరూపమును తెలిసికొంటిమి. అంతమాత్రముచేత ఎవరును భీతిల్లవలసినపనిలేదు. సముద్రము విశాలమైనను, దుస్తరమైనను ఒకచిన్న ఓడను సంపాదించినచో దానిని అవలీలగ దాటివేయవచ్చును. అట్లే భయంకర మాయాసముద్రమును దాటుటకు భగవానుడు ఈ శ్లోకముయొక్క రెండవపాదమందు చక్కని పడవను ప్రసాదించినారు. అదియే భక్తి, భగవదాశ్రయము, భగవచ్ఛరణాగతి , ఆత్మచింతన. ‘నన్ను శరణుబొందువారీ భయంకరమగు మాయను సులభముగ దాటివేయగలర’ని పరమాత్మ కరుణతో బోధించిరి.
865
07-13-గీతా మకరందము.
విజ్ఞానయోగము
-పూజ్యశ్రీశ్రీశ్రీ విద్యాప్రకాశానందగిరి స్వాములవారు,
శ్రీశుకబ్రహ్మాశ్రమము, శ్రీకాళహస్తి
అ|| అట్టి పరమాత్మను జను లేల తెలిసికొనజాలకున్నారో వచింపబడుచున్నది -
త్రిభిర్గుణమయైర్భావైః
ఏభిస్సర్వమిదం జగత్ |
మోహితం నాభిజానాతి
మామేభ్యః పరమవ్యయమ్ ||
టీక:- ఏభిః = ఈ చెప్పబడిన, త్రిభిః = మూడువిధములైన, గుణమయైః = (సత్వరజస్తమో) గుణములయొక్క వికారములగు, భావైః = స్వభావములచేత, సర్వం ఇదంజగత్ = ఈ ప్రపంచమంతయు, మోహితమ్ (సత్) = మోహమును (భ్రాంతిని, అవివేకమును) బొందింపబడినదై, ఏభ్యః = ఈ త్రిగుణములకంటె, పరమ్ = వేఱైనట్టియు (అతీతుడైనట్టియు), అవ్యయమ్ = నాశరహితుడైనట్టియు, మామ్ = నన్ను, న అభిజానాతి = తెలిసికొనజాలకున్నది.
తా:- ఈ చెప్పబడిన మూడువిధములగు సత్త్వరజస్తమోగుణములయొక్క వికారములగు స్వభావములచేత ఈ ప్రపంచమంతయు మోహమును (అవివేకమును) బొందింపబడినదై ఆ గుణములకంటె వేఱై (అతీతుడనై) నాశరహితుడనైనట్టి నన్ను తెలిసికొనజాలకున్నది.
వ్యాఖ్య:- ఆకసము మేఘములచే దట్టముగ గప్పబడినపుడు మేఘములకు ఆవలనున్న సూర్యుని మేఘములకు ఈవలనున్న జనులెట్లు చూడజాలరో, అట్లే త్రిగుణములకు ఆవలనున్న పరమాత్మను త్రిగుణములస్వభావములకు, వికారములకు లోబడిన జనులు తెలిసికొనజాలకున్నారు. మఱియు అత్తిపండులోనున్న పురుగులవలె త్రిగుణాత్మకమగు మాయాగోళమున జీవులు పరిభ్రమించుచున్నారు. తత్త్వవిచారణయను ఝంఝామారుతముచే మనుజుడెపుడు త్రిగుణాత్మకమగు ఆ మాయామేఘమును తొలగించివేయునో అపుడు స్వస్వరూపమగు ఆత్మ నిరావరణముగ ప్రకాశించును. ఆత్మసాక్షాత్కారము లభించును. ఈశ్లోకమున జీవుడేప్రకారము త్రిగుణాత్మకమగు మాయచే బంధింపబడెనో తెలుపబడినది. రాబోవు శ్లోకమున ఆ బంధము నెట్లు తొలగించుకొనగలడో వచింపబడినది. ప్రతి మనుజుడును మొట్టమొదట తాను మాయారూపబంధమున తగుల్కొనియున్నాడను సత్యమును గ్రహించుట అత్యావశ్యకము. ఏలయనగా తాను బంధింపబడియున్నాడని తెలిసికొనినవాడు తద్విముక్తికై తప్పక ప్రయత్నించగలడు. ‘సర్వ మిదం జగత్’ అని శ్లోకమున చెప్పబడినట్లు ప్రపంచమందలి సమస్త జీవులును (జీవన్ముక్తులు