Devotional Telugu
Open in Telegram
An attempt to bring our Hindu Devotional information
Show more3 565
Subscribers
No data24 hours
No data7 days
No data30 days
Posts Archive
3 565
సూర్యుడిలా సాగిపో!
మనిషై జన్మించాక ఉదర పోషణార్థం అహరహం శ్రమించాలి మానవుడు. ఏదీ తనంత తాను చెంతకు రాదు. శోధించి సాధించాలి. కష్టపడి సంపాదించుకోవాలి. దేహదారుఢ్యం, తెలివి, విజ్ఞత, విచక్షణ పెంచుకుని నియమబద్ధంగా పనిచేస్తూ, ధర్మబద్ధంగా బతకాలి. పదిమందినీ బతికించాలి. పరుగెత్తే కాలంతోపాటు పరుగెడుతూ అలసత్వానికి దూరంగా విధ్యుక్త ధర్మాలను నెరవేర్చాలి. అలా చెయ్యకపోతే ఎన్నో ఇబ్బందులను ఎదుర్కోవాల్సి వస్తుంది.
పరికించి చూస్తే- ప్రకృతిలో పశుపక్ష్యాదులు, జంతుజాలాలు, వివిధ ప్రాణులు ఆహార సముపార్జన కోసం నిరంతరం ప్రయత్నిస్తూనే ఉంటాయి. పిపీలికాలు, తేనెటీగలు సైతం మనకెన్నో అంశాలు బోధిస్తాయి. శ్రమించి తేనె పెర(దొంతర)లను ఉత్పత్తి చేసే ఈగలను పొగపెట్టి తరిమి పారదోలినా, అవి ఇంకోచోట తమ ప్రయత్నాన్ని కొనసాగిస్తాయి. ఆహారాన్వేషణలో తమ మార్గానికెవరైనా అవరోధం కలిగించినా, పట్టించుకోక క్షణకాలం ఆగి మళ్ళీ నడక సాగిస్తాయి పిపీలికాలు. వాతావరణాన్ని అనుకూలం చేసుకొని చెట్లు చిగురిస్తాయి, పుష్పాలు వికసిస్తాయి, ఫలాలు పక్వమవుతాయి. మానవ శరీరం ధరించాక కండల్ని కరిగించి కొందరు శ్రమిస్తే- బుద్ధి, విద్య, తెలివి పెట్టుబడిగా ఇంకొందరు శ్రమిస్తారు. ప్రకృతి శక్తులు అననుకూలంగా ఉన్నా, వాటిని సానుకూలం చేసుకొని కర్షక కార్మికులు రాత్రింబవళ్లు కష్ట పడతారు. ఫలితాన్ని తామొక్కరే అనుభవించక పదిమందికీ పంచు తారు. పనిలోనే పరమాత్మను దర్శిస్తారు. శ్రమైక జీవన సౌందర్యానికి ప్రతీకలుగా నిలిచి అంతులేని ఆనందాన్ని పొందు తారు. వారి నిస్వార్థ, నియమబద్ధ జీవితం మనకాదర్శం.
కొందరు శరీరాన్ని కష్టపెట్టక కబుర్లతో కాలయాపన చేస్తూ బతికేస్తుంటారు. ఇంకొందరు కాలవిలంబన చేస్తూ నేటి పనిని రేపటికి వాయిదా వేస్తారు. నిత్యశంకితులుగా కొందరు తాము చేసే పనులు ఇతరులను మెప్పిస్తాయో లేదోనన్న ధర్మసంకటంలో పడి అసలు ప్రయత్నమే చెయ్యరు. అటువంటి వాళ్లంతా అభివృద్ధి నిరోధకులే. భవిష్యత్తు తరాలను నడిపించే యువత తమ ఉక్కు కండరాలకు, నరాలకు పని కల్పించక, విజ్ఞతకు పదును పెట్టకపోతే లోకం ఏ దిశగా నడుస్తుంది? నిర్ణయాలు త్రుటికాలం ఆలస్యమైనా మానవ జీవితాలకు పెనుముప్పు తప్పదు.
