Devotional Telugu
Open in Telegram
An attempt to bring our Hindu Devotional information
Show more3 565
Subscribers
No data24 hours
No data7 days
No data30 days
Posts Archive
3 565
శాంతం స్వర్గతుల్యం
మనిషి కొండంత విలువను పోగొట్టేది గోరంత కోపం. కోపం వచ్చిన మనిషి విచక్షణను కోల్పోయి పశువుగా మారతాడు.
కోపాన్ని జయించిన మనిషి గోవిందుడు. జనం అతణ్ని మెచ్చుతారు. అతడి సాంగత్యాన్ని ఇష్టపడతారు. సప్త రుషుల్లో విశ్వామిత్రుడు, జమదగ్ని ఉగ్రస్వభావులు. కశ్యప, అత్రి, భరద్వాజ, గౌతమ, వసిష్ఠులు సాధుపుంగవులు. మునుల్లో దుర్వాసుడు ముక్కోపి.
పుడమిపై పాపభారం పెరిగి, పుణ్యాత్ములు హింసపడుతుంటే భగవంతుడికీ కోపం వస్తుంది. పర్యవసానమే- అవతారాలతో దుష్ట శిక్షణ, శిష్ట రక్షణ నెరపడం. శాంతం మనిషి ముఖాన్ని, రూపాన్ని ఉద్దీపింపజేస్తుంది. ధ్యానంలో ఉన్న బుద్ధభగవానుడి ప్రశాంత వదన దర్శనం మానవుడిలోని కోపాన్ని నశింపజేస్తుంది.
నవరసాల్లో వీరం, భయానకం, బీభత్సం, రౌద్రాలకు కారణం కోపమే! తన కోపమే తన శత్రువు అన్నాడు సుమతీ శతకకారుడు బద్దెన. కోపం మనిషిని ఏకాకిని చేస్తుంది. పనులకు విఘాతం కలిగిస్తుంది. సమాజ జీవి అయిన మనిషికి పదిమంది శ్రేయోభిలాషులుంటేనే సంఘజీవనం సంతోషదాయకం అవుతుంది. పరిస్థితులన్నీ ఎప్పడూ ఒక్కలాగా ఉండవు. ఒక్కోసారి అనుకోని విధంగా, ఆయా విపత్కర సమయాలు మనిషి కోపానికి హేతువులవుతాయి. అలాంటప్పుడే సంయమనం పాటించి, మనసును నియంత్రించుకోవాలని మానసిక శాస్త్ర నిపుణులు హెచ్చరిస్తారు.
సమాజంలో ఉన్నత స్థాయి వ్యక్తికి అహంకారంతో కోపం వస్తే, అధమ స్థాయి వ్యక్తి కోపానికి ఏమీ చేయలేని నిస్సహాయత కారణమవుతుంది. స్థాయీభేదాలన్నది ఈ శరీరానికే, ఆత్మకు అంటవు అన్న పురాణ వచనాలు మనిషిలోని ఈశ్వరుణ్ని పరిచయం చేస్తూ, సమానత్వ భావనల్ని అంకురింపజేస్తాయి. అందరిలో తనను చూసుకునే వ్యక్తిలో కోపానికి ఆస్కారం ఉండదు.
ప్రకృతికి కోపం వస్తే, అది అన్ని క్రోధాలకన్నా భయంకరమైనది అంటాడు చాణక్యుడు. అదెంతటి నిజమో సోదాహరణంగా రుజువవుతూనే ఉంది!
కార్యార్థి సామ, దాన, భేద], దండోపాయాలతో కార్య సాఫల్యత పొందాలి. కార్యసాధకుడికి కోపం ఉండకూడదు. నొప్పింపక, తానొవ్వక, సమయానికి తగ్గట్టు ప్రవర్తిస్తూ ఫలితం సాధించాలి. సంధి ప్రయత్నాల కోసం శత్రుశిబిరాలకు వెళ్ళడమంటే, పులిగుహలోకి అడుగుపెట్టడంతో సమానం. అక్కడ కవ్వింపులు, వెక్కిరింపులు, కయ్యానికి కాలుదువ్వడం అత్యంత సహజం. దూతలుగా వెళ్ళేవారిలో సదా శాంతి, సామరస్యభావాలు తొణికిసలాడాలి.
ఇళ్లలో నవ్వుతూ శాంత స్వభావాన్ని వ్యక్తం చేసే సభ్యుల ఛాయాచిత్రాలు ఉంటాయే తప్ప, కోపాన్ని ప్రతిఫలించేవి ఉండవు కదా!
శాంతం మిఠాయి అయితే, కోపం కారంలాంటిది. సాధారణంగా ఎవరైనా మిఠాయిని ఇష్టపడినట్టుగా కారాన్ని కోరుకోరు. శుభవార్తలను సంతోషంగా పంచుకోవడానికి మిఠాయినే ఎంచుకుంటారు. శాంతం లేక సౌఖ్యం లేదు అన్నది త్యాగరాజ కృతి. మనసులో కోపం ఉన్న మనిషికి సుఖం, శాంతి ఉండవు. కోపాన్ని అదిమి ఉంచడానికే నవ్వుతూ బతకాలంటారు వ్యక్తిత్వ వికాస నిపుణులు.
కోపం నరక సదృశం, శాంతం స్వర్గతుల్యం అన్నది ఆధ్యాత్మిక ఉపదేశం. ప్రశాంత చిత్తమే మోక్షపథం కనుక మనిషి, ఇతర జీవుల్ని ఈ విషయంలో అధిగమించాలి. ఉత్తమంగా నిలవాలి!
3 565
రెండో పురుషార్థం
‘ధనం కలిగినవాడే బలవంతుడు. ధనం గలవాడే పండితుడు. ధనం సర్వశ్రేయాలకు నిదానం. ధనం లేనివాడి జీవనమేల? అర్థ పరిహీనుడికి నిరంతరం ఖేదం సంభవిస్తుంది’ అంటాడు నీతిచంద్రికకారుడు. ‘అర్థ’ శబ్దానికి అర్థాలు చాలా ఉన్నా- ధనవాచకంగా లోకంలో రూఢికెక్కింది. పురుషార్థాలు నాలుగింటిలో రెండోది ‘అర్థం’.
మానవులు కోరే సమస్త వస్తు సమూహాన్ని ‘అర్థ’ శబ్దం సూచిస్తుంది. విద్య, భూమి, సువర్ణం, పశువులు, ధన ధాన్యాలు మొదలైనవన్నీ ‘అర్థం’లో భాగమేనన్నాడు వాత్సాయనుడు. ఆర్జనం, వర్ధనం, రక్షణం అనే మూడూ అర్థమనే పురుషార్థ స్వరూపమంటాడు దండి దశకుమార చరిత్రలో. ధర్మాచరణకు, కామ పురుషార్థానుభవానికి అర్థమే కారణమవుతుంది. ధర్మకామాలు రెండూ అర్థానికి రెండు అవయవాలని, అర్థసిద్ధి చేతనే రెండింటి అనుభవం కలుగుతుందని మహాభారతం శాంతిపర్వం చెబుతోంది.
అర్థ ప్రాధాన్యాన్ని గురించి శాస్త్రాలు, ఇతిహాసాలు, కావ్యాలు ఎంతగానో చెప్పాయి. ధనాన్ని న్యాయబద్ధంగా సంపాదించు కోవాలి. ధర్మ పద్ధతిలో అనుభవించాలి. త్యాగబుద్ధితో దానం చేయాలి. మనిషికి వస్తు సంపదల మీద, సుఖభోగాల మీద కోరిక కలుగు తుంది. ఆ కోరిక తీర్చుకునేందుకు తనకు చేతనైన మార్గంలో ప్రయత్నించి వాటిని సాధిస్తాడు. తానను కున్నవి కొన్ని లభించినా, మరికొన్ని సాధించవలసిన కొత్తవి చేరుతూ ఉంటాయి. వాటిని తీర్చుకోవడానికి మనిషి లోకాన్ని సేవిస్తూ, శ్రమిస్తూ ఉంటాడు. తాననుకున్నది సాధించుకోవడం ముఖ్యం కనుక నీతి తప్పి ప్రవర్తించడానికి వెనకాడడు. క్రమంగా అన్ని విధాలా పతనమైపోయే ప్రమాదమూ ఉంది. మన సనాతన సంప్రదాయంలో అర్ధకామాలకు ప్రత్యేకమైన అస్తిత్వం లేదు. మనిషి తాను చేయదలచిన ప్రయాణానికి తన పాదాల సాయం స్వీకరించినట్లు అర్థ కామాలనే తన పాదాల సాయంతో ధర్మం ముందుకు సాగుతుంది.
