కర్పగాంబాళ్ బంగారు కాసులమాల
చెన్నై మైలాపూర్ లో వెలసిన ప్రసిద్ధ కర్పగాంబాళ్ కపాలీశ్వర ఆలయం గురించి అందరికీ తెలిసిందే. 1950 సంవత్సరం నుండే అమ్మ అమ్మగారు శ్రీమతి ఆనందవల్లి మరియు ఇతర స్నేహితులతో కలిసి ప్రతిరోజూ ఈ ఆలయంలో లలితా సహస్రనామ పారాయణం చేసేవారు. ఆ సమూహానికి శ్రీమతి ముత్తులక్ష్మీ అమ్మాళ్ నాయకురాలు. ఈ బృందాన్ని "కర్పగాంబాళ్ సహస్రనామ గోష్ఠి" అని పిలిచేవారు. ముత్తులక్ష్మీ అమ్మాళ్ గారిని అందరూ “గురు పాటి” అని పిలిచేవారు. మా అమ్మగారు ఆ బృందానికి కార్యదర్శిగా వ్యవహరించేవారు. వారు రోజూ సహస్రనామం పారాయణం చేయడమే కాకుండా పండుగ సమయాల్లో ఆలయ సేవా కార్యక్రమాల్లో కూడా పాల్గొనేవారు.
1970లో ఒక రాత్రి గురుపాటి గారికి కలలో కర్పగాంబాళ్ అమ్మవారు దర్శనం ఇచ్చి, "మీరు ప్రతిరోజూ నా కోసం సహస్రనామం పారాయణ ఛేస్తున్నారు కదా, నాకు బంగారు సహస్రనామ కాసులమాల కావాలి. విశాలాక్షి, కామాక్షిలా నన్ను కూడా అలంకరించండి. మీరు చేయగలరా?" అని అడిగింది.
గురుపాటి గారు కల గురించి గోష్ఠిలో చెప్పగా, అందరూ ఎంతో ఆనందంతో ఆ బంగారు కాసులమాల తయారీకి సమ్మతించారు. అనేకమంది భక్తుల నుంచి విరాళాలు సేకరించి తయారు చేయాలని నిర్ణయించారు.
సంవత్సరాలు గడుస్తున్నా కానీ, ఆ మధ్యతరగతి మహిళల సమూహం తయారీకి కావలసిన మొత్తాన్ని సేకరించలేకపోయారు. కొంతమంది సూచించడంతో, 1978లో గురుపాటి గారు, మా అమ్మగారు తదితరులు పరమాచార్య స్వామివారి మార్గదర్శనం కోసం కాంచీపురం మఠానికి వెళ్ళారు. వారు దర్శనం కోసం ఎదురు చూస్తుండగా, మఠంలో పని చేస్తున్న వ్యక్తి వచ్చి “స్వామివారు పిలుస్తున్నారు. వెంటనే లోపలికి వెళ్లండి” అన్నారు. లోపలికి వెళ్లగానే స్వామివారిని చూసి ఆనందపరవశులయ్యారు. వీరు ఏమీ మాట్లాడక ముందే, “కాసులమాలకి బంగారం, డబ్బు తక్కువ పడిందా?” అని స్వామివారు ఆడగగానే వీరు ఆశ్చర్యపోయారు. “దిగులుపడకండి. అమ్మే అడిగింది కాబట్టి, అమ్మే అన్ని ఏర్పాట్లు చేస్తుంది. విశాలాక్షి అమ్మవారికి, కామాక్షి అమ్మవారికి, కాసులమాలలు ధనవంతుల సహాయంతో తయారు అయ్యాయి. కానీ కర్పగాంబాళ్ అమ్మవారి కాసులమాల భక్తితో తయారవుతుంది.” అని స్వామివారు అభయమిచ్చారు. “మీ బృందానికి 'కర్పగం సువాసిని సంఘం' అని పేరు పెట్టి ఎక్కువగా సువాసిని పూజలు, బాల పూజలు నిర్వహిస్తూ ఉండండి.” అని ఆశీర్వదించి ప్రసాదం ఇచ్చారు.