జనాన్ని రక్షించే లోకబాంధవుడైన సూర్యుడు ఎవరి ప్రమేయం లేకుండానే ఉదయిస్తాడు. ఆరోగ్యాన్ని, ఆహారాన్ని మనకందిస్తూ తన పనిని చేసుకుపోతూ వేళ మించగానే నిష్క్రమిస్తాడు. ప్రచండ తేజంతో వేసవిలో సాగే వేళ, ఆ ఉష్ణ తాపాన్ని తాళలేక మనం నిందిస్తాం. శీతగాలులు ఎముకలు కొరికే వేళ త్వరితంగా వచ్చి నులివేడిమినందిస్తే స్తుతిస్తాం. వీటిని పట్టించుకోడు ప్రభాకరుడు. తన పనిలో తాను సాగిపోతాడు. కార్యసిద్ధికి కర్తవ్యోన్ముఖుడిగా మారిన హనుమ, తన గమనంలో విపత్కర స్థితులను సమర్థంగా ఎదుర్కొని అంతులేని విజయాలను సాధించాడు. గేలిచేసినా లెక్కచెయ్యక వీధి దీపాల కింద చదివి విద్యావంతులైన వారెందరో. కష్టాల సంద్రాలను ఈది ఎవ్వరినీ లెక్కించక విశ్వ విజేతలైన మానవ శ్రేష్ఠులు ఎందరెందరో. చేసే పనిపట్ల అవగాహన, నిబద్ధత, నిజాయతీ, క్రమశిక్షణ కనబరిస్తే విజయం తథ్యం. పని ఎలాంటిదైనా, ఎంతటిదైనా దీక్ష, పట్టుదల ముఖ్యం. ఆటంకం కలిగించే పరిస్థితులను, వ్యక్తులను లెక్కించక, వారి వ్యాఖ్యలకు తల వంచక ధైర్యంగా, స్థైర్యంతో ముందుకు సాగడమే మనిషి కర్తవ్యం.
3 565
తిరుప్పావై
దైవానికి శరణాగతి చేయడం సమస్త సాధనాల సారం. అన్ని ధర్మాలను విడిచిపెట్టి భగవంతుణ్ని ఆశ్రయించడమే శరణాగతి. భక్తిలో నిమగ్నమై ప్రాపంచిక విషయాలను మరచి దేవదేవుణ్ని సదా స్మరించడం కీర్తించడం అంత సులువైన సాధన కాదు. ఎనిమిదో శతాబ్దానికి చెందిన వైష్ణవ సంప్రదాయంలోని పన్నెండు మంది విష్ణు భక్తులు నవవిధ భక్తిమార్గాల ద్వారా భక్తితత్వాన్ని ప్రచారం చేశారు. ఆళ్వార్లంటే శ్రీమహావిష్ణువు నిశ్చితంగా ఉన్నాడని నమ్మేవారు. సదా స్మరించడం వల్ల శ్రీహరి అనుగ్రహం లభిస్తుందని విశ్వసించేవారు. మానవుల హృదయాల్లోని అజ్ఞానాంధకారం దూరం చేసిన దీపం వెలిగించడానికే భూమి మీద వీరు అవతరించారని పెరియాళ్వార్(విష్ణుచిత్తుడు) రాసిన తిరుమొళి చెబుతోంది.
పన్నెండుమంది ఆళ్వార్లలో ఆండాళ్(గోదాదేవి) మాత్రమే స్త్రీమూర్తి. రామాయణంలో సీతమ్మలా ఆండాళ్ అయోనిజ. సీత భూజాత అయితే ఆండాళ్ విష్ణుచిత్తుడికి తులసివనంలో... నల సంవత్సరం, కర్కాట మాసం, పుబ్బా నక్షత్రంలో ఆషాఢ శుద్ధ చతుర్దశి రోజున దివ్యమైన రూపంతో అలౌకికమైన శిశువుగా లభించింది. విష్ణుచిత్తుడు శ్రీవిల్లిపుత్తూరులోని రంగమన్నార్ (వటపత్రశాయి) ఆలయంలో అర్చకుడు. దంపతులిద్దరూ విష్ణు భక్తులు. శిశువుకు గోదాదేవి అని పేరుపెట్టుకున్నారు. తలిదండ్రుల పెంపకంలో గోదాదేవికి విష్ణుమూర్తి అవతారమైన శ్రీకృష్ణుడిపై అనురక్తి పెరిగింది. యుక్త వయస్సుకు వచ్చిన తరవాత గోదాదేవి, శ్రీరంగనాథుణ్ని పతిగా పొందాలని తలచింది. పెళ్ళికాని పడుచులు, తమకు మంచి భర్తను ప్రసాదించమని ధనుర్మాసంలో శ్రీకృష్ణుణ్ని వేడు కుంటూ పాటలు పాడే సంప్రదాయం ఉంది, దీనినే కాత్యాయినీ వ్రతం అంటారు. ధనుర్మాసంలో పాడే ఈ పాటలకు ప్రత్యేకత ఉంటుంది. ఒక్కో పాశురం(గీతం) ఒక్కొక్క రోజు గానం చేయడం సంప్రదాయం. ఈ వ్రతాన్నే గోదాదేవి ఆచరించింది. ఆమె తన చెలులతో కలిసి, శ్రీకృష్ణుణ్ని భర్తగా పొందడానికై తిరుప్పావైని గానం చేస్తూ, ముప్ఫై రోజులు వ్రతం చేసింది.