ధృతరాష్ట్రుడు, అతడి పుత్రులు, పుత్రుల మిత్రులు జీవితానికి అర్థమే పరమార్థమనుకున్నారు. అర్ధాన్ని(రాజ్యాన్ని) తమదిగా నిలబెట్టుకోవాలన్న తాపత్రయంతో పాండవుల్ని ఎన్నో ఇడుములపాలు చేశారు. ఎన్ని ప్రయత్నాలు చేసినా చివరకు తామనుకున్నదాన్ని దక్కించుకోకుండానే పరలోకాన్ని చేరారు. ధర్మరాజుది ధర్మోత్తరమైన జీవితం. పెదతండ్రి రాజ్యం మొత్తానికి తనను యువరాజును చేసినప్పుడు రాజ్యం దక్కిందని అతడు పొంగిపోలేదు. కొంతకాలం తరవాత కుటిలబుద్ధితో ధృతరాష్ట్రుడు అర్ధరాజ్యమే ఇచ్చినప్పుడు కుంగిపోనూలేదు. ధర్మానికి విరుద్ధం కాని అర్థ కాంక్ష అతణ్ని అర్ధరాజ్యస్థితి నుంచి సార్వభౌమ స్థితికి పెంచింది.
ధనానికి దానం, భోగం, నాశం అనే మూడు గతులున్నాయి. ఒకరికి పెట్టక, తాను తినక, దాచి పెట్టిన సంపదకు ఏదో ఒక మార్గంలో నాశనం తప్పదు. ‘సంపాదించిన విత్తానికి త్యాగమే రక్షణ. చెరువులో నిండుగా ఉన్న నీటికి పారుదల ఒక్కటే రక్షణ’ అంటోంది విక్రమార్క చరితం. పాత్రుడికి దానం చేయ మన్నారు. అది ఉత్తమం. తాను ఆర్జించింది అనుభవించడం తప్పు కాదు. కానీ అది మధ్యమమే. ఈ రెండూ జరగకపోతే దొంగలు అపహరించుకుపోతారు. ఇది అధమం. ధనానికి ధర్మం, అగ్ని, రాజు, దొంగలు అనే నలుగురు దాయాదులు. వీరిలో జ్యేష్ఠమైన ధర్మానికి అవమానం కలిగితే తక్కిన ముగ్గురికీ కోపం వస్తుందంటాడొక కవి. దానశీలురు ధనాన్నంతా దానం చేసి సర్వమూ కోల్పోయినా అది అతడికి శోభనే కలిగిస్తుంది. అర్ధ స్వభావాన్ని అర్థం చేసుకుని ప్రవర్తిస్తే ఒక పురుషార్థాన్ని సాధించగలుగుతాం.
3 565
చెట్టులా బతకాలి!
పాలసముద్రం చిలికితే లక్ష్మితోపాటు కల్పవృక్షం ఉద్భవించిన కథ అందరికీ తెలిసిందే. గోవులకు తల్లి కామధేనువులాగానే, చెట్లకు జనని కల్పవృక్షం కావచ్చు. సృష్టిలో మనిషికంటే ముందే చెట్లు ఉన్నాయంటారు శాస్త్రవేత్తలు.
భారతదేశంలో వైద్యానికి పనికిరాని మొక్క గాని, చెట్టుకాని లేవని ఆచార్య నాగార్జునుడు రుజువు చేశాడంటారు. మనం చెట్లను దైవాలుగా పూజిస్తాం. మరికొన్ని దేశాల్లోనూ ఈ ఆచారం ఉంది.
కొబ్బరి చెట్టును కల్పవృక్షంతో పోలుస్తారు. ఆ చెట్టులో పనికిరానిదంటూ ఉండదు. రైతుకు ఎన్ని కొబ్బరి చెట్లు ఉంటే అంత సంపన్నుడు.
భూమాతకు చెట్లు శ్వాసకోశాలు. ఇలాంటి చెట్లను విచక్షణా రహితంగా నరికి పారేస్తున్నారు. మంగళకరమైన పచ్చదనాన్ని పరిహరించి మరుభూములుగా మార్చుకుంటున్నాం.
ఒకప్పుడు ఇంటింటా వేప, మామిడి వంటి వృక్షాలు ఉండేవి. విశాలమైన ఆవరణలు కనిపించేవి. ఇప్పుడు మనసుల మాదిరే ఇళ్లూ ఇరుకైపోయాయి. కొందరి ఇళ్లలో తులసి మొక్క కూడా కనిపించడం లేదు.
తులసి దేవతాంశ కలిగిన ఔషధంగా చెబుతారు. ముఖ్యంగా శ్వాసకోశ వ్యాధులకు తులసి సంజీవని లాంటిది. సత్వరం ఉపశమనం కలిగిస్తుంది.
దేవతా వృక్షాలు, ఔషధశక్తి గల మొక్కలు భగవంతుడు భారతదేశానికి ప్రసాదించిన వరాలు.లక్ష్మణుడి ప్రాణరక్షణ చేసిన సంజీవని మన దేశ అద్భుతం.
సృష్టి రహస్యాన్నంతా తనలోనే దాచుకున్నట్టు చిన్న విత్తనం విచ్చుకుని మౌనంగా మహావృక్షమై సేవలకు సిద్ధమైపోతుంది. పక్షులకు, పాంధులకు స్వాగతం పలుకుతుంది.
ప్రాణుల్లో ఉత్తమ ప్రాణిగా జన్మించిన మనిషి దైవం తరవాత దైవం అంతటివాడు. ఆపదల్లో ఆదుకొనేవాడే దైవం. కాని, బ్రహ్మవంశంలో పుట్టిన రావణుడు లోక కంటకుడైన రాక్షసుడు అయినట్లు, సృష్టి రక్షకుడిగా ఉంటాడని భగవంతుడు భావించిన మనిషి విధ్వంసకుడిగా మారిపోయాడు. విశాల దృక్పథంతో మామిడి చెట్టులా విస్తరించాల్సిన మానవత్వం, స్వార్థంతో కొమ్మలు లేని తాడిచెట్టులా ఎదిగింది. ఇదే మనస్తత్వాన్ని వారసత్వం అందిపుచ్చుకొంటోంది. మనిషితనం నేతి బీరకాయలో నెయ్యి అవుతోంది.
ప్రపంచానికి చెట్టుకు మించిన గురువు లేడు. మౌనంగా ఎదగడమే కాదు, జీవిత పర్యంతం వివిధ సేవలందించి, అది మౌనంగానే తనువు చాలిస్తుంది. చెట్టు మరణించినా, బూడిదయ్యే వరకు మనిషికి ఉపయోగపడుతూనే ఉంటుంది.
చెట్టుకు ప్రాణమే కాదు- మనసు కూడా ఉంటుంది. మనసుతో వినగలిగితే వృక్ష విలాపాలు మనల్ని దుఃఖ వివశుల్ని చేస్తాయి. చెట్టు జీవితమే గొప్ప సందేశం. ఆదర్శానికి చెట్టు మారుపేరు. అది అర్థం చేసుకోగలిగితే, మనిషి చెట్టులా బతకడానికి ఇష్టపడతాడు.
ఒక మనిషి సమాజం కానట్టే, ఒక చెట్టు వనం కాలేదు. వనసీమలు శాంతి నిలయాలు. తపోభూములకు వనాలు ఆలవాలాలు. సృష్టిలోని అందాలకు అడవులు నెలవులు. అదొక ప్రత్యేక ప్రపంచం. చిత్ర విచిత్రాలైన జీవరాసులుంటాయి. ఎలాంటి అపకారం చెయ్యకుండా చూసి ఆనందించాలి తప్ప, వాటి ప్రశాంత జీవితానికి భంగం కలిగించకూడదు. ఒక చెట్టు నరికితే ఎన్నో పక్షులు అనాథలవుతాయి. ఒక అడవి నరికేస్తే ఎన్నో ప్రాణులు ఆధారం కోల్పోతాయి. కుటుంబ పెద్ద మరణిస్తే ఎలాగో, ఒక మహావృక్షాన్ని నేల కూల్చినా అంతే.
చెట్లు ప్రాణవాయువునిచ్చే దేవతలు. ఏ చెట్టూ తన ఫలాలను తాను తినదు. ఉపకార బుద్ధితోనే జీవిస్తుంది. అలాగే మరణిస్తుంది.
మనిషి చెట్టును చూసి బతుకును బాగుచేసుకోవాలి. పరోపకార బుద్ధిని అలవరచుకోవాలి. అప్పుడు ఆ మనిషి మరణించినా స్మృతి వనంలో గంధపు చెట్టుగా చిరకాలం ఉండిపోతాడు!
3 565
నీకంటూ ఒకరు!
ఈ ప్రపంచంలో నీ కష్టాన్ని గురించి శ్రద్ధగా, సానుభూతిగా వినే ఒక్కరైనా లేకపోవడం అన్నింటికన్నా పెద్ద దురదృష్టం. మన సంతోషాన్ని పంచుకునేవారుంటారు. కానీ మన కష్టాన్ని పంచుకోవడానికి, కన్నీళ్లను తుడిచిపోవడానికి ఎవరు ముందుకొస్తారు? మనం నవ్వుల్ని తోటివారితో ప్రకృతితో పంచుకుంటాం. కానీ మన కన్నీటిని ఎవరు పంచుకుంటారు? దాన్ని పంచుకోవాలంటే అవతలి మనిషికి మధుర హృదయం ఉండాలి. మానవీయ కోణం ఉండాలి. తన హృదయపు పొరల పూలరేకులతో అవతలివారి గాయపడిన గుండెను పదిలంగా పొదువుకుని, గాయాల మరకలను తుడిచి మాధుర్యపు మందులను వేసి, చిరునవ్వుల మృదుగాయంతో సేద తీర్చే ఔషధీయ హృదయం ఉండాలి. ఈ వైద్యానికి ఔషధం అవసరం లేదు. ధనం అగత్యం లేదు. మంచి మనసు ఉండాలి. అవతలివారి గాయాన్ని తనదిగా భావించే స్పందించే మనసు ఉండాలి.