మినహా) ధనవంతులు, బలవంతులు, సౌందర్యవంతులు, లౌకికవిద్యావంతులు - అందఱును బంధనమందేయున్నారు. కావున ఆ సత్యమెఱిగి ప్రతివారును తమ బంధవిముక్తికై తప్పక ప్రయత్నించవలెను. ‘తమసస్తు పారే’ అనునట్లు పరమాత్మ తమస్సు (అజ్ఞానము) అను తెర ఆవలనున్నారు. వారిని దర్శించనిదే సంసారదుఃఖము శమించదు. అయితే భగవద్దర్శనము కావలెననిన జీవునకు దేవునకు మధ్యగల త్రిగుణాత్మకమగు పొర ఛేదింపబడవలెను. భక్తివైరాగ్యాదులచేతను, నిష్కామకర్మాచరణముచేతను, తదితర సాధనలచేతను క్రమముగ రజోగుణ తమోగుణములను బోగొట్టుకొని, ఆపిమ్మట సత్త్వగుణమునుగూడ దాటి కేవలాత్మస్థితియందు నిలకడను బొందవలెను. అదియే మోక్షము.
నాకు భగవంతు డేల కనిపించుటలేదు? అని కొందఱు ప్రశ్నించుదురు. వారికి ఈ శ్లోకమున సమాధానము గలదు. త్రిగుణములచే మోహితులైయున్నంత వఱకు జనులు పరమాత్మనెఱుగజాలరు. మఱియు దుఃఖము నంతముచేసికొనజాలరు. నేత్రములు పొరచేకప్పబడినవాడు ‘నాకు వస్తువులు కనిపించుటలేదే’ అని ప్రశ్నించుటవంటిదే పైప్రశ్న. ‘ఆపరేషన్’ చేసి ఆ పొర ఎత్తివేయవలెను. అపుడు పదార్థములు స్పష్టముగ గోచరించును. అట్లే ప్రాపంచికభోగములకై ప్రాకులాడక మొట్టమొదట తన హృదయమందలి రజోగుణ తమోగుణాదులను, వాని వికారములను పురుషప్రయత్నముచే భక్త్యాది సాధనల నవలంబించి తొలగించుటకు యత్నించవలెను. భగవద్దర్శనమున కిదియే మార్గము.
ప్ర:- పరమాత్మ యెట్టివాడు ?
ఉ:- అవ్యయుడు, నాశరహితుడు.
ప్ర:- ఆత డెచట నుండును?అతని స్థానమెద్ది?
ఉ:- త్రిగుణములకు ఆవల. (త్రిగుణములు = సత్త్వరజస్తమోగుణములు)
ప్ర:- జీవులేల అతనిని తెలిసికొనజాలకున్నారు?
ఉ:- వారు త్రిగుణములకు ఈవలనుండుటచే వానిచే మోహితులై ఆవలనున్న పరమాత్మను తెలిసికొనజాలకున్నారు.
ప్ర:- కావున భగవంతుని తెలిసికొనవలెననిన ఉపాయమేమి?
ఉ:- నిష్కామకర్మ, భక్త్యాది సాధనలచే ఆ త్రిగుణములను దాటిపోవలెను. అదియే యుపాయము.
865
07-12-గీతా మకరందము.
విజ్ఞానయోగము
-పూజ్యశ్రీశ్రీశ్రీ విద్యాప్రకాశానందగిరి స్వాములవారు,
శ్రీశుకబ్రహ్మాశ్రమము, శ్రీకాళహస్తి
అ|| జగత్తునకు మూలకారణము తానేయని భగవానుడు చెప్పుచున్నారు-
యే చైవ సాత్త్వికా భావా
రాజసా స్తామసాశ్చయే |
మత్త ఏవేతి తాన్విద్ధి
న త్వహం తేషు తే మయి ||
టీకః- సాత్త్వికాః = సత్త్వగుణముచేగలిగిన, భావాః= పదార్థములు (లేక స్వభావములు), యే = ఏవి (కలవో), రాజసాః చ = రజోగుణమువలన గలిగినవియు, తామసాః చ = తమోగుణమువలన గలిగినవియు, యే = ఏవి (కలవో), తాన్ = వానిని, మత్తః ఏవ ఇతి = నావలన గలిగినవియే యని, విద్ధి = తెలిసికొనుము, తు = కాని, తేషు = వానియందు, అహమ్ = నేను, న= లేను, తే= అవి, మయి = నాయందు, (సన్తి = ఉన్నవి).