తొలి పది పాశురాలు తిరుప్పావై ముఖ్యోద్దేశాన్ని తెలియ జేస్తాయి. చిత్తశుద్ధితో భగవంతుని ప్రార్థిస్తే వానలు కురుస్తాయి, పంటలు పండుతాయి... దేశం సుభిక్షంగా ఉంటుందని చెబుతాయి. తరవాతి పందొమ్మిది పాశురాల్లో, గోదాదేవి చెలులతో కలిసి పూలను సేకరిస్తూ, పల్లె వాతావరణాన్ని వర్ణించే అంశాలు ఉంటాయి. పక్షుల కిలకిలారావాలు రంగురంగుల పూలు, వెన్నను చిలకడంలోని సంగీత ధ్వనులు, ఆలమందల మెడలోని చిరుగంటల సవ్వడి, దేవాలయంలో వినిపించే శంఖారావం మొదలైన వాటి వర్ణనలు ఉంటాయి. ఉదయాన్నే గోదాదేవి ఒక్కొక్కరింటికి వెళ్ళి, తన చెలులను తట్టిలేపుతూ, వారిని నదిలో స్నానానికి సిద్ధం చేస్తుంది. ఆ గీతాల్లో విష్ణువు అవతారాలను పొగుడుతుంది. పరమాత్ముణ్ని నిద్ర మేల్కొలపడానికి ఆండాళ్ సుప్రభాతాన్ని ఆలపిస్తుంది. చివరి పాశురాలు భగవద్విభూతిని వర్ణిస్తాయి.
చివరి రోజు గోదాదేవి సాలంకృత కన్యగా శ్రీరంగనాథుడి గర్భగుడిలోకి ప్రవేశించి, స్వామిని గానంచేస్తూ అందరూ చూస్తుండగా స్వామిలో లీనమైపోయిందని ఐతిహ్యం. ధనుర్మాసంలో గోదాదేవి రచించిన పాశురాలు వైష్ణవ ఆలయాల్లో గానం చేయడం ఆచారం. తిరుమలలో సైతం ఈ నెలరోజులూ సుప్రభాత సేవలో తిరుప్పావై గానం చేస్తారు. ఆధ్యాత్మిక సాహిత్యంలో తిరుప్పావై ఒక విశిష్ట స్థానాన్ని సంపాదించుకుంది.
3 565
పంచేంద్రియాల్లో ప్రమాదకరమైంది ఏది?
కనిపించని ఏదో ఒక దివ్యశక్తి ఈ ప్రపంచాన్ని శాసిస్తోంది. ఆ శక్తినే దైవశక్తి అంటాం. అలాగే కనిపించని ఏదో శక్తి ఈ మనిషి జీవితాన్ని నడిపిస్తోంది. దాన్నే మనసు అంటాం. మనసు ఎక్కడుందో, ఎలా ఉంటుందో ఎవరికీ తెలియదు. మన శరీరంలో రక్తం ప్రవహించినంత కాలం ఆ మనసు ఆజ్ఞలు జారీ చేస్తూనే ఉంటుంది. మనం ఊపిరి తీస్తున్నంత కాలం, ఆ మనసు మనల్ని ఆడిస్తూనే ఉంటుంది.
మనసు సముద్రం లాంటిది. సముద్రం అనంతమైనది. అపారమైనది. లోతైనది. సముద్రంలో జలచరాలుంటాయి. జలసంపదలుంటాయి. అమృతం, హాలాహలం అక్కణ్నుంచే పుట్టాయంటాయి పురాణాలు. సముద్రంలోంచి ఉప్పెనలొస్తాయి. సముద్రం అందమైనది. కల్లోలమైనది. చెలియలికట్ట దాటనంతవరకు సముద్రంతో ఏ ప్రమాదం ఉండదు.
మనసూ అంతే! మనసు ప్రపంచాన్ని ఉద్ధరించగలదు. ప్రపంచాన్ని భస్మం చెయ్యగలదు. మనిషిలో సత్వగుణం అమృతం. సత్వగుణం పెంచుకుంటే మనిషి వల్ల సమాజానికెంతో మేలు జరుగుతుంది. తమోగుణం పెరిగితే జరిగేవన్నీ చెడ్డ పనులే!
నదులన్నీ సముద్రంలో కలుస్తాయి. ప్రపంచంలో విషయాలన్నీ మనసును చేరతాయి.
మనిషికి కన్ను, ముక్కు, చెవి, నాలుక, చర్మం అనే పంచేంద్రియాలున్నాయి. ప్రపంచంలో ప్రతి దృశ్యాన్నీ కన్ను ఆకర్షిస్తుంది. అందమైన వస్తువులన్నీ సొంతం కావాలనుకుంటుంది. చెవి మంచి, చెడు శబ్దాలను వింటుంది. మంచిని మాత్రమే గ్రహించి, చెడును విడిచిపెట్టగలిగితే మనిషి ఉన్నతుడవుతాడు. ముక్కు సువాసనలే పీలుస్తుంది. దుర్వాసనలను ఎలాగూ పీల్చదు. జిహ్వ రుచులను కోరుతుంది. దీంట్లో తినరానివి తినకూడదని విడనాడితే మనసు నిర్మలమవుతుంది. చర్మం సుఖాన్ని కోరుతుంది. ఇలా పంచేంద్రియాలు మనిషి మనసును, మంచి చెడులవైపు ప్రేరేపిస్తాయి.