అలాంటి ఒకరు మనకుంటే మన కన్నీరు పన్నీరు అవుతుంది. కష్టం కూడా ఇష్టం అవుతుంది. శ్రీకృష్ణుడి స్నేహితులకు కష్టం లేకపోలేదు. కన్నీరు రాకపోలేదు. నిజానికి అవన్నీ వాళ్లకు ఎక్కువ. కానీ అంత ప్రియమైన స్నేహితుడు ఉన్నాక, అంత మృదువుగా కన్నీరు తుడిచే సహచరుడు ఉన్నాక, అంతగా కష్టం పంచుకునే ఆత్మీయుడు మనకంటూ ఉన్నాక- కన్నీరు కాటు వేయగలదా, కష్టం వేటువేయగలదా, కారు మేఘం కూడా మధురమైన నాట్యం చేయదా? స్నేహాన్ని వెన్నలా పంచుకు తిన్న శ్రీకృష్ణుడు, అటుకుల్ని అమృతంలా ఆరగించిన శ్రీకృష్ణుడు స్నేహితులు, సన్నిహితులు, సహచరుల దుఃఖ బాష్పాల్ని ఆనంద బాష్పాలుగా మార్చకుండా వదులుతాడా, వదలగలడా? పెనుతుపానును గోవర్ధనగిరి కింద ఆటవిడుపు విహారంగా మలచకుండా ఉంటాడా? రహస్యం కళ్లలో, కన్నీళ్లలో లేదు. వాటిని తుడిచే ఆ అమృతహస్తంలో ఉంది. కష్టంలో, దాని పరిణామాల్లో లేదు. వాటిని కమనీయంగా మలచే ఆ హృదయపు సొంపులో ఉంది. శిల ఏదైనా శిలే. దాన్ని శిల్పంగా మలచే నేర్పు శిల్పిలో ఉండాలి. పాపాయిగానా, యువతిగానా, రాజుగానా, సర్పంగానా, సర్వేశ్వరుడిగానా... అదంతా శిల్పి నేర్పు, ఓర్పు. మన కన్నీళ్ల్లకు అర్థాన్ని మార్చే నేర్పు వాటిని తుడిచే వేళ్లకుండాలి. ఏది ఏమైనా కన్నీళ్లకు తుడిచే ఒక అమృతహస్తం కావాలి. నీకు నేనున్నానంటూ ఆ కన్నీళ్లకు అమృత బిందువులుగా మార్చే కమనీయ హృదయం కావాలి.
ఆ హస్తం మనదే అయితే... అలాంటి హృదయం మనకే ఉంటే... మనమే ఆ శ్రీకృష్ణుడైతే? మన ఇంటికప్పు గోవర్ధనగిరిగా మారదా? మారుతుంది! ఎవరికి ఏం సాయం చేయాలన్నా మనకు ధనం అవసరం లేదు. బలం అవసరం లేదు. మనం... ప్రేమించే హృదయం అయిపోవాలి. మన వేళ్లు కన్నీళ్లను తుడిచే తామర రేకులుగా మారాలి. మాటలు మకరందపు బిందువులుగా జాలువారాలి. లోకంలో ఏ ఒకరికైనా నీకు నేనున్నానంటూ నిలబడగలిగితే లోకమే తోడుగా మన పక్కన నిలబడదా? మన వెనక నడిచిరాదా? ఒక్కరు కోటిమందిగా మనకు గొడుగు పట్టరా?
ప్రేమంటే హృదయానికి ప్రణమిల్లని మనిషి ఉండడు. కన్నీరు తుడిచే చేతికి అంత విలువ ఉంది. అంత శక్తి ఉంది. మనమూ ఆ ‘ఒకరం’ అవుదాం. కన్నీరు తుడుద్దాం. కన్నీరు కార్చేవారు లక్షలమంది ఉంటారు. కానీ, ఆ కన్నీళ్లను తుడిచే చేతులు కోటిలో ఒకరికే ఉంటాయి. శ్రీకృష్ణుడు జీవితమంతా కష్టాలు ఎదురుదెబ్బలతో సహవాసం చేసినా ఏ ఒక్కరోజూ ఆ భావంతో బాధపడిన దాఖలాల్లేవు. ఎవరి సహాయాన్ని, సానుభూతిని కోరిన రుజువుల్లేవు. ఎందుకంటే- ఇతరుల కన్నీటిని తుడవడంలోని సాటిలేని ఆనందాన్ని తెలిసిన ‘శ్రీకృష్ణుడు’ ఆయన.
3 565
పౌర్ణమి తిధి నిర్ణయం-సంశయ నివృత్తి
*-పులివర్తి శ్రీనివాస 'సరస్వతి'*
🙏🏻ఈసారి కార్తీక పౌర్ణమి తిధి 29వ తేదీ మధ్యాహ్నం 12.09 నిమిషాల నుండి మరుసటి రోజు మధ్యాహ్నం 2.03 నిమిషాలు వరకు ఉన్నందున భక్తులు కొంత సందేహం వ్యక్తం చేస్తున్నారు... ఏ రోజున కార్తీక పౌర్ణమి జరుపుకోవాలనేది సందేహం....దీనిని మిగులు...తగులు... అని అంటారు
పెద్దగా కంగారు పడవలసిన పని లేదు...
సహజంగా చంద్రునికి సంబంధించిన పండుగలలో వేద నిర్ణయం ప్రకారం...
రాత్రులకు ప్రాధాన్యత ఉంటుంది...
అంటే దీపావళిని ఖచ్చితంగా ఆరోజు రాత్రి సమయంలో అమావాస్య తిధి కలిగి ఉన్న రోజున మాత్రమే జరుపుకొని తీరాలి...
అదేవిధంగా పౌర్ణమి కూడా...
రాత్రిపూట స్థిరంగా ఉండే తిధిని ప్రామాణికంగా తీసుకుని తీరవలసిందే....
ఇక్కడ ప్రత్యేకించి గమనించవలసిన విషయం ఏమిటంటే... ఇతర పండుగలు జరుపుకుంటున్నట్లు, సూర్యోదయంలో ఉన్న తిధికి ప్రాధాన్యత ఇవ్వాలనే అంశాన్ని మనం మరచిపోవాలి...
మరో ముఖ్య విషయం ఏమిటంటే...కృత్తిక నక్షత్రం పౌర్ణమి తిధిలో కలిగి ఉన్న మాసాన్ని కార్తీక మాసం అంటారనే విషయం మీకు తెలుసనుకుంటున్నాను...
ఈ నక్షత్ర గమనం ప్రకారం కూడా... ఆదివారం రాత్రి పౌర్ణమి తిధితో కృత్తిక నక్షత్రం కలిసి ఉంటుంది..
ఆ విధంగా పౌర్ణమి తిధితో... కృత్తిక నక్షత్రం, సోమవారం ఉదయం 6:06 వరకు మాత్రమే జత కూడి ఉంటుంది...
కాబట్టి కార్తీక పౌర్ణమి ఖచ్చితంగా 29వ తేదీన... ఆదివారం మాత్రమే జరుపుకుని తీరాలి...
మరుసటి రోజు అంటే సోమవారం రాత్రికి జరుపుకుంటే రెండవ చంద్రుడు అవుతాడు... కృష్ణపక్షం వచ్చేస్తుంది...
కొంతమేర, సౌలభ్యత కోసం చెప్పుకోవాలంటే....
ఉపవాస నియమం ఉన్న... ఉండాలనుకునే వారు మాత్రం 29వ తేదీ ఉపవాస నియమాలు పాటించి...రాత్రిపూట ఒత్తులు వెలిగించుకొని, చంద్రదర్శనం చేసుకుని భోజనం చేయవచ్చు...
ఉపవాస నియమం లేని వారు...
దీపాలు మాత్రమే వెలిగించాలనుకునేవారు 29వ తేదీ రాత్రి లేదా 30వ తేదీ ఉదయం ఆరు గంటల లోపు అంటే సూర్యోదయం కాకముందే ఒత్తులు వెలిగించు కోవచ్చు...
30వ తేదీ సోమవారం కూడాను....మరో లెక్క ప్రకారం కార్తీక మాసం 15వ రోజు కూడా అవుతుంది... కాబట్టి వత్తులు వెలిగించాలి అనుకునేవారికి మాత్రం 30వ తేదీ మధ్యాహ్నం లోపు నిరాహారంగా ఉండి...ఆ కార్యక్రమాన్ని పూర్తి చేయవచ్చును...
అదేవిధంగా నోములు, తోరాలు ఉన్నవారు కూడా 30వ తేదీ సోమవారం మధ్యాహ్నం లోపు ఆ కార్యక్రమాన్ని చేపట్టవచ్చు... పౌర్ణమి తిధి ఉంటుంది కాబట్టి...
29వ తేదీ ఆదివారం సాయంత్రం కూడా నోములు, వ్రతాలు చేసుకోవచ్చు ఆక్షేపణ లేదు...