తా:- సత్త్వరజస్తమోగుణములచే గలిగిన పదార్థములు (లేక స్వభావములు) ఏవికలవో అవి నా వలననే కలిగినవని నీవెఱుంగుము. అయితే నేను వానియందు లేను. అవి నాయందున్నవి. (నేను వానికి వశుడనుగాను, అవి నాకు వశవర్తులై యున్నవని భావము).
వ్యాఖ్య:- ఆధారములేనిదే ఆధేయము నిలువదు. ఈ సమస్తప్రపంచమునకును అందలి పదార్థములకును ఆధారము పరమాత్మ. ఆతని సత్తవలననే అవి సత్తగలిగియున్నవి. అధిష్ఠానమగు ఆత్మయొక్క వివర్తమాత్రమే ఈ ప్రపంచము. అనగా భ్రమచే రజ్జువునందు గోచరించు సర్పమున కెట్లు రజ్జువు కారణభూతమైనదో అట్లే ఈ జగత్తునకు పరమాత్మ కారణభూతులైయున్నారు. కనుకనే ఇచట సాత్త్వికాది గుణములవలన గలిగిన ‘సమస్త పదార్థములు నావలననే కలిగిన’ వని భగవానుడు చెప్పుటకు కారణమైనది. ఈ ప్రకారముగ ఆ జగద్రూప వస్తువులన్నియు పరమాత్మపై ఆధారపడియున్నవి. కాని పరమాత్మ వానిపై ఆధారపడుటలేదు. సర్పము రజ్జువునందు గలదు. రజ్జువు సర్పమునందు లేదు. అనగా సర్పము రజ్జువుపై ఆధారపడియున్నది. అంతియేకాని రజ్జువు సర్పముపై కాదు. తరంగములు సముద్రముపై ఆధారపడియున్నవి. సముద్రము తరంగములపై కాదు. ‘అవి నాయందున్నవి. నేను వానియందులేను’ అను భగవద్వాక్యముయొక్క అర్థ మిదియే.
‘న త్వహం తేషు తేమయి’ - అను వాక్యమునకు మరియొకవిధముగ గూడ అర్థము చెప్పవచ్చును - ఎట్లనిన - (అహం తేషు న, తే మయి న) నేను వానియందు గాని, అవి నాయందుగాని లేవు. ఇది పూర్ణఅద్వైతస్థితిని గూర్చి చెప్పువాక్యము. ఈ దృశ్యజగత్తు స్వప్నప్రాయమై వాస్తవముగ (పరమార్థదృష్టియందు) లేనిదై యున్నది. కావున లేని వస్తువునందు పరమాత్మ యుండుటయేమి? పరమాత్మ యందు ఆ లేని వస్తువు వుండుటయేమి ?
ఈ శ్లోకమునందు మొదటిపాదము, రెండవపాదములోని పూర్వార్ధము ద్వైత విశిష్టాద్వైత తత్త్వమును, రెండవపాదములోని ఉత్తరార్ధము అద్వైతతత్త్వమును సూచించుచున్నది. గీతయందు పరిపూర్ణ అద్వైతస్థితి బోధింపబడిన కొలది సందర్భములలో ఇదియొకటియై యున్నది. (భూతభృత్ న చ భూతస్థః (9-5) ఇత్యాదిసందర్భములు).
ఈ శ్లోకమున రాజస తామస భావములుకూడ పరమాత్మ వలననే కలిగినవను వాక్యముచే ఆ దుష్టభావములను ప్రోత్సహించిన ట్లెవరును భావింపరాదు. వానియన్నింటి యొక్క అధిష్ఠానము పరమాత్మయే యని తెలుపుటకొఱకే అట్లు వచింపబడినది.
ప్ర:- పరమాత్మ యెట్టివాడు?
ఉ:- సత్త్వరజస్తమోగుణ సంజనితములగు సమస్త వస్తువులకును ఆధారభూతుడు. అవి ఆతనికి వశములై యున్నవి. ఆతడు వానికి వశుడై లేడు.