పంచేంద్రియాల్లో ప్రమాదకరమైనది నోరు. ఇది రెండు పనులు చేస్తుంది- తింటుంది, మాట్లాడుతుంది. రెండూ మితమైనప్పుడే మనసు సత్వ సంపన్నమవుతుంది. అప్పుడే సమాజ సేవ, ఆధ్యాత్మిక చింతన, అరిషడ్వర్గాల అదుపు పెరిగి మానవ జీవితానికి సార్థకత చేకూరుతుంది.
ధర్మరాజు జూదమాడాడు. ఆస్తిపాస్తులను, భార్యను పణంగా పెట్టాడు. పరాజితుడయ్యాడు. అతడిలో తప్పున్నా లోకం అతణ్ని పన్నెత్తు మాటనలేదు. కారణం ఆయన మనసు వెన్న లాంటిది. దానధర్మాలు చేస్తాడు. దైవభక్తి కలవాడు. దుర్యోధనుడు అసూయాపరుడు కావడం, ధర్మవ్యతిరిక్తమైన పనులు చెయ్యడంతో అతడు లోక నిందితుడయ్యాడు. కారణం అతడి మనసు. సకల శాస్త్ర పారంగతుడు, పరాక్రమశాలి, సకల సంపన్నుడు రావణుడు. మనసు చెడ్డతనం వల్ల లోకనిందకు గురయ్యాడు. రాక్షస కులంలో పుట్టినా విభీషణుడు మనసును ధార్మిక చింతన వైపు మళ్ళించడంతో లోకం అతణ్ని మెచ్చుకుంది. అందుకే మనసును అదుపులో ఉంచుకోకపోతే జీవితం కష్టాల కడలి తరంగాల సంక్షుభితం అవుతుంది. మనసును అదుపులో ఉంచుకుంటే ఆనందాల నందనవన సంశోభితమే అవుతుంది!
3 565
బంధాలు-బంధనాలు
స్థిరంగా నిలబడి ‘ఒక అడుగు నువ్వువేస్తే నేను ఒక అడుగు వేస్తాను’ అంటే- ఆ బంధం నిలబడదు. బంధాలు పరస్పర అవగాహన, సహకారాలుంటేనే నిలుస్తాయి. ఏ సంబంధం నిలబడాలన్నా ఆదాన ప్రదానాలు ముఖ్యం. అది లోపిస్తే సాంద్రతను కోల్పోతాయి. జీవితంలో సంబంధాలు అసలు ఎందుకు ఏర్పడతాయని ఎవరూ ఆలోచించి ఉండరు. ఒకేలాంటి అభిరుచులవల్లో, ఇరుగు పొరుగువారై ఉండటమో, పిల్లల కారణంగానో అనుకుంటారు. వయసు పెరిగాక, అనుభవం గడించాక అర్థమవుతుంది- సంబంధాలు యాదృచ్ఛికంగా ఏర్పడవని, దానికి ఏదో ఒక కారణం ఉంటుందని.
ఒకరి ఎదుగుదలకు మరొకరు సహకరించుకోవడం కోసం మనుషులు కలుస్తారు. కొన్ని సంబంధాలు అద్భుతంగా ఉంటే, మరికొన్ని ఉన్నట్లు కనిపిస్తాయి. బాధలకు అవే కారణమూ అవుతుంటాయి. ప్రతిదీ ఒక పాఠం నేర్పుతుంది ఎదిగేందుకు. ఒక జీవిగా ఎదగాలంటే అనుభవం అవసరం. జీవితంలో ఎన్నో దశలు... ఎందరో తారసపడుతుంటారు. లక్ష్యం నెరవేరగానే వెళ్ళిపోతారు.
మహాభారతంలో కురుక్షేత్రానికి ముందు నకులుడు భీష్ముడితో తప్పించలేని ఈ కురుపాండవ ఘర్షణకు అసలైన కారణ మేమిటన్నప్పుడు- ‘అన్యోన్యత లోపిం చడమే. దాని వల్ల అపార్థాలు పెరుగుతాయి’ అంటాడు భీష్ముడు. క్షమాగుణం బలమైన స్థిరమైన బంధాలకు తోడ్పడుతుంది. అన్ని సంప్రదాయాలకు చెందిన సాధువులు నిరంతరం క్షమించే గుణం కలిగి ఉండటమే ప్రేమ అంటారు. అదే బంధాలకు మూలం.
పై కప్పును నిలబెట్టేందుకు ఏర్పరచే నాలుగు స్తంభాలు ఎడంఎడంగానే ఉండాలి స్థిరంగా ఉంచడానికి దగ్గరికొస్తే కప్పు కూలిపోతుంది. స్వేచ్ఛలోనే బంధాలు వికసిస్తాయి. బంధనంలో ముడుచుకుపోతాయి. సంబంధం ఎప్పుడూ ఒక ఒడంబడిక కాదు. అవగాహనతో ఏర్పడేది. అవగాహనకోసం వినాలి. అర్థమయ్యేలా తెలియబరచాలి. ఏ బంధంలోనూ ఆశలన్నీ సంపూర్ణంగా నెరవేరవు.