పెద్దగా ఇందులో సందేహించాల్సిన పని లేదు...
మనం భగవంతునికి ఆత్మ నివేదన చేసుకోవాలి... తద్వారా చేసినటువంటి ఏ కార్యక్రమం అయినా భగవంతునికి ప్రీతిపాత్రమే...నిరంతర నామస్మరణతో సర్వేశ్వరుడు మన వెన్నంటే ఉంటారు...
సర్వే జనాః సుజనోభవంతు
సర్వే సుజనాః సుఖినోభవంతు
ధన్యవాదములు🙏🏻
3 565
శ్రీకుమార
మంగళస్తోత్రం
1.యజ్ఞోపవీతీకృతభోగిరాజో గణాధిరాజో గజరాజవక్రః
సురాధిరాజార్చితపాదపద్మః సదా కుమారాయ శుభం కరోతు
2.విధాతృపద్మాక్షమహెూక్షవాహాః సరస్వతీశ్రీగిరిజాసమేతాః
ఆయుః శ్రీయం భూమిమనంతరూపం భద్రం కుమారాయ శుభం దిశంతు
3.మాసాశ్చ పక్షాశ్చ దినాని తారాః రాశిశ్చ యోగాః కరణాని సమ్యక్
గ్రహాశ్చ సర్వేదితిజాస్సమస్తాః శ్రియం కుమారాయ శుభం దిశంతు
4.ఋతుర్వసంతః సురభిః సుధా చ వాయుస్తథా దక్షిణనామధేయః
పుష్పాణి శశ్వత్సురభీణి కామః శ్రియం కుమారాయ శుభం కరోతు
5.భానుస్త్రీలోకీతిలకోమలాత్మా కస్తూరికాలంకృతవామభాగః
పంపాసరశ్చైవ స సాగరశ్చ శ్రియం కుమారాయ శుభం కరోతు
6.భాస్వత్సుధారోచికిరీటభూషా కీర్తాయా సమం శుభ్రసుగాత్రశోభా
సరస్వతీ సర్వజనాభివంద్యా శ్రియం కుమారాయ శుభం కరోతు
7.ఆనందయన్నిందుకలావతంసో ముఖోత్పలం పర్వతరాజపుత్ర్యాః
స్పృసన్ సలీలం కుచకుంభయుగ్మం శ్రియం కుమారాయ శుభం కరోతు
8.వృషస్థితః శూలధరః పినాకీ గిరీంద్రజాలంకృతవామభాగః
సమస్తకల్యాణకరః శ్రితానాం శ్రియం కుమారాయ శుభం కరోతు
9.లోకానశేషానవగాహమానా ప్రాజ్యైః పయోభిః పరివర్ధమానా
భాగీరథీ భాసురవీచిమాలా శ్రియం కుమారాయ శుభం కరోతు
10.శ్రద్ధాం చ మేధాం చ యశశ్చ విద్యాం ప్రజ్ఞాం చ బుద్ధిం బలసంపదౌ చ
ఆయుష్యమారోగ్యమతీవ తేజః సదా కుమారాయ శుభం కరోతు
ఇతి శ్రీకుమారమంగలస్తోత్రం సంపూర్ణం
#Sree #KumaraMangala #Stotram
3 565
శ్రీ లలితా సహస్ర నామం
శ్రీచక్రంలో శివశక్తి ఉంటుందని విశ్వాసం. ఇదే శ్రీమహాత్రిపురసుందరీ యంత్రం! ఈ శుద్ధ చక్రం మన కోరికలన్నీ తీరుస్తుందని భావిస్తారు. దీన్నే శ్రీయంత్రం పేరుతో దేవాలయాల్లో స్థాపిస్తారు. మంచి శిలపై చెక్కిగాని, రాగిరేకులపై గట్టిగీతలు గీసిగాని శ్రీయంత్రాన్ని సిద్ధంచేసి, పండితులు వేద మంత్రాలు పఠిస్తూ ఉండగా దేవుడి విగ్రహం కిందభాగంలో స్థాపిస్తారు.
మనం అనునిత్యం చూసే యంత్రాలకు, ఆధ్యాత్మిక రంగంలో ఉపయోగించే యంత్రాలకు సంబంధం లేదు. మంత్రం, తంత్రం, యంత్రం అనే మూడు పదాలు ఆధునిక కాలంలో వేరే అర్థాలు సంతరించుకున్నాయి. ఆధ్యాత్మిక ఉన్నతికి ఉపయోగపడేది మంత్రం. మంత్రాలు వేదకాలం నుంచి ఉన్నాయి. రక్షింపజేసేది, తరింపజేసేదని మంత్రం అనే పదానికి అర్థం. ప్రతి మంత్రంలో కొన్ని బీజాక్షరాలుంటాయి. దేవతలను ప్రసన్నం చేసుకోవడానికి ఉపయోగించే కర్మకాండను తంత్రం అంటారు. బీజాక్షరాలతో కూడిన చక్రం యంత్రం. ఇందులో సరళరేఖలు, త్రిభుజాలు, వృత్తాలు, కోణాలు ఉంటాయి. ఇదొక క్లిష్టమైన రేఖాగణితం. ఇందులో దేవతలకు సంబంధించిన బీజాక్షరాలు ఉంటాయి.
త్రిపురసుందరీ పూజాంగ యంత్రమైన శ్రీచక్రానికి ప్రతి ఉదయం సాయంకాలాల్లో షోడశో పచారాలతో పూజలు జరుగుతూ ఉంటాయి. ఇందులో బిందు, త్రికోణాలు, బహుభుజాలు, వృత్తాలు, రేఖల గురించి పరిశోధనలు సాగుతున్నాయి. దీన్ని మానవ శరీరంలోని కుండలినీ వ్యవస్థతో పోలుస్తారు. శ్రీచక్రానికి శుక్రవారం లలితా సహస్ర నామాలతో పూజ చేస్తే సర్వ అభీష్టాలు తీరుతాయని పెద్దలు చెబుతారు.
లలితా సహస్రనామాలకు మూల దేవత లలిత. శ్రీవిద్యో పాసకులకు కల్పతరువైన ఈ నామావళిని హయగ్రీవుడు అగస్త్యుడికి ప్రసాదించాడు. ఈ నామావళిలో అద్వైత జ్ఞానం ఇమిడి ఉంది. ఛాందోగ్యోనిషత్తులో ఉన్న ‘తత్త్వమసి’ అనే మహావాక్యానికి ప్రతి బింబాలలాగా ఈ నామాలు భాసిస్తున్నాయి.
లలితా సహస్ర నామావళిలో ముఖ్యంగా నాలుగు అంశాల ప్రస్తావనలుంటాయి. అవి- లలితాదేవి బాహ్యస్వరూప వర్ణన, భండాసుర వధ, మంత్రశాస్త్ర సాధన, దేవీ సాక్షాత్కారం. ప్రాపంచిక సుఖాల్లో తేలియాడే నరులు మోక్షం పొందలేరు. అమ్మను ఆశ్రయిస్తే ముక్తి సులభం అవుతుంది. అటువంటివారు అమ్మవారి బాహ్య రూపవర్ణన ద్వారా ఆమె స్వరూపాన్ని గ్రహించగలుగుతారు. ఈ దేవి వాంఛితార్థ ప్రదాయిని కాబట్టి ఇది సుసాధ్యం. మన్మథుడి చితాభస్మం నుంచి ఉద్భవించిన వాడు భండాసురుడు. వినాయకుడు ఆ బూడిదను ముద్దగా చేశాడు. అందులోనుంచి పుట్టిన వాణ్ని చూసి బ్రహ్మ ‘భండ భండ’ (బాగు, బాగు) అన్నాడు. శివుడి నేత్రాగ్ని వల్ల పుట్టిన బూడిదనుంచి పుట్టినవాడు కాబట్టి అతడు తమోగుణుడయ్యాడు. మునుల్ని, మహర్షులను, దేవతలను బాధించాడు. అతడి పరివారం మిక్కిలి బలంగలది. దుర్గా, చండి, కాళిక మొదలైన దేవి అంశలు భండాసురుడి సైన్యాన్ని నిర్మూలిస్తారు. చివరకు అమ్మవారి చేతిలో భండాసురుడు అంతమయ్యాడు. మనలో ఉండే తమోగుణ వినాశనమే భండాసురవధ వృత్తాంత విశేషం. దీన్ని పఠించడంద్వారా మనలోని తమో, రజో గుణాలు నశించి సాత్విక ప్రవృత్తి అలవడుతుందంటారు. వేదాంత సౌధానికి నాలుగు మార్గాలున్నాయి. కర్మ, యోగ, భక్తి, జ్ఞానమార్గాల్లో దేన్ని అనుసరించినా శ్రీ లలితాదేవి కృపకు పాత్రులం కావచ్చు!