865
07-11-గీతా మకరందము.
విజ్ఞానయోగము
-పూజ్యశ్రీశ్రీశ్రీ విద్యాప్రకాశానందగిరి స్వాములవారు,
శ్రీశుకబ్రహ్మాశ్రమము, శ్రీకాళహస్తి
బలం బలవతాం చాహం కామరాగవివర్జితమ్ |
ధర్మావిరుద్ధో భూతేషు
కామోఽస్మి భరతర్షభ ||
టీక:- భరతర్షభ = భరతకులశ్రేష్ఠుడవగు ఓ అర్జునా!, అహమ్ = నేను, బలవతామ్ = బలవంతులయొక్క, కామరాగ వివర్జితమ్ = ఆశ, అనురాగము బొత్తిగాలేని, బలమ్ = బలమును, భూతేషు = ప్రాణులయందు, ధర్మావిరుద్ధః = ధర్మమునకు విరుద్ధముగాని, కామః = కోరికయు, అస్మి = అయియున్నాను.
తా:- భరతకులశ్రేష్ఠుడవగు ఓ అర్జునా ! నేను బలవంతులయొక్క ఆశ, అనురాగములేని బలమును, ప్రాణులయందు ధర్మమునకు వ్యతిరేకముకాని కోరికయు అయియున్నాను.
వ్యాఖ్య:- బలము కలిగియుండుట మంచిదే. కాని అది కామము, రాగము లేనిదై యుండవలెను. అనగా ధర్మవిరుద్ధమగు కార్యములను జేయుటయందును, విషయసంబంధమైన కోరికలను సంతృప్తి పఱచుటయందును, దృశ్యవస్తువులందు అనురాగము, ఆసక్తి చూపుటయందును వినియోగపడునది కానిదై యుండవలెను. ధర్మకార్యములకు, పరోపకారకార్యములకు, దైవకార్యములకు, పరమార్థసాధనలకు వినియోగపడు బలము ఉత్తమమైనది. అది మానసిక బలముకాని, శారీరకబలముకాని. కామరాగములతో గూడినదియు, విషయభోగానుభవమునకొఱకు వినియోగపడునదియునగు బలము నికృష్టమైనది. అది పశుబలము, ఆసురికబలము. భగవన్నివాసమునకది యోగ్యముకాదు. ‘వర్జితమ్’ అని చెప్పక ‘వివర్జితమ్’ అని చెప్పుటవలన బలమందు కామ,రాగములు ఏమాత్రము చేరకయుండవలెనని స్పష్టమగుచున్నది.
మఱియు ధర్మమునకు, శాస్త్రాదేశమునకు విరుద్ధముకాని కోరికయు తానేయని భగవానుడు సెలవిచ్చియున్నారు. కోరిక దుర్వినియోగపరచబడునపుడది ఆసురికమై వర్తించును. సద్వినియోగ పఱచబడునపుడు దైవికమై యొప్పును. దేహధారణానిమిత్తములగు అన్నపానాదుల గూర్చిన ఇచ్ఛామాత్రరూపమైనదియు, మోక్షేచ్ఛా సంబంధమైనదియు, గృహస్థులకు సత్సంతానమాత్ర నిమిత్తమైనదియు నగు కోరిక ధర్మానుకూలమైనది. కావున అది దోషరహితమైనదగుటచే అట్టి కోరికయు తన రూపమేయని భగవానుడు వచించిరి. అయితే ఇదివరలో అనేక పర్యాయములు కోరికలన్నిటిని విడువలసినదిగా (ప్రజహాతి యదా కామాన్ సర్వాన్) బోధించి, ఇపుడు ‘ధర్మమునకు విరుద్ధముకాని కోరికను నేను’ అని గీతాచార్యు లేల చెప్పిరని కొందఱు ప్రశ్నించవచ్చును. అందులకు సమాధానమేమియనిన - కోరిక మూడు విధములు - (1) చెడ్డకోరిక (2) మంచికోరిక (3) కోరికలేకుండుట. ప్రారంభస్థితిలో సాధకుడు చెడ్డకోరికలను విడనాడి, మంచివానిని గ్రహించవలెను. ధర్మమునకు విరుద్ధముకాని కోరికలను స్వీకరించవలెను. (దుస్సంకల్పములను వీడి సత్సంకల్పములను గ్రహించవలెను.) అనగా పరోపకారమును గూర్చిన కోరిక, జన్మ తరించవలెనను కోరిక, భగవద్ధ్యానము చేయవలెనను కోరిక, గృహస్థుడైనచో సత్సంతానప్రాప్తికి హేతువగు కోరిక, పుణ్యకార్యముల నాచరించవలయునను కోరిక మున్నగువానిని ప్రారంభములో నవలంబించి క్రమముగ సాధనపరిక్వతచే పురోగతినొందుచు, నిస్సంకల్పస్థితిని అనగా ఏకోరికయు, ఏ సంకల్పమున్ను లేని ఆత్మస్థితిని పొందవలెను. ఈ ప్రకారముగ ఆత్మస్థితికి దోహదమొనర్చుటవలన ధర్మానుకూలములగు కోరిక లిచట ప్రోత్సహింపబడి ధర్మవిరుద్ధమగు కోరికలుమాత్రము ఖండింపబడెనని గ్రహించవలెను. కాని ఎప్పటికైనను కోరికలన్నిటిని విడనాడిననే తప్ప నిర్విషయ ఆత్మస్థితి గలుగదనియు సాధకులు గుర్తెఱుంగవలయును.