ఒక సంబంధం తెగిపోయినంత మాత్రాన మరేం జరగదు. ఇతర సంబంధాల విషయాలకు సంబంధించిన బాధ్యత మిగిలే ఉంటుంది. ‘మన చేతుల్లో ఏముంది’, ‘మిగిలిందేమిటి’, ‘సంతోషమే లేదు’ అనుకుంటూ మనిషి తరచూ చలించిపోతుంటాడు. కోల్పోయిన సంబంధాల మీదే దృష్టి నిలిపినప్పుడు కొనసాగాల్సిన సంబంధాలకు న్యాయం చేయడం కష్టమవుతుంది. నిన్నటి బాధల తలపులతో విలువైన వర్తమానాన్ని జారవిడుచుకోకూడదు.
బోధించడమైనా, నేర్చుకోవడమైనా, సంబంధాలను బలపరచుకోవడమైనా- ఎందులోనైనా... శ్రద్ధగా వినేవారే ఇతరులకంటే ముందుంటారు. ఒక మంచిశ్రోత మాట్లాడే మాటల్నే కాదు, మాటలకందని భావాల్నీ గ్రహించగలుగుతాడు. దానికి ‘మనసు’ పెట్టాలి.
ప్రతి పురాణగాథ సంబంధాలకు దర్పణం పడుతుంది. ఈర్ష్యలు, అసూయలు, కోపతాపాలు సంబంధాలను ఎలా నాశనం చేస్తాయో వివరిస్తుంది. బంధాలు బలంగా కొనసాగాలంటే ఇతరులను అర్థం చేసుకుంటే సరిపోదు. నువ్వు అర్థం చేసుకున్నావనే నమ్మకం అవతలివారిలో కలగాలి. అది అవతలివారు తెలుసుకోవాలంటే నువ్వు వారి కోణంలో వ్యక్తపరచగలగాలి. ‘నేను నిన్ను ప్రేమిస్తున్నాను’ అని చెప్పడం ఒకటైతే, ‘నాకు తెలుసు నువ్వు నన్ను ప్రేమిస్తున్నావని’ అనేది మరొక విధం.
ఎవరి దృష్టిలో వారు వ్యక్తపరిస్తే అవతలివారి మనసు గెలుచుకోవచ్చు. ఎదుటివారి కోణంలో తెలియజెప్పినప్పుడు వారి హృదయాన్నే గెలవవచ్చు.
3 565
మనసు పోకడలు
మనిషి నడతలన్నీ మనసు పోకడలను బట్టే ఉంటాయి. మనో చాంచల్యం మన చర్యల్లో కనిపిస్తుంది. మన చర్యలను బట్టే మనకు గౌరవ మర్యాదలుంటాయి. వైద్యులు వ్యాధి మూలాలను పట్టుకుంటేనే రోగం మందులతో శాంతిస్తుంది. తగిన చికిత్స చెయ్యడానికి వీలవుతుంది. తల్లిదండ్రులు తమ సంతానం గొప్పవాళ్లు కావాలని ఆరాటపడతారు. వారి దృష్టిలో గొప్పదనం అంటే ధనార్జన, హోదా, అధికారం, సాంఘిక గౌరవం. ఇవన్నీ ఉన్నా శీలం లేకపోతే, ఏమీ లేనట్లే. శీలం గలవారినే జ్ఞానం ఆశ్రయించి ఉంటుంది.
జ్ఞానం అంటే కేవలం వివేకంతో కూడిన లోకజ్ఞానం కాదు. పరిణతి చెందిన ఆధ్యాత్మికతనే శుద్ధ జ్ఞానం అంటారు. జ్ఞానానికి శుద్ధత ఏమిటి అనుకోవచ్చు. బంగారాన్ని శుద్ధి చేస్తేనే మేలిమి బంగారం అవుతుంది. జ్ఞానిక్కూడా సందేహాలు ఉంటాయి. జనక మహారాజు వద్దకు శుకమహర్షి వెళ్ళి సందేహాలు తీర్చుకోవడం ఇందుకు ఉదాహరణ. జ్ఞానం ఒక మహా సముద్రం. దాన్ని యథాతథంగా స్వీకరించగల శక్తి అందరికీ ఉండదు. ఒక్క అగస్త్యుడే సముద్రాలను ఆపోశనం పట్టినట్లు చెబుతారు. సముద్ర జలాలను సూర్యుడు ఆవిరిగా మార్చి మేఘాలకు అందిస్తాడు. అప్పుడు వాటిలోని లవణ లక్షణం పోతుంది. మేఘాలు శుద్ధ జలాలను వర్షిస్తాయి. అవే కొండలనుంచి సెలయేళ్లుగా, నదులుగా ప్రవహిస్తాయి. ఆ నీరు ప్రాణదాతగా ప్రకృతికి జీవం ప్రసాదిస్తుంది.