3 565
భగినీ హస్త భోజనం
సనాతన ధర్మంలోని పండుగలు, పర్వదినాలు సమైక్యతత్వాన్ని, సమష్టి భావాన్ని ఆకాంక్షిస్తాయి. కుటుంబంలోని జీవన మాధుర్యానికి, సంప్రదాయ సౌరభానికి ప్రతీక- యమద్వితీయ. సహోదరుల మధ్య సదవగాహన, సౌమనస్య పూరిత ఆపేక్షల వృద్ధికి యమద్వితీయనాడు నిర్వహించే భగినీ హస్తభోజనం ఉపకరిస్తుంది. కార్తికంలో రెండో రోజైన శుద్ధ విదియను యమద్వితీయగా, సహోదర ద్వితీయగా వ్యవహరిస్తారు. సోదరసోదరీమణుల మధ్య ఉండే అపురూపమైన అనురాగ సరాగాల్ని ప్రకటించే వేడుక- భగినీ హస్తభోజనం.
‘భగిని’ అంటే సోదరి, భాగ్యవంతురాలని అర్థం. ‘భగిని’ చేతివంటను సోదరులు ప్రియమారా ఆరగించే పావన తరుణమే భగినీ హస్తభోజన పర్వదినం. కార్తిక శుద్ధ విదియనాడు సోదరీమణుల సమాదరణం చేయాలని లింగపురాణం ప్రస్తావించింది. అవ్యాజమైన అభిమానంతో సోదరుల్ని ఇంటికి పిలిచి తోబుట్టువులు వారికి సంతృప్తిగా భోజనాన్ని కొసరి కొసరి వడ్డించాలని, సోదరులు తమ అక్కాచెల్లెళ్లను ఘనంగా సత్కరించాలని భవిష్యపురాణం పేర్కొంది. నరకాసుర వధ అనంతరం, శ్రీకృష్ణుడు తన సోదరి సుభద్ర ఇంటికి వెళ్లాడంటారు. ఆయనకు సుభద్ర విజయ తిలకాన్ని దిద్ది, మంగళహారతి నిచ్చి, మధుర పదార్థాల్ని తినిపించి, రక్ష కట్టిందంటారు. ఆ మహత్తర సందర్భమే భ్రాతృ ద్వితీయగా స్థిరపడిందంటారు.
యమద్వితీయగా ఈ పర్వదినం ప్రశస్తి పొందడానికి ఎంతో నేపథ్యం ఉంది. యమి(యమున) తన అన్న యమధర్మరాజును ఇంటికి ఆతిథ్యానికి రమ్మని ఎన్నోసార్లు ఆహ్వానించింది. అయితే ఆయనకు వీలు చిక్కలేదు. తన అన్న రాకకై యమున ఎదురుచూడసాగింది. అల్పాయుష్కుడైన మార్కండేయుడి ప్రాణాల్ని తన పాశంతో హరించడానికి యముడు వెళ్లాడు. పరమేశ్వరుణ్ని మార్కండేయుడు శరణు వేడాడు. భక్తవశంకరుడైన మహేశుడు త్రిశూలధారియై యముణ్ని వెంటాడాడు. శివాగ్రహానికి భీతిల్లిన యముడు తన సోదరి యమున ఇంటికి పరుగున వచ్చాడు. తన పిలుపు మన్నించి, ఇన్నాళ్లకు తన అన్న వచ్చాడని యమున సంబరపడింది. ఎన్నో మర్యాదలు చేసి, షడ్రసోపేతమైన వంటకాల్ని సిద్ధంచేసి, అన్నగారికి వడ్డించింది. అదే సమయంలో యముణ్ని అన్వేషిస్తూ శివుడు అక్కడికి వచ్చాడు. వంటకాల్ని వడ్డిస్తున్న యమునను, భోజనాన్ని ఆరగిస్తున్న యముణ్ని చూశాడు. వారి అనురాగ బంధాన్ని వీక్షించి ముగ్ధుడై, యముడికి అభయమిచ్చి నీలకంఠుడు నిష్క్రమించాడన్నది పురాణగాథ.
తన సోదరి ఇంట ఆతిథ్యాన్ని అందుకోవడం వల్ల, యముడికి ఈశ్వరుడి ఆగ్రహం బదులు, అనుగ్రహం లభించింది. మహాదేవుడి నుంచి తనను రక్షించినందుకు, మరపురాని వరం కోరుకొమ్మన్నాడు. కార్తిక శుద్ధ విదియనాడు తమ సోదరీమణుల గృహాలకు వెళ్లి, వారి చేత భోజనం స్వీకరించే సోదరులకు సర్వదా అనేక శుభాలు చేకూరాలని, అపమృత్యు దోషాలు తొలగాలని యమున వరం అడిగింది. యముడు తథాస్తు అన్నాడు ఆనందంగా! ‘సమవర్తి అయిన యముడి దశనామాల్ని యమద్వితీయనాడు స్మరిస్తూ, అర్ఘ్య ప్రదానం చేయాలి. దక్షిణ దిశాధిపతియైన యముడి ప్రీతి కోసం, దక్షిణ దిక్కున అరటి ఆకులో ఉప్పును కుప్పగా పోసి దానిపై ఆముదంతో యమదీపాన్ని వెలిగించాలి. పితృదేవతలకు సద్గతులు దక్కాలని ఆకాంక్షించాలి’- ఈ విధివిధానాల్ని భవిష్కపురాణం వివరించింది.
‘తల్లిదండ్రుల తరవాత ఆత్మీయులైనవారు తోబుట్టువులే! వారి మధ్య బంధాలు, ఆప్యాయతలు నిరంతరం గాఢంగా వర్ధిల్లాలి. జీవితాంతం ఒకరికొకరం తోడునీడగా, అండదండలతో సహోదరులు పురోగమించాలి’. ఈ శుభాకాంక్షల పరంపరకు సాకార దర్శనం- భగినీ హస్తభోజన పర్వదినం!
3 565
తమసోమా జ్యోతిర్గమయ
చతుర్దశి అమావాస్యకు దారితీసినట్లుగానే నరకాసుర సంహారం దీపావళి పర్వదినానికి తోవ చూపిందని పెద్దలమాట. పూర్వం నరకుడు అనే రాక్షసుడు లోక కంటకుడై చెలరేగినప్పుడు, వాడి బాధలను తట్టుకోలేక ఇంద్రాది దేవతలందరూ మహావిష్ణువుకు మొరపెట్టుకున్నారని, అప్పుడు మహావిష్ణువు కృష్ణుడిగా సత్యభామాసమేతుడై వాణ్ని సంహరించి, లోకానికి పట్టిన పీడను వదిలించాడని పురాణగాథ. నరకాసురుణ్ని చంపిన రోజు ఆశ్వీయుజ బహుళ చతుర్దశి కావడం వల్ల ఈ దినాన్ని ‘నరక చతుర్దశి’ అని పిలవడం సంప్రదాయంగా మారింది. దుష్టరాక్షసుడి వధానంతరం మరుసటి రోజైన అమావాస్యనాడు ఆనందోత్సాహాలతో దీపాలు వెలిగించి, పండుగ జరుపుకోవడం పరిపాటిగా మారింది.
నరక చతుర్దశికి, నరకాసురుడికి సంబంధం లేదనే వాదనలు కూడా ఉన్నాయి. అవి ఎలా ఉన్నా, మరొక ధార్మిక విషయం నరక చతుర్దశితో ముడివడి ఉందనేది యథార్థం. మానవులు మరణానంతరం నరకానికి, ఆ తరవాత స్వర్గానికి వెళ్తారని ప్రగాఢ విశ్వాసం. నరకలోకం అంధకారమయంగా ఉండటం వల్ల అక్కడికి వెళ్ళినవారు చీకటిలోనే మగ్గుతుంటారని, దారి చూపడంకోసం భూలోకంలోని వారసులు దీపాలు వెలిగించాలని శాస్త్రం చెబుతోంది. పితృదేవతలకు నరకంలో చీకట్లు తొలగాలంటే, వారి కోసం భూమిపై దీపాలు వెలగాలన్న భావనతో దీపావళినాడు దీపాలను వెలిగిస్తారు. అంతేకాదు- దీపదానాలూ చేస్తారు. యముడి ప్రీతికోసం తర్పణాలు విడుస్తారు. ఇవన్నీ పితృదేవతలకు నరకలోక బాధలు లేకుండా చేయడానికే అనేది ఈ పండుగలోని పరమార్థం. ఆశ్వీయుజ బహుళ చతుర్దశినాడు ఎవరు దీపాలు వెలిగిస్తారో వారి పితరులు (మరణించిన తండ్రులు, తాతలు) నరక లోకాన్ని వీడి స్వర్గలోకం వైపు ప్రయాణిస్తారని ధర్మశాస్త్రం చెబుతోంది.
నరక చతుర్దశినాడు అభ్యంగనస్నానం విశేషమైన అంశం. తిలలు అంటే నువ్వులు. వాటి నుంచి తీసిన ద్రవమే తైలం. ఒంటికి తైలాన్ని మర్దన చేసుకొని తలస్నానం చేయాలని శాస్త్రం చెబుతోంది. ఇలా చేయడంవల్ల శరీరం ఆరోగ్యవంతం కావడమేగాక, మానసికంగానూ ప్రశాంతత లభిస్తుందని పెద్దలమాట. రాబోయేది హేమంత రుతువు. అంటే చలికాలం. చలికాలం రాగానే శరీరం అంతా పగులువారుతుంది. తైలమర్దనవల్ల శరీరం నిగనిగలాడుతూ తళుకులీనుతుంది.