865
07-10-గీతా మకరందము.
విజ్ఞానయోగము
-పూజ్యశ్రీశ్రీశ్రీ విద్యాప్రకాశానందగిరి స్వాములవారు,
శ్రీశుకబ్రహ్మాశ్రమము, శ్రీకాళహస్తి
బీజం మాం సర్వభూతానాం
విద్ధి పార్థ సనాతనమ్ |
బుద్ధిర్బుద్ధిమతామస్మి తేజస్తేజస్వినామహమ్ ||
టీక:- పార్థ = ఓ అర్జునా!, మామ్ = నన్ను, సర్వభూతానామ్ = సమస్తప్రాణులయొక్క, సనాతనమ్
= శాశ్వతమైన, బీజమ్ = బీజముగ (కారణముగ, మూలముగ), విద్ధి = ఎఱుగుము, (మఱియు) అహం =
నేను, బుద్ధిమతామ్ = బుద్ధిమంతులయొక్క, బుద్ధిః = బుద్ధియు (వివేకమును), తేజస్వినామ్ =
ధీరులయొక్క, తేజః = ధైర్యమును, అస్మి = అయియున్నాను.
తా:- ఓ అర్జునా ! నన్ను ప్రాణులయొక్క శాశ్వతమైన బీజముగ నెఱుంగుము. మఱియు, బుద్ధిమంతులయొక్క బుద్ధియు, ధీరులయొక్క ధైర్యమును నేనే అయియున్నాను.
వ్యాఖ్య:- ‘బీజం మాం సర్వభూతానాం’ అను వాక్యము ద్వారా సమస్త ప్రాణులయొక్క బీజము (మూలము) ఆ పరమాత్మయేయనియు, వారినుండియే సర్వులు నుద్భవించిరనియు స్పష్టమగుచున్నది. అందఱికిని బీజము వారే కనుక ఇక ‘వాడెక్కువ, వీడు తక్కువ’ అను భేదబుద్ధికి ఆస్కారమేలేదు. కావున ఎట్టి తక్కువ కులమందు జన్మించినప్పటికిని, ఎట్టి పాపాత్ముడైనప్పటికిని, తన బీజము, తన తండ్రి ఆ పరమాత్మయే యని నిశ్చయించి మనుజులు పుణ్యపథమున అగ్రసరులు కావలసియున్నది. తాను తక్కువ అని యెవరును దుఃఖపడనక్కరలేదు. అందఱికిని బీజము ఆ భగవానుడే అయియున్నారు. అందఱిది ‘పరబ్రహ్మ’ గోత్రమే అయి యున్నది. బీజముయొక్క స్వభావమే చెట్టునందుండును. కావున అందఱును వాస్తవముగ సనాతనబ్రహ్మస్వరూపములే అయియున్నారు. అవిద్యావశముననే మనుజుడు తానల్పుడని, జీవుడని, దేహమని, దృశ్యమని భ్రమించుచున్నాడు. ఎపుడిట్టి ధైర్యోత్పాదకములగు భగవద్వాక్యముల వలన ఆ అవిద్య తొలగిపోవునో అపుడు తాను సనాతన ఆత్మ స్వరూపుడేయనియు, తనకు మూలహేతువు ఆ పరమాత్మయే యనియు నిశ్చయించి పరమానందభరితుడగును.