జ్ఞానమూ అంతే. జ్ఞానమూలం పరమాత్మ. ఆయన నుంచి శబ్ద బ్రహ్మంగా వేదాలు మహర్షులు విన్నారు. అవి శ్రుతులయ్యాయి. వాటిని మననం చేసుకుంటూ సుబోధకంగా శిష్య పరంపరకు చెప్పారు. అవే స్మృతులు. అనేక వడపోతల తరవాత జ్ఞానం శుద్ధం, పరిశుద్ధం సుగ్రాహ్యంగా మారి జిజ్ఞాసువులకు అందుబాటులోకి వచ్చింది.
మనిషి ఇంటిని, ఒంటిని శుభ్రం చేసుకుంటాడే తప్ప మనసులోని మకిలిని వదిలించాలనుకోడు. అసలు సమస్య అంతా మనసుతోనే. దాన్ని శూన్యం చేసుకోవాలంటారు జ్ఞానులు. కొందరు తీవ్రమైన సాధనలు చేసేవారు ‘మనోనాశ్’ అనే స్థితికి చేరతారు. ఇది దాదాపు అవధూత స్థితి. భారతీయ ఆధ్యాత్మికత ఆత్మస్వరూపుడైన అంతర్యామికి తొలి తాంబూలం ఇస్తుంది. అంతర్యామి దాసుడే అసలైన భక్తుడు. అంతర్యామి అంటే ఆలయ శిలామూర్తి కాదు. సృష్టిలోని సమస్త ప్రేమ, ఆనందం, అనంతత్వం- ఇవన్నీ కలగలిసిన ఒక దివ్యతేజం. విశ్వంభరగా ఉన్న నిత్య చైతన్యం. దాన్ని దర్శించాలంటే మనం ఆత్మస్థితికి చేరుకోవాలి. మనం మోస్తున్న మనసు, బుద్ధి అనే రెండు బరువుల్ని వదిలించుకోవాలి, లేదా జ్ఞానాగ్నిలో దహనం చెయ్యాలి. అంటే వాటి ప్రమేయం నశించాలి.
‘నేను’కు నిర్వచనాలు మనసు, బుద్ధి. ‘నేను’ నశించాక మిగిలేది అనంతుడు, అజేయుడు, శాశ్వతుడైన బ్రహ్మమే. సృష్టిలో బ్రహ్మం కానిదేదీ లేదంటుంది యోగవాసిష్ఠం. అంటే, మనంకూడా బ్రహ్మస్వరూపులమే. కాని, ఆ జ్ఞానం మనకు లేదు. అలా లేకపోవడమే మాయ. మన జీవితకాల యుద్ధం ఈ మాయతోనే. మాయను జయిస్తే, ప్రపంచమనే మత్తు, భ్రమలోంచి బయటపడితే, ఎదురుగా కనిపించేది అంతర్యామే. ఆ మహా తేజస్సు ఎప్పుడూ, అలాగే, అక్కడే ఉంటోంది. ఎప్పుడు మనం అంతర్యామిని చూడగలుగుతామో అక్కడితో మనం గమ్యం చేరినట్లే. మన జీవనయానం ముగిసినట్లే. ఇవి జరగాలంటే- మనసు పోకడల్ని గమనిస్తూ, మనల్ని మనం ఎప్పటికప్పుడు కాపాడుకుంటూ ఉండాలి. తడబడకుండా, దారి తప్పకుండా...
3 565
సత్యాన్వేషణ
సత్యాన్ని తెలుసుకోవడానికి సగుణమా లేక నిర్గుణమా అన్న మీమాంస సదా సాగుతూనే ఉంటుంది. మీమాంస వదిలి సాధనా మార్గంలో పయనిస్తేగాని సత్యదర్శనం కలగదంటారు దార్శనికులు. ఈ భూమి మీద కళ్లు తెరవగానే కనిపించేది వస్తు ప్రపంచం. ఆకాశం, నక్షత్రాలు, గ్రహాలు; జలమయమైన సముద్రం, నదులు, కొలనులు, బావులు; అంబరాన్ని సంబరంగా తాకడానికి చేతులు చాచే వృక్షాలు; వాటిని నడిపించే కనిపించని వాయువు, నేలపై ఉన్నా నింగికి ఎగసిపడే నిప్పు, రగిలే నాల్కలు; కొండలు, కోనలతో నిండిన నేల- పంచభూతాలను మనిషి ఎలా కాదనగలడు? అంపశయ్య పైన ఉన్న భీష్మాచార్యులకు మొదట విశ్వం, తరవాత విష్ణువు కనిపించారు. సర్వ వ్యాపకమైన విష్ణుత్వాన్ని కురుపితామహుడు కృష్ణుడిలోనే చూడగలిగాడు. తెలిసినదాన్నిబట్టి తెలియనిదాన్ని పట్టుకోవడం సులభం. ఉట్టి కొట్టగలిగితే, స్వర్గం ఎక్కగలనన్న ధైర్యం, ఉత్సాహం ముందుకు నడిపిస్తాయి. ఈ సృష్టిలో ప్రతి జీవి పుట్టి, పెరిగి, గిట్టడం ప్రకృతి సహజమైన మార్పు.