అమావాస్య లక్ష్మీదేవి జన్మదినమని విశ్వాసం. లక్ష్మీదేవి తాండవించే ఈ శుభదినాన దీపాలు వెలిగించి, సిరిసంపదలు కోరుతూ లక్ష్మీపూజలు చేయడం మానవాళికి అలవాటు. బంగారం, వెండి, రత్నాలు, వజ్రాలు, ముత్యాలు... ఇలా అమూల్యమైన సంపదలన్నీ లక్ష్మీస్వరూపాలే. దీపావళినాటి రాత్రి అమూల్య సంపదలను పూజించి, దినదినాభివృద్ధిని కోరడం కనిపిస్తుంది. వర్తకవాణిజ్య రంగాల వారికి దీపావళి అత్యంత పూజ్యదినం.
మనిషి తన జీవితంలో అనుక్షణం వెలుగుకోసం తపిస్తాడు. ‘తమసోమా జ్యోతిర్గమయ’ అనే వేదసూక్తి మానవుడి మనోభావానికి అద్దం పడుతుంది. వెలుగులకోసం తపించే మనిషికి వెలుగులు కురిపించే దీపావళి పండుగ అంటే ఎంతో ఇష్టం.
నరకం నుంచి విముక్తి కావడం, తేజోమయ స్వర్గలోకానికి చేరుకోవడం అనే ప్రధాన లక్ష్యాలు- ఈ పండుగను విశ్వమనోహరంగా చేస్తున్నాయి. సూర్యచంద్ర నక్షత్ర కాంతులతో ఆకాశం ఎలా వెలిగిపోతుందో, అలాగే జీవితమంతా పర్వదినాల వెలుగులతో సుఖశాంతులను కురిపించాలని కోరడమే మానవాళి కర్తవ్యం.
3 565
చల్లని మాట... చక్కని బాట!
‘కొందరు ఇంటికి వస్తే సంతోషంగా ఉంటుంది. కొందరు వెళ్లిపోతే చాలా సంతోషంగా ఉంటుంది’ అని కొంతమంది గృహస్థులు తమ ఇళ్లలో ఓ సందేశాన్ని ఫ్రేమ్ కట్టి ఉంచుతారు. చూడ్డానికి తమాషాగా అనిపించినా, అది లోతుగా ఆలోచించాల్సిన విషయమే. ఎందుకంటే కొందరు వ్యక్తులు ఎవరింటికైనా పలకరింపులకు వెళ్లినప్పుడు, అవతలివారి మానసిక స్థితిని గమనించరు. అడగకపోయినా తమ కష్టాలు, బాధలు ఏకరువు పెడుతుంటారు. సమాజం భ్రష్టుపట్టి పోయిందని అందరినీ తిడుతూ, తమలోని నిరాశా నిస్పృహలను వాళ్లముందు వెళ్లగక్కుతుంటారు. అలాంటప్పుడే వచ్చినవ్యక్తి ఎప్పుడు వెళ్లిపోతాడా అని ఇంట్లోవాళ్లు ఎదురుచూస్తుంటారు. ఈ ధోరణికి విరుద్ధంగా ఉండే వ్యక్తులూ ఉంటారు. వారు ఏ ఇంటికైనా సంతోషాన్ని వెంటబెట్టుకుని వెళ్తారు.
సమాజంలో అనేక సమస్యలు, వివాదాలు ఏర్పడటానికి ముఖ్యకారణం- మనుషుల మధ్య మాటతీరు సరిగ్గా లేకపోవడం, అవగాహనా లోపమని మనకు అర్థమవుతుంది. మాట తీరు ఎలా ఉంటే శ్రేయస్కరమనే అంశాన్ని, ‘మనుస్మృతి’ ఏనాడో సూచించింది. మనుషులు మాట్లాడే ధోరణులను ‘మనుస్మృతి’ నాలుగు విధాలుగా విభజించింది. మొదటిది- పారుష్యం; అంటే కఠినంగా మాట్లాడటం. మన మాటతీరు కటువుగా ఉంటే- మిత్రులు శత్రువులవుతారని హెచ్చరించింది. రెండోది- అనృతం. అంటే అసత్యాలు పలకడం. ఈ ధోరణి ఉన్నవారు డంబాలు పలుకుతారు. దాంతో అవతలి వ్యక్తులకు వీళ్లమీద విశ్వాసం ఏర్పడదు. ఎవరూ మనస్ఫూర్తిగా మాట్లాడరు. మూడోది- పైశూన్యం. అంటే, ఇతరుల మీద చాడీలు చెప్పడం. దీనివల్ల మనుషుల్లో ద్వేషాలు, కలహాలు పెచ్చరిల్లుతాయి. సన్నిహితులు విరోధులవుతారు. నాలుగోది- అసంబద్ధ ప్రలాపం. ఈ లక్షణం ఉన్నవారు అనవసర విషయాలు, విసుగు కలిగించే అంశాలు ఎక్కువగా మాట్లాడుతూ, వినేవారికి చికాకు కలిగిస్తుంటారు.
‘ప్రియంగా మాట్లాడేవాడికి శత్రువు ఉండడు’ అన్నాడు చాణక్యుడు. ‘మంచిగా మాట్లాడేవాడికి ఏం లభిస్తుంది’ అని యక్షుడు ధర్మరాజును అడిగినప్పుడు, ఆయన ‘మైత్రి’ అని సమాధానమిచ్చినట్లుగా మహాభారతం చెబుతోంది.
మంచిగా మాట్లాడేవారు అవతలి వ్యక్తులను ఎంతగా ఆకర్షిస్తారనడానికి రామాయణం కిష్కింధకాండలో హనుమంతుడి భాషణ గొప్ప ఉదాహరణ.
చాలామంది ఆలోచించకుండా మాట్లాడతారు. ఆ మాటల వల్ల అనర్థం జరిగాక అప్పుడు తీరిగ్గా ఆలోచిస్తారు. కానీ ఏం లాభం? ఇతరులు ఆవేశపడి, పరుషంగా మాట్లాడినా, మనం తొందరపడి ఆవేశంగా మాట్లాడకూడదు. ఓర్పుతో ఉండటం నేర్చుకోవాలి. పరుష భాషణం వల్ల వైరం ఇంకా పెరుగుతుంది. హితంగా, మితంగా, ప్రియంగా మాట్లాడటం అందరికీ ఆనందదాయకంగా ఉంటుందని మన శాస్త్రాలు ఉద్బోధిస్తున్నాయి.
‘మనసులో కుటిలత్వం లేకుండా, మధురభావంతో ఉండాలి. మన మాటలు మృదుమధురంగా ఉండాలి. చేసే ప్రతి పనిలో ఆలోచనలో మంచితనమే అంతర్లీనమై ఉండాలి’ అని అధర్వణ వేదం చెబుతోంది. అందువల్ల ఎప్పుడూ చల్లగా, ప్రియంగా మాట్లాడే ధోరణిని అలవరచుకుంటే, మనం ఎవరితో మాట్లాడినా, వాళ్ల హృదయంలో ఓ ప్రత్యేకస్థానాన్ని సంపాదించుకోగలుగుతాం.
సమాజం సజావుగా సాగాలంటే అందుకు ప్రియ భాషణమే చక్కని మార్గమని అందరూ గ్రహించాలి.
3 565
లోచూపు
జీవితం దృష్టి ప్రధానమైనది. ప్రతి ప్రాణికి చూపు చాలా అవసరమైనదేగాక విలువైనది కూడా! చూపునిచ్చే అవయవం కన్ను. దృష్టి ప్రాముఖ్యాన్ని గుర్తించిన మన పూర్వులు ‘సర్వేంద్రియాణాం నయనం ప్రధానం’ అన్నారు. భౌతికమైన ఈ జగత్తును, అందులోని మార్పులను గమనిస్తూ జీవన గమనం సాగించడం ఒకెత్తు. ఆంతరంగికమైన చూపును కలిగి ఉండటం మరొకెత్తు. అదే ‘లోచూపు’.
ఎవరికి వారు తమంతట తామే ఉన్నత మార్గంలో ప్రయాణించేటట్లు చేసేది ఈ లోచూపు. బాహ్య నేత్రాలు సాధారణ దృష్టినిస్తే, జ్ఞాననేత్రాలు ఆంతరంగిక దృష్టిని అందిస్తాయి. మామూలు చూపు కొన్నిసార్లు ఇంద్రియ లౌల్యానికి దారితీస్తుంది. అధోగతికీ లాక్కెళుతుంది. ‘కన్నుల చూచినందెల్లా కడు ఆసల దగిలి’ అని ఓ సంకీర్తనలో అన్నమయ్య చెప్పినట్లుగా, చూసిన ప్రతి విషయంపై ఆసక్తిని పెంచుకుంటే అది దుఃఖాలపాలు చేస్తుంది. ఆముప్పు దాపురించకూడదంటే జ్ఞాననేత్రాలు విప్పారాలి. ఆ కాంతిలో వ్యక్తిత్వం వికసించాలి. మొక్క సూర్యకాంతిని అందుకొని ఎదిగి మహావృక్షమై ప్రాణవాయువును, పుష్పఫలాలను, కలపను అందించి సమాజానికి ఉపయోగపడుతున్న స్పూర్తిని అందుకొని మనమూ వికసించిన వ్యక్తిత్వంతో సమాజసంక్షేమానికి కృషి చేయాలి.