ఎటువంటి నీచుడైనను, చండాలుడైనను, దరిద్రుడైనను, దీనాతిదీనుడైనను తనకు బీజము, మూలము పరమాత్మయేయని తెలిసికొనినచో ధైర్యోపేతుడుకాగలడు. తన నిజస్వరూప మెఱిగినపుడు ఎట్టి అల్పునకైనను మేరుసమానగాంభీర్యము చేకూరగలదు. గీతాచార్యులు ఎెవరినిగూడ ‘నీవు అల్పుడవు, నీచుడవు, తక్కువజాతివాడవు’ అని బోధించలేదు. పై పెచ్చు ‘నీ యొక్క బీజము సనాతనపరమాత్మయే’ అని వచించుచున్నారు. ‘సర్వభూతానాం’ అని చెప్పుటచే ఏ ఒకానొకనికో ఆతడు బీజముకాదనియు సమస్త ప్రాణికోట్లకును బీజమనియు స్పష్టమగుచున్నది. ఇట్టి బోధలే ఇపుడు లోకమున కెంతయో అవసరములైయున్నవి. సంసారమున క్రుంగిపోవుచుండువారని ఈ బోధలు పైకి లేవనెత్తుచుండును. తరంగము చిన్నది. అయిననేమి? దానివెనుక దానికాధారముగ, కారణముగ, బీజముగ అనంతసముద్రము కలదు. కావున తరంగము తన అల్పరూపమునుగూర్చి దుఃఖించక, తనకు బీజభూతమైన మహాసముద్రమును తలంచుకొని ధైర్యమొందవలెను. అట్లే మానవుడున్ను తన చిన్న ఉపాధినిగూర్చి స్మరింపక, తన బీజము, తన నిజరూపము, తన ఉపాధికి ఆధారము పరమాత్మయేయని నిశ్చయించుకొనినచో ఎంతధైర్యము చేకూరును! తనకు మూలము తన తండ్రికాదు, తాతకాదు, ముత్తాతకాదు, సాక్షాత్ పరమాత్మయే యను నమ్మకము పూర్తిగ యుండవలెను. కనుకనే ఇప్పటికిని ద్విజులు సంధ్యావందనమునందు కట్టకడకు ప్రవర చెప్పునపుడు తమ గోత్రము వచించు సందర్భమున ఏ మహర్షినో స్మరించుదురుగాని తమ కులమందలి అన్యులనుగాదు.
‘బీజం మాం సర్వభూతానాం’ అను వాక్యము ద్వారా భగవానుడు ఈ క్రింది బోధను జనులకు గావించుచున్నారు - “ఓ జీవులారా! మీరు అల్పులని, దీనులని ఏ కాలమందును భావింపరాదు. మీ అందఱియొక్క బీజము, మూలము నేనే . అది సామాన్య బీజము కాదు, శాశ్వతమైన (సనాతనమ్) బీజము. కాబట్టి మీరందఱు నా పరంపరలో పుట్టినవారే. మీకు నేనే మూలపురుషుడను. మీరందఱు దైవాంశములో జన్మించినవారే. చెట్టు విత్తనమునకు అన్యముగా నుండదు. మీరందఱు వృక్షరూపులు, ఆ వృక్షమునకు నేను బీజమును. నేను సనాతనుడను, గనుక మీరున్ను సనాతనులే (శాశ్వతులే) యగుదురు. ఈ వాక్యమునందు నమ్మకముంచి తరించిపొండు. దేహభావము గలిగి అనవసరముగ దుఃఖముల బాల్పడకుడు ! మీ నిజరూపమును సంస్మరించి సింహకిశోరమువలె పైకిలెండు!”
శ్రీకృష్ణభగవానుని ఈ దివ్యబోధ స్మృతిపథమునందుంచుకొని తరించుట ప్రతిజీవియొక్కయు విధ్యుక్త ధర్మము.
ప్ర:- సమస్త ప్రాణికోట్లకు బీజభూతు డెవడు?
ఉ:- పరమాత్మయే.
ప్ర:- ఆతని స్వరూపమెట్టిది?