విశ్వరహస్యాన్ని తెలుసుకోవడానికి మూడురకాల ప్రామాణికాల్ని విజ్ఞులు నిర్దేశించారు. ప్రత్యక్ష, అనుమాన, శబ్దప్రమాణాలు మూడూ సత్యాన్వేషణకు తగిన ఉపకరణాలు. కళ్లతో చూడాలి, మనసుతో తెలుసుకోవాలి, జ్ఞానసంపదతో కూడిన వేదమంత్రం ఉపాసించాలి. ఈ మూడింటికీ లొంగని మహత్త్వం యోగసమాధిలో హృదయనేత్రానికే అవగతం అవుతుంది. ఎవరికి వారే అనుభవం ద్వారా అనుభూతి చెందినప్పుడే సత్యసాక్షాత్కారం సాధ్యమవుతుందంటారు యోగీ శ్వరులు. చూపు, చూడదగినది, చూడగలవాడు (దృష్టి, దృశ్యం, ద్రష్ట) మూడూ ఒకటి అయితే నిత్యం, నిఖిలమైన సత్యస్వరూపం విశ్వవ్యాప్తమై విష్ణుసహస్ర నామమై ధ్వనిస్తుంది.
జ్ఞానమార్గంలో కొనసాగేవారికి నిర్గుణధ్యానం, కర్మ మార్గంలో పయనించేవారికి సగుణధ్యానం కలిసివస్తాయని, గురువులు శిష్యుల స్థాయినిబట్టి మార్గనిర్దేశం చేసేవారు. నేను సర్వజ్ఞుడిని అన్న అహంకారంతో అగ్నికార్యాలు మానివేసిన జ్ఞానికన్నా నిష్కామకర్మ చేసే యోగి మిన్న- అంటున్నది భగవాన్ ఉవాచ. విష్ణు సహస్రనామాలు వల్లెవేస్తూ, పాపపు పనులకు ఒడిగట్టేవాడిని నామాపరాధి అంటున్నది శ్రీభాగవతం. సగుణ, నిర్గుణమనే విభేదం కేవలం తాత్కాలికం. ఏరు దాటడానికి తెప్ప అవసరం. ఏరు దాటాక తెప్పను వదలకపోవడం అవివేకం. ఇహపర సాధన జీవిత పరమార్థం. జ్ఞానం, కర్మ, యోగం, భోగం- అన్నీ సత్యశిఖరానికి చేర్చే సోపానాలు. అంచెలంచెలుగా నిచ్చెనమెట్లు ఎక్కినప్పుడే నింపాదిగా చేరవలసిన చోటుకు చేరుకోవచ్చు. నేలవిడిచి చేసే సాముగరిడీలను నమ్ముకుంటే వైకుంఠపాళి పాము నోట్లో పడ్డ పాచికవలె జారిపడతారు. వైకుంఠానికి బదులు వైతరణికి తరలిపోగలరు. లోకంలో ఒకరి సహాయం లేకుండా జీవించడంగాని, కార్యసిద్ధి పొందడంగాని సాధ్యం కాదు. పొట్టు సాయంలేకుండా బియ్యపు గింజ మొలవదు. తోడూ నీడా లోకసహజమైన జోడుగుర్రాలు. సగుణం కాదని నిర్గుణం కోసం వెంపర్లాడితే గాడితప్పి బండి బోల్తా కొట్టవచ్చు. సాధన, ఉపాసన జోడుగుర్రాల్లాంటివి. ఈ రహస్యం తెలుసుకున్నప్పుడు నాణేనికి బొమ్మ-బొరుసు లాంటివే సగుణ నిర్గుణ సాధనామార్గాలన్న సమరస భావన కలుగుతుంది. సాధన వేగవంతమై యోగం వరిస్తుంది. సచ్చిదానందం అంటే అచ్యుతానంద గోవిందుడేనన్న సత్యం బోధపడుతుంది.
3 565
నిశ్శబ్ద మార్గం
ఒక పౌర్ణమి రోజున బుద్ధుడికి జ్ఞానోదయమైంది. ఆ వారమంతా ఆయన మౌనంలోనే ఉన్నారంటారు. ఒక్క మాటైనా మాట్లాడలేదు. పురాణగాథల ప్రకారం స్వర్గంలో దేవతలు భయపడిపోయారట. వాళ్లకు తెలుసు- కొన్ని లక్షల సంవత్సరాలకోసారి ఎవరో బుద్ధుడిలా వికసించడం జరుగుతుందని. ఇప్పుడు ఆయన మౌనంలో ఉన్నాడు.