స్వామివారి ఆదేశాన్ని ఖచ్చితంగా పాటించడంతో, బంగారం, డబ్బు విరివిగా సమకూరాయి. 1982లో బంగారు సహస్రనామ కాసులమాల తయారీ ప్రారంభమైంది. ఈ బాధ్యతను ‘వుమ్మిడి బంగారు కణ్ణన్’ గారికి అప్పగించారు. ప్రతి బంగారు నాణెం, ఒకవైపు అమ్మవారి నామంతో, మరొకవైపు ఆలయ చిహ్నం – వెనుకవైపు అమ్మవారు, ముందువైపు శివలింగాన్ని ఆరాధిస్తున్న నెమలితో రూపొందించారు. కాసులమాల తయారీ పురోగతిని ఎప్పటికప్పుడు కంచి మఠం ద్వారా మహాస్వామి వారికి తెలియజేస్తున్నారు. స్వామివారు మఠం వేద పాఠశాల నుండి కొంతమంది పండితులను పంపి కాసులమాలలో లిఖిస్తున్న అమ్మవారి నామాలు, వాటి వరుస క్రమాన్ని పరిశీలించారు.
ఈ గొప్ప కార్యక్రమానికి, హిందూ ధార్మిక బోర్డు, కొంతమంది ఆలయ కమిటీ సభ్యులు, పనీపాటా లేని కొన్ని సామాజిక సంఘాలు మరియు సంఘ వ్యతిరేక శక్తుల రూపంలో ఎన్నో అడ్డంకులు వచ్చాయి. కానీ స్వామివారి ఆశీస్సుల వల్ల మరియు మేనేజింగ్ డైరెక్టర్ సుగవనేశ్వరర్, తక్కర్ కుప్పుస్వామి, ప్రధాన అర్చకులు విశ్వనాథ శివాచార్యులు, న్యాయవాది కృష్ణస్వామి వారల సహాయంతో కాసులమాల తయారీ పూర్తయ్యింది. 1986 ఫిబ్రవరి 26న ఈ లలితా సహస్రనామ బంగారు కాసులహారాన్ని కర్పగాంబాళ్ అమ్మవారికి సమర్పించాలని నిర్ణయించారు. ఈ కార్యక్రమానికి వివేక్ & కో నిర్వాహకులుగా వ్యవహరించాలని ఆదేశించారు.
అయితే 1986 జనవరి 20న, మా నాన్నగారికి ఆరోగ్య సమస్యలు వచ్చి, ఆసుపత్రిలో చేర్చారు. ఆయన స్పృహ కోల్పోయి, చేతులు, కాళ్లు కదలకుండా పోయాయి. డాక్టర్లు కూడా నమ్మకం లేక, "ఇక 48 గంటల కంటే ఎక్కువ జీవించలేరు" అని తేల్చేశారు. అమ్మ మానసికంగా పూర్తిగా విచలితమై, పూజ గదిలో ప్రార్థనలో నిమగ్నమయ్యారు. గురుపాటి గారు ఇతర సభ్యులు, వుమ్మిడి కణ్ణన్, వివేక్ గారు అందరూ కలిసి పూర్తయిన కాసులమాల తీసుకుని స్వామివారికి చూపించడానికి కంచి మఠానికి వెళ్లారు. వారిని చూసి, "మీ కార్యదర్శి ఎందుకు రాలేదు?" అని అడిగారు స్వామివారు. బాధతో మా నాన్నగారి పరిస్థితిని వివరించగా, స్వామివారు మాలను చూసి, "ఈ మాల బాగా తయారయ్యింది. అమ్మవారికి ఈ మాల సమర్పించటప్పుడు మీ కార్యదర్శి కూడా ఉంటారు. భయపడకండి!" అని ప్రసాదం ఇచ్చారు. వారందరూ నేరుగా మా ఇంటికి వచ్చి ఈ శుభవార్త చెప్పారు.
ఎంతటి అద్భుతం! అదే సమయంలో ఆసుపత్రి నుంచి ఫోన్ వచ్చింది – మా నాన్నగారు స్పృహలోకి వచ్చి బాగానే ఉన్నారు! వైద్యులు ఆశ్చర్యపోయి “ఏదో అద్భుతం జరిగింది” అన్నారు. నాన్నగారు మరుసటి రోజు డిశ్చార్జ్ అయ్యి, స్వయంగా నడుచుకుంటూ ఇంటికి వచ్చారు.