ఉ:- శాశ్వతమైనది (సనాతనము).
865
07-09-గీతా మకరందము.
విజ్ఞానయోగము
-పూజ్యశ్రీశ్రీశ్రీ విద్యాప్రకాశానందగిరి స్వాములవారు,
శ్రీశుకబ్రహ్మాశ్రమము, శ్రీకాళహస్తి
పుణ్యో గన్ధః పృథివ్యాం చ
తేజశ్చాస్మి విభావసౌ |
జీవనం సర్వభూతేషు
తపశ్చాస్మి తపస్విషు ||
టీక:- (మఱియు నేను) పృథివ్యామ్ = భూమియందు, పుణ్యః గన్ధః చ = మంచివాసనయు, విభావసౌ
= అగ్నియందు, తేజః చ = ప్రకాశమును, అస్మి = అయియున్నాను, సర్వభూతేషు = సమస్త
ప్రాణులయందు, జీవనమ్ = ప్రాణమును (లేక ఆయువును), తపస్విషు = తపస్సుచేయువారియందు, తపః
చ = తపస్సున్ను, అస్మి = అయియున్నాను.
తా:- (మఱియు నేను) భూమియందు సుగంధమును, అగ్నియందు ప్రకాశమును, సమస్త ప్రాణులయందు ప్రాణమును (లేక ఆయువును), తాపసులయందు తపస్సును అయియున్నాను.
వ్యాఖ్య:- గంధము లేని భూమిని, ప్రకాశములేని అగ్నిని, ప్రాణములేని ప్రాణిని, తపస్సులేని తపస్విని మన మూహింపజాలముకదా! కాబట్టి ఆ యా వస్తువులందలి సారమే పరమాత్మ. దీనిచే వారు సమస్త పదార్థములందును పూర్ణముగ వ్యాపించియున్నారని స్పష్టమగుచున్నది.
865
07-08-గీతా మకరందము.
విజ్ఞానయోగము
-పూజ్యశ్రీశ్రీశ్రీ విద్యాప్రకాశానందగిరి స్వాములవారు,
శ్రీశుకబ్రహ్మాశ్రమము, శ్రీకాళహస్తి
అ|| తనయొక్క ఆ సర్వవ్యాపకత్వమును భగవానుడు నాలుగు శ్లోకముల ద్వారా తెలియజేయుచున్నారు -
రసోఽహమప్సు కౌన్తేయ
ప్రభాస్మి శశిసూర్యయోః |
ప్రణవః సర్వవేదేషు
శబ్దః ఖే పౌరుషం నృషు ||
టీక:- కౌన్తేయ = ఓ అర్జునా, అహమ్ = నేను, అప్సు = ఉదకములయందు, రసః = రుచియు, శశిసూర్యయోః = చంద్ర సూర్యులందు, ప్రభా = కాంతియు, సర్వవేదేషు = సమస్తవేదములయందు, ప్రణవః = ఓంకారమును, ఖే = ఆకాశమందు, శబ్దః = శబ్దమును, నృషు = మనుష్యులయందు, పౌరుషమ్ = పరాక్రమమును, అస్మి = అయియున్నాను.
తా:- అర్జునా ! నేను జలమందు రుచియు, చంద్ర సూర్యులందు కాంతియు, సమస్త వేదములందు ఓంకారమును, ఆకాశమందు శబ్దమును, మనుజులందు పరాక్రమమును అయియున్నాను.