దేవతలు ఏదైనా మాట్లాడమని ఆయనను కోరారు. అప్పుడాయన- ‘తెలిసినవారికి అర్థమవుతుంది నేనేం చెప్పకపోయినా... తెలియనివారికి నేనేం చెప్పినా బోధపడదు. ఇది అంధుడి ముందు వెలుగును వర్ణించడంలాంటిది. జీవితంలోని అమృతాన్ని రుచిచూడని వారితో నేనేం మాట్లాడినా వ్యర్థం. అందుకే ఈ మౌనం. పవిత్ర గ్రంథాలు ఏనాడో చెప్పాయి- ఎక్కడ మాటలు ఆగిపోతాయో, అక్కడ సత్యం మొదలవుతుంది’ అన్నాడు.
బుద్ధుడి మాటలు కచ్చితంగా నిశ్శబ్దాన్ని సృష్టిస్తాయి. ఎందుకంటే ఆయన నిశ్శబ్దానికి ప్రతిరూపం. అదే జీవానికి మూలం, అన్ని రుగ్మతలకూ ఔషధం.
మనుషులు కోపంగా ఉంటే మౌనాన్ని పాటిస్తారు. ముందు అరుస్తారు, తరవాత నిశ్శబ్దం ఆవరిస్తుంది. తెలివైన వారూ చాలా సందర్భాల్లో మౌనంగా ఉండిపోతారు.
మాటల ఉద్దేశం నిశ్శబ్దాన్ని సృష్టించడానికే. మాటలు శబ్దానికి కారణమైతే వారు లక్ష్యాన్ని ఇంకా చేరుకోలేదని అర్థం. ‘శబ్దాలు, మాటలు ఏదైనా వ్యక్తపరచడానికే. అవి అనుబంధోత్పత్తి మాత్రమే. దానికంటూ అస్తిత్వం లేదు. ఆలోచనను వ్యక్తపరచేందుకు వాహకనాళం. ఒక మట్టికుండలాంటిది... మట్టికాదు... ఓంకారం అసలైనది’ అంటారు ఆది శంకరాచార్య మాండూక్యోపనిషత్తులో.
మనసులోని రొద దేని గురించి? ధనం, కీర్తిప్రతిష్ఠలు, సంబంధబాంధవ్యాలు... శబ్దం ఏదో ఒక దాని గురించి. దేని గురించీ కానిది నిశ్శబ్దం. నిశ్శబ్దం మూలం... శబ్దం ఉపరితలం.
మొదటినుంచీ బుద్ధుడిది సంతృప్తికరమైన జీవితం. ఏ సుఖమైనా కావాలనుకుంటే చాలు- ఆయన పాదాల దగ్గరుండేది. వెళ్ళి ప్రపంచాన్ని చూడాలనుకున్నాడు. తనకు తానుగా యథార్థం తెలుసుకోవాలనుకున్నాడు. తన స్థానాన్ని, భార్యను, కొడుకును వదిలిపెట్టాడు. నిశ్శబ్దం ఎంత దృఢంగా ఉంటే లోపలి నుంచి తలెత్తే ప్రశ్నలు అంత శక్తిమంతంగా ఉంటాయి. ఆయనను ఏదీ ఆపలేదు.
ఎటువంటి మనిషైనా జీవితంలో కొన్నిసార్లైనా మౌనంగా ఉండే పరిస్థితులు తలెత్తుతుంటాయి. ఎందుకంటే మనసులో, హృదయంలో జరుగుతున్నదాన్ని సంపూర్ణంగా ఏ మాటలూ వివరించలేవు. మౌనం శక్తిమంతమైన సందేశాలను అందిస్తుంది. సహనం, మౌనం- రెండూ బలమైన శక్తులు. సహనం మానసికంగాను, మౌనం భావోద్వేగాలపరంగానూ అని అర్థం చేసుకోవాలి. మనిషి తన సహజ స్వభావాన్ని తెలుసుకోవాలి. సహజ లక్షణాలుగా భావించే శాంతి, కరుణ, ప్రేమ, స్నేహం, సంతోషం... ఇవన్నీ నిశ్శబ్దం నుంచి పుట్టేవే. నిశ్శబ్దం బాధను, అపరాధాన్ని, దుఃఖాన్ని మింగేస్తుంది.
వివేకంతో ప్రవర్తిస్తే ప్రతి ఒక్కరూ కష్టాలసాగరం దాటవచ్చు. సుఖాల తీరం చేరుకోవచ్చు. ఎవరైనా మౌనంగా ఉండిపోయారంటే వారు మాట్లాడలేకపోయారని, ఓడిపోయారని కాదు. అర్థం చేసుకోలేనివారితో వాదించడం ఇష్టంలేక అలా ఉండిపోయారనుకోవాలి.