అన్నమయ్య తన సంకీర్తన భాగవతంలో ‘ఎన్ని మార్లు సేవించిననూ కన్నులూ తనియవు’ అంటూ- భగవత్ సౌందర్యాన్ని వీక్షించడం నేత్రాలు చేసుకున్న గొప్ప యోగంగా అభివర్ణిస్తారు! ‘తెర తీయగరాదా నాలోని మచ్చరమను తెరతీయగారాదా తిరుపతి వేంకట రమణా’ అంటూ- నిన్ను దర్శించాలంటే పదివేల కన్నులు కావలెనయ్యా అంటారు త్యాగరాజస్వామి!
బాహ్యంగా చూసినదాన్ని విమర్శించడం మానవ సహజ లక్షణం. దీన్ని అధిగమించి లోచూపుతో నిన్ను నీవు విమర్శించుకో! నిన్ను నీవు సరిదిద్దుకో’ అంటారు విజ్ఞులు. ‘చదివితి తొల్లి, చదివేనింకా కొంత... ఎదిరి నన్నెరగను’ అంటారు అన్నమాచార్యులవారు ఓ సంకీర్తనంలో. ఎంతో కొంత చదివాను, ఇక ముందూ చదువుతాను. కాని నన్ను నేను తెలుసుకోలేకపోతున్నాను. ‘ఒరుల దూషింతు కాని, ఒక మారైన నా దురితకర్మములను దూషించను’ అంటూ బాహ్యదృష్టితో చూసి అందర్నీ తప్పుపడుతున్నాను కాని, అంతరదృష్టి కలిగి నన్ను నేను తెలుసుకోలేకపోతున్నాను అంటూ లోతైన జ్ఞానాన్ని బోధించారు. ఆత్మజ్ఞానం అందుకోవడానికి అవసరమైన విజ్ఞానాన్ని అందించారు.
లోచూపు సాధనకు ధ్యానం ఎంతో ఉపయుక్తమైనది. ఏకాగ్రమైన భావనతో మనసును కేంద్రీకరించినపుడు జ్ఞాననేత్రాలు విప్పారుతాయి. ధ్యానప్రక్రియ ఉత్తమ ఉపాసనామార్గం. అభ్యాసపూర్వకమైన ధ్యానం తమను తాము తెలుసుకోవడానికి ఉపయోగపడుతుంది. జ్ఞానాజ్ఞాన విచక్షణ ఏర్పడి వివేకదర్శనం కలుగుతుంది. తెలుసుకున్న జ్ఞానాన్ని నిత్యజీవనంలో ఆచరించేటట్లు చేస్తుంది. బుద్ధి ప్రచోదనం జరిగి మనసు నియంత్రితమై జీవితం సార్థకమయ్యేలా ఆశలు, ఆశయాలతో జీవనం సాగిపోతుంది. మంచి పనులు చేసే జ్ఞానాన్ని లోచూపు అందిస్తుంది. మనలోపల చుక్కానిలా ఉండి మనల్ని చక్కని మార్గంలో నడిపించే గురువే లోచూపు!
3 565
నమస్కారం🙏🏽
సంధ్యావందనం చేయాలని, తపన ఉండి, కానీ చేసే పద్ధతి తెలియాని వారికి ఒక శుభవార్త. ఆన్లైన్ లో ఉచితం గా సంధ్యావందనం నేర్పించబడును. ఆసక్తి ఉన్నవారు కాంటాక్ట్ చేయవలసిన నెంబర్
అభ్రపూడి మాణిక్యశర్మ
7416818034
3 565
భయాన్ని భయపెట్టాలి
జీవితంలో భయం కన్నా భయంకరమైందేదీ లేదు. అదో తీవ్రమైన భావోద్వేగం. అది కోపానికన్నా ప్రమాదకరమైంది. ఊహ కలిగాక, ఓవైపు జ్ఞానం పెరుగుతుంటే, మరోవైపు భయమూ మనసులో చోటు సంపాదించుకునే ప్రయత్నం చేస్తుంటుంది. ఆత్మవిశ్వాసం కలవాడు, దృఢ సంకల్పం కలిగినవాడు, సంయమనశీలి, దేశకాల పరిస్థితులపట్ల అవగాహన ఉన్నవాడు మనసులో భయానికి తావే ఇవ్వడు.
భయం దిగులును, బాధను, దుఃఖాన్ని, పిరికితనాన్ని కర్తవ్యవిమూఢతను పెంచుతుంది. అభద్రతాభావాన్ని ప్రేరేపిస్తుంది. అన్నింటినీ మించిన భయం- మరణభయం. ఎంత వయసు మీరినా తానింకా బతకాలనే అనుకుంటాడు మనిషి. అయితే భయం క్షణం క్షణం మరణాన్ని చవిచూపిస్తుంది. సుఖాన్ని, శాంతిని, తృప్తిని, ఆనందాన్ని దూరం చేస్తుంది. ఉన్నది పోతుందేమో అని ఒకడికి భయమైతే, రావలసింది రాదేమోనన్న భయం మరొకడికి. ఇంటిగుట్టు రట్టయి పరువు పోతుందేమోనన్న భయం ఇంకొకడికి. తన సంపదను దోచుకుపోతారేమోనన్న భయం వేరొకడికి. భయాలు ఎన్నయినా వాటిని దూరం చేయగలిగేది వైరాగ్యం ఒక్కటేనని భర్తృహరి ఏనాడో చెప్పాడు.
వేగంగా పరవళ్లు తొక్కుతూ ప్రవహించే నదికి ఓ పర్వతమో, చెట్టో అడ్డం వస్తే ప్రవాహం అక్కడే ఆగుతుందా? పక్కదార్లు చూసుకొని పల్లంవైపు ప్రవహిస్తూ ముందుకెళ్లిపోతూనే ఉంటుంది. మనిషికీ అలాగే ఎన్నో సమస్యలు, కష్టాలు, ఆటంకాలు ఎదురవుతూనే ఉంటాయి. అంతమాత్రాన మనిషి బెంబేలెత్తి పోకూడదు. భయపడి కుంగిపోకూడదు. భయమనే వరదకు అడ్డుకట్ట వేయడానికి ధైర్యమనే ఆనకట్టను నిర్మించుకోవాలి అంటారు స్వామి వివేకానంద. భయంతో ఏ పనినీ సాధించలేం. స్థితప్రజ్ఞ, నిగ్రహం, ఓర్పుతోనే ఎంతటి సమస్యనైనా అధిగమించగలం. పరిస్థితులు ఎంతటి విపత్కరమైనా, అప్రమత్తులమై అవగాహనతో మనం మనలా మనోధైర్యంతో ముందుకు సాగడమే పరమ కర్తవ్యం.
ఆత్మవిశ్వాసానికి ఆధ్యాత్మిక చింతన తోడైతే మనిషికి సర్వత్రా విజయం తథ్యం. భయం అనే వ్యాధికి దివ్యౌషధం భక్తి మాత్రమే. భయం కలిగించేది, తొలగించేది శ్రీమన్నారాయణమూర్తే అని విష్ణు సహస్రనామం చెబుతోంది. భక్తికి వశమయ్యేది, భయాన్ని పారదోలేది పరమేశ్వరి అని లలితా సహస్రనామం చెబుతోంది. ప్రహ్లాదుడు, రామదాసు, మీరాబాయి ఎన్ని శిక్షలు అనుభవించారు! నిర్భీతితో పరమాత్మ నామస్మరణతో అవలీలగా ఆ అవరోధాలన్నీ అధిగమించి సద్గుతులు పొందారు.
భక్తిలో ఆర్తి ఉంటుంది. వేదన ఉంటుంది. వినమ్రత ఉంటుంది. శరణాగతి ఉంటుంది. ఆత్మసమర్పణ భావం ఉంటుంది. మనిషికి జీవితంలో భక్తి ఒక్కటే తరణోపాయం. అందుకు నామస్మరణే ప్రథమ సాధనం. నామస్మరణ భయాలన్నింటినీ ఇట్టే తెంచివేయగల అమోఘ సాధనం.
మనిషి అధర్మానికి, అత్యాచారానికి, హింసకు, దౌర్జన్యానికి- ఇలాంటి అకృత్యాలు చేయడానికి మాత్రం భయపడవలసిందే. విముఖత చూపవలసిందే! దోషికి, నేరస్తుడికి, దుష్టుడికి భయం ఉంటుంది. క్రమశిక్షణ, సదాచరణ, సత్సాంగత్యం ఉన్నవాడికి భయమే కలగదు. కష్టమైనా ధర్మవర్తననే నమ్ముకోవాలి. దాని వెనక ఎన్నో అద్భుతమైన అవకాశాలు దాగి ఉంటాయి. నీడను చూసి భయపడేవాడు తరవాత వెలుగు మనదరికి చేరుతుందని గ్రహించి, సంయమనం పాటించాలి. దైర్యవంతుడు అంటే భయం తెలియనివాడు కాదు, దాన్ని జయించినవాడు. భయం అనే శత్రువు మనలో లేనంతవరకు బయటి శత్రువేదీ మనల్ని భయపెట్టలేదు.