వ్యాఖ్య:- సమస్త చరాచర ప్రాణికోట్లయందు మణులందు దారమువలె తాను వ్యాపించి యున్నానని భగవానుడు క్రిందటి శ్లోకమందు ప్రతిపాదించిరి. ఆ సత్యమును ఋజువు చేయుటకై కొన్ని కొన్ని వస్తువులను తీసుకొని వానియందు తానెట్లు వ్యాపించియున్నది ఇచట తెలుపుచున్నారు. నీటియందు తాను రుచిరూపమునను, చంద్రసూర్యులందు ప్రకాశరూపమునను, వేదములందు ఓంకారరూపమునను, ఆకాశమందు శబ్దరూపమునను, మనుష్యులందు పరాక్రమమరూపమునను ఉన్నట్లు భగవానుడు సెలవిచ్చిరి. దీనినిబట్టి పరమాత్మ సమస్తవస్తువులందును ఓతప్రోతమై అంతర్యామిరూపమున వ్యాపించియున్నట్లు స్పష్టమగుచున్నది. రుచిలేనిది జలము యుండదు. రుచికి జలమునకు అవినాభావ సంబంధముగలదు. జలమే రుచి, రుచియే జలము. రెండింటిని విడదీయుటకు వీలుండదు. అట్లే ప్రకాశమే సూర్యుడు. సూర్యుడే ప్రకాశము. ప్రకాశము లేని సూర్యుని యెవరును ఊహింపజాలరు. ఈ ప్రకారముగ సర్వవస్తువులను గుఱించియు గ్రహించుకొనవచ్చును. భగవానుని సర్వవ్యాపకత్వమును ఆదిలోనే తెలిసికొనుట కష్టతరముగనుక సామాన్యులకు అట్టి విశ్వవ్యాపకభావము సులభగ్రాహ్యమగుటకొఱకై కొన్ని ఉదాహరణము లిచట పొందుపరుపబడినవి.
వేదములందు తాను ఓంకారరూపముననున్నట్లు భగవానుడు చెప్పినందువలన వేదములందలి సారము ఓంకారమేయని తేలుచున్నది. మఱియు ‘సర్వవేదేషు’ అని పేర్కొనబడినందువలన సమస్తవేదములయొక్కయు సారము ఓంకారమేయని స్పష్టమగుచున్నది. జనుల ఆయుష్కాలము అతిస్వల్పమగుటవలనను, వేదములు అనంతము లగుట వలనను సారభూతమైన విషయము నెఱింగి అనుష్ఠించినచో జన్మ తరించిపోగలదు. అట్టి సారమే ఓంకారము. కావున ప్రణవమును జపించుచు ప్రణవార్థమును చింతించుచు ప్రణవవాచ్యుడగు పరమాత్మను ధ్యానించుచుండిన పరమశ్రేయము లభించగలదు.
మనుష్యులందు పరాక్రమ (ఉత్సాహ, ధైర్య) రూపమున తానున్నానని భగవానుడు చెప్పినందువలన, ఆ సుగుణరాజము మనుజుల కత్యావశ్యకమని స్పష్టమగుచున్నది. ధైర్యము, పరాక్రమము, ఉత్సాహము ఉండుచోట సాక్షాత్ భగవానుడు కాపురముండును. దిగులు, దుఃఖము, పిరికితనము వ్రేలాడుముఖములు, (Long Faces) ఉండుచోట దయ్యములు వసించును. కావున దుర్బలత్వమును పారద్రోలి భగవత్స్వరూపములే యగు ధైర్యోత్సాహాది సుగుణములను ఆర్జించవలయును. అట్టివాడు ధన్యుడు.
ప్ర:- భగవానుడు ఏ యే వస్తువుల
యందు ఏయేరూపమున నుండునో మచ్చునకు కొన్ని తెలుపుడు?
ఉ:- (1) నీటి యందు రుచి రూపమునను (2) చంద్రసూర్యులందు కాంతిరూపమునను (3) వేదములన్నిటియందును ప్రణవరూపమునను (4) ఆకాశమందు శబ్దరూపమునను (5) మనుష్యులందు పరాక్రమరూపమునను భగవానుడున్నాడు.
865
ప్ర:- జగత్తునందు పరమాత్మ యేప్రకారముగ వ్యాపించియున్నాడు?
ఉ:- మణులందు దారమువలె.
ప్ర:- కాబట్టి భగవద్దర్శనమునకై యేమిచేయవలెను?
ఉ:- వివేకదృష్టిని (జ్ఞానదృష్టిని) సంపాదించవలెను.
---------------
* సర్వగం సచిదానన్దం జ్ఞానచక్షుర్నిరీక్షతే
అజ్ఞానచక్షుర్నేక్షేత భాస్వన్తం భానుమన్ధవత్ (ఆత్మబోధ - శ్రీ శంకరాచార్యులవారు)
సర్వవ్యాపకుడగు సచ్చిదానందపరమాత్మను జ్ఞాననేత్రుడే చూడగల్గును, ప్రకాశమానుడగు సూర్యుని గ్రుడ్డివాడు చూడజాలనట్లు అజ్ఞాని పరమాత్మను చూడజాలడు .