భయం తలుపుతట్టింది. భక్తి తలుపు తెరిచి చూస్తే బయట ఎవరూ లేరు!
3 565
త్రికరణశుద్ధి
చెట్టు మీద పిట్ట వాలుతుంది. ఓ కొమ్మపై గూడు అల్లుతుంది. అందులో గుడ్లు పెడుతుంది. అవీ పక్షులై పెరుగుతాయి. ఆహారం కోసం దూర తీరాలకు ఎగిరిపోతాయి. వెళ్లిన చోటే రాత్రి పూట గడపవచ్చు. కానీ, పక్షులు అలా చెయ్యవు. అవి తిరిగి సాయంకాలం గూళ్లకు చేరుతాయి. మనిషి జీవన స్థితీ అంతే. చైతన్యం సృష్టించిన గూడే శరీరం. అందులో పుట్టే భావాలు పక్షులు. అవి తొడుక్కునే రెక్కలే ఆలోచనలు. అవీ ఎగురుతాయి. జీవితం విస్తరించిన మేర సంచరిస్తాయి. విన్నవి, కన్నవి అనుభవాలవుతాయి. వీటన్నింటి సమాహారమే- మనసు. అది అత్యంత శక్తిమంతమైనది, చంచలమైనది. ఎంత దూరాన్నైనా క్షణాల్లో చేరగలదు. తలచుకుంటే నిశ్చలంగా ఉండగలదు. అసాధ్యాన్ని సుసాధ్యం చెయ్యగలదు.
పంచభూతాలతో శరీరం తయారవుతుంది. ఆ తరవాతే మనసు నిర్మాణం జరుగుతుంది. శరీరం లేకుండా మనసు మనగలదా? లేదు. మనిషంటే ఎవరు? అతడి ఉనికి తెలిపేది ప్రధానంగా అతడి- ఆకృతి(రూపం). అంటే, శరీరమే కదా. ‘మనసు’- అనుసంధాన కర్తగా పనిచేసే మధ్యవర్తి. ఒక వైపు చైతన్యం మరోవైపు శరీరం ఉంటేనే కదా ఆ రెండింటి మధ్య వంతెనలా మనసు ఉండగలిగేది.
శరీరం నిండా చైతన్యం పరచుకొని ఉంటుంది. మనసూ చైతన్యాంశమే. కానీ, దేహం నుంచి వీడిపోయిన మనసు తెగిన గాలిపటం లాంటిది. దాని పయనం అగమ్యగోచరం. వీధుల్లో అక్కడక్కడా అర్థం పర్థం లేకుండా తిరిగే పిచ్చివాళ్లను గమనించండి. వాళ్లు వర్తమానంతో తెగిపోయిన మానసిక బాధితులు. ప్రస్తుత క్షణంతో వారికి ఏ సంబంధమూ ఉండదు. వాళ్లు అస్తమానం గతంతో సంభాషిస్తారు. అంటే, జరిగిపోయిన(దూరమైన) పాత సంఘటనలతో మాట్లాడటం.
ఇంటి కాపలాదారు గృహం వద్దే ఉండాలి. కానీ, బాధ్యతలు మరచి జులాయిలా షికార్లు చేయడంలో అర్థం ఉందా? లేదు. మనసులేని మనిషి మర యంత్రంతో సమానం. మనిషి- ఆలోచనలతో ఉన్నప్పుడు మనసు బయట ఉంటుంది. గమనింపుతో, ఎరుకతో ఉన్నప్పుడు మనిషి లోపల ఉంటుంది. మనసున్న మనిషే మనీషిగా మారతాడు. అందుచేత ‘మనసు’ మనిషి దగ్గరే ఉండాలి. అందువల్లే కఠోపనిషత్తు- ‘శరీరం ఒక రథం లాంటిది, మనసు ఆ రథాన్ని నడిపే సాధనం’ అని చెబుతోంది.
మనిషి(మనసు) ప్రమేయం లేకున్నా శరీరం తన విధులు చక్కగా నిర్వర్తిస్తుంది. లయ తప్పకుండా గుండె కొట్టుకుంటుంది. ఊపిరితిత్తులు శ్వాసక్రియలు జరుపుతూ ఉంటాయి. ఔషధ కర్మాగారమైన కాలేయం- శారీరకంగా అవసరమైన రసాయనాలు అందిస్తుంది. వడపోత కార్యక్రమం చేపడుతూ మూత్రపిండాలు రక్తశుద్ధి చేస్తాయి. తరాల నాటి పూర్వీకుల పోలికలు గుర్తుంచుకుని శతాబ్దాల తరబడీ పుట్టే సంతానానికి అచ్చుగుద్దినట్లు చేర్చుతుంది. ఈ క్రియలన్నింటికీ చైతన్యం పునాదిగా పనిచేస్తుంది. ఆ రెండింటికీ మనసు తోడైతే మూడూ ఒక్కటవుతాయి. అప్పుడు, ‘త్రికరణ శుద్ధి’ నెలకొంటుంది. ‘ధ్యానం’ పురివిప్పుకొంటుంది. ఆ స్థితిలో చేపట్టే ప్రతీపని ఒక ‘ప్రార్థన’ అవుతుంది.
నిలువ ఉన్న నీరు చెడిపోతుంది. పారే నది ప్రయోజనకారి అవుతుంది. మనసు మంచిగా ఉండాలన్నా, ప్రజల శ్రేయం కోరే ఆలోచనలు కలగాలన్నా ముందు శరీరం బాగుండాలి. అందుచేత దానితో రోజూ వ్యాయామం చేయించాలి. యోగాసనాల వల్ల శరీరానికి క్రమత ఏర్పడి ఆరోగ్యం చేకూరుతుంది. మనసులో మలినశుద్ధీ జరుగుతుంది. పరిశుద్ధమైన మనసే ధ్యానానికి సిద్ధపడుతుంది.
3 565
తొలి తిరుపతి
తిరుపతి (తిరుమల), చిన్న తిరుపతి (ద్వారకా తిరుమల) ... ఈ క్షేత్రాలు ఎక్కడున్నాయో, వాటి ప్రాశస్థ్యం ఏమిటో ప్రత్యేకంగా చెప్పనక్కర్లేదు. అయితే వాటి స్థాయిలో ప్రాచుర్యం పొందని మరో తిరుపతి కూడా ఉంది. అదే తొలి తిరుపతి... శ్రీ శృంగార వల్లభ స్వామిగా శ్రీ మహవిష్ణువు వెలసిన పురాతన పుణ్యక్షేత్రం.
శ్రీ వేంకటేశ్వరస్వామి కొలువైన తిరుమల దేశంలోని ప్రాచీన ఆలయాల్లో ఒకటి. అయితే తూర్పుగోదావరి జిల్లా సామర్లకోటకు సుమారు 10 కి.మీ. దూరంలో ఉన్న తొలి తిరుపతి అంతకన్నా పురాతనమైనదని చెబుతారు. ఈ ఆలయంలో విష్ణుమూర్తి శిలారూపంలో దర్శనమిస్తాడు. తొలుత విష్ణువు వెలసిన చోటు ఇదే కనుక దీనికి 'తొలి తిరుపతి'గా పేరు వచ్చిందనీ స్థానికుల కథనం.
స్థల పురాణం ప్రకారం... రాజైన ఉత్థానపాదుడికి ఇద్దరు భార్యలు. రెండో భార్య కుమారుడు ఉత్తముడు తండ్రి ఒడిలో కూర్చొని ఉండగా, మొదటి భార్య కుమారుడు ధ్రువుడు కూడా వచ్చి తండ్రి ఒడిలో చేరబోతాడు. అతణ్ణి సవతి తల్లి పక్కకు నెడుతుంది. ఆవేదన చెందిన ధ్రువుడు తల్లి సూచన మేరకు విష్ణుమూర్తి కోసం తపస్సు చేస్తాడు. విష్ణువు ప్రత్యక్షమవగా, బ్రహ్మాండమైన ఆయన దివ్య తేజస్సును చూసి ధ్రువుడికి భయం వేస్తుంది. అతణ్ణి బుజ్జగించే సమయంలో విష్ణుమూర్తి శంఖ చక్రాలు చేతులు మారుతాయి. ధ్రువుడి కోసం తన రూపాన్ని చిన్నదిగా చేసుకొని, చిరునవ్వుతో కటాక్షిస్తాడు. తారామండలంలో నక్షత్రంగా నిలిచిపోతావని దీవిస్తాడు. శ్రీ శృంగార వల్లభ స్వామిగా శిలా రూపంలో ఆ క్షేత్రంలో నిలిచిపోతాడు. తనను దర్శించిన వారికి వారి ఎత్తులోనే కనిపిస్తాననీ వాగ్దానం చేస్తాడు. ఆయనకు దేవతలే ఆలయాన్ని నిర్మించారనీ, మహాలక్ష్మిని నారదుడు ప్రతిష్ఠించాడనీ స్థల పురాణం వివరిస్తోంది.. శ్రీ శృంగార వల్లభ స్వామిని పూజిస్తే పిల్లలు లేనివారికి సంతానం కలుగుతుందనే విశ్వాసం ఉంది.